శంభో శంకర జగద్గురుం
https://cherukuramamohanrao.blogspot.com/2017/07/blog-post_9.html
సదాశివ సమారంభాం శంకరాచార్య
మాధ్యమాంl
అస్మదాచార్య పర్యంతం వందే గురు
పరంపరాంll
ద్వాపరమున శ్రీకృష్ణునివలె కలియుగమున ఏకైక జగద్గురువు శంకరాచార్యులవారు.
వారినుండి మొదలయి నేటివరకూ వచ్చే సకల శంకర పీఠముల గురువులూ
జగద్గురువులే. దీనిని బట్టి భూమిపై నడయాడి, సనాతన ధర్మమును పునః ప్రతిష్ఠ
చేసిన ఆ మహనీయుడు సాక్షాత్ శంకరావతరమేనని చెప్పక తప్పదు.
శంకరుల వారి కాలమును క్రీ.పూ. 509 యని సోపపత్తికముగా నిరూపించే
వ్యాసమును గతములో నేను బ్ర.శ్రీ. కోట వెంకటాచలము గారి రచనలను ఆలంబనగా
తీసుకొని అందజేయుట జరిగినది. ఆయన జీవించిన కాలములోనే వారి జీవిత చరిత్ర
‘శంకర విజయము’ అన్న పేరున చిత్సుఖాచార్యులవారు వ్రాసియుండినారు.
తదనంతరము పుంఖానుపుంఖములుగా అనేక ‘శంకరవిజయములు’ వెలుగు
చూసినవి. ఈ అన్నింటిలోనూ శంకరులవారు అపర శంకరులని తెలియ
జేయుటయూ జరిగినది.
అట్టి శంకరవిజయములలోని ఒకదానిలో వ్రాసిన ఈ శ్లోకము నా మనసునకు
హత్తుకొన్నది. ఆ శ్లోకము ఇది.
అజ్ఞానాంతర్గహన పతితా నాత్మవిద్యోపదేశైః
త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప
పాపచ్యమానాన్
ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో
నిష్పతంతి
శంభోర్మూర్తి శ్చరతి భువనే
శంకరాచార్య రూపా II
ఈ శ్లోక భావము ఏమిటంటే ‘అజ్ఞానము అను అడవి నడుమ పడి, సంసారము అన్న
మంటల సెగల పొగలచే ఉడికి పోవుచున్న లోకమును అంటే మానవులను
బ్రహ్మవిద్యోపదేశములచే కాపాడుటకు మౌనము వీడి మర్రిచెట్టు మూలము నుండి
బయలుదేరి వచ్చుచున్న ఆ శంభుడు అనగా ఆ దక్షిణామూర్తి జగద్గురు శంకరాచార్య
స్వరూపుడై భూమిపై తిరుగు చున్నాడు.’
వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం
సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్ |
చిత్రం వట తరోర్మూలే
వృద్ధాఃశిష్యా గురుర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం
శిష్యోస్తు చ్ఛిన్న సంశయాః ||
ఇక్కడ దక్షిణామూర్తిని గూర్చి స్తోత్రము చేస్తూ మర్రిచెట్టు క్రింద మౌనముద్ర వహించిన
గురువు వృద్ధులగు మునిజనములకు జ్ఞానము, పెదవి కదపకుండానే,
పంచుతున్నాడట.
మరి ఈ కలికాలములో అజ్ఞాన తిమిర బంధురులై, భోగాలాలసులై,
పరమతాక్రాంతులై, పరిపరి విధముల పలు మాయలచే వంచింపబడి, వాసనా
పయోనిధిలో తలమునకలగుచున్న మానవాళిని ఉద్ధరించుటకు ఆ మహనీయుడు
మౌననమును వీడుటకు కూడా వెనుకాడక సాక్షాత్ శంకరాచార్యుల రూపములో
భూమి పైకి దిగివచ్చినాడు.
ఈ శ్లోకమును చదవండి. జగద్గురువులు శంకరులే అని తెలియజేప్పుచున్నది.
దుష్టాచార
వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే l
సఎవ శంకరాచార్యః
సాక్షాత్ కైవల్యనాయకఃll
అసలు ఈ విషయమును పుష్టి చేస్తున్నదా అన్నట్లు యజుర్వేదములోని
రుద్రాధ్యాయములోని పంచమానువాకంలో 'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని
వుంటుంది. 'కపర్దినే చ' అంటే పెద్ద జడలు గలవాడు అని అర్థము. మరి
'వ్యుప్తకేశాయ చ' అంటే వెంట్రుకలు లేని వాడు అని అర్థము. అంటే శిరోముండనము
గావించుకొన్నవాడు అని అర్థము చేసుకొనవచ్చును. ఇవి రెండూ పరస్పర
విరుద్ధములు. శివుడు ముండిత శిరస్కుడై వుంటాడని ఎక్కడయినా మనకు
అగుపించే అవకాశము ఉందా! దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో పూర్ణ
ముండనం చేయించుకున్న శివ స్వరూపమును ఈ విధముగా తెలియజేసినారు:
‘చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి’
'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని ఎవరయితే కనపడుతున్నాడో ఆయనే
పరమశివుడు' అని. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్టను గుండు
మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్న
శంకరాచార్యులవారి చిత్రపఠము మన ఊహా ఫలకముపై నిలుచుట లేదా! కావున ఈ
శంకరాచార్యుల
వారు ఆ పరమశివుడే, అని మనకు ఇపుడు అర్థమగుట లేదా!
ఈయనకు 'ఆది శంకరాచార్యులు' అన్న ఒక సార్థక నామధేయము కలదు. ఈయనకు
ఆచార్య అన్న అనుబంధ (Annex) నామదేయముకలడు. కావున ఈయన కైలాసపతి
కాదు. ఈయన భారతీయ ప్రజ్ఞానపతి. కాలాంతరమున ఈయన
భారతఖందపుపీఠా నాలుగు చెరగులా మఠములు స్థాపించి ఆ పీఠాదిపతులకు
శంకరాచార్యులని ఆ పీఠములకు శంకర పీఠములని చిరస్థాయిగా చిరస్మరణీయ
నామములను ఏర్పాటు చేసినారు. మరి శంకరాచార్యులు అంటే వీరిని గుగుర్తించేది
ఎట్లు? అందుకే వీరు ఆది శంకరాచార్యులైనారు.
మొదట చెప్పిన శ్లోకములో ‘శంభు’ ‘శంకర’ అన్న రెండు పదములను మనము
చూస్తాము. ‘సంభావయతి, ఉత్పాదయతి ఇతి శంభుః’ అని నిరుక్తి చెబుతుంది. అంటే
కళ్యాణకారకములగు మన ఈప్సితములను సంభవింప జేసేవాడు. మనకు సదా
శుభమును ఉత్పాదన అంటే కలిగించేవాడు. అదేవిధముగా ‘శం కరోతి ఇతి శంకరః’
అంటే తన ఉనికినే వదలి మన క్షేమమును తన బాధ్యతగా తీసుకొనే వాడు
శంకరుడు. అట్టి ఆనందమునకు మూలము ‘శంభుడు’. ఎంతటి అర్థవంతమయిన
విషయమో చూడండి.
ఒకే ఒక విషయమును స్పృశించి ఈ వ్యాసమును ముగించుతాను. ఈ పదములు
గుణమునకు సంబంధించినవి. రూపము ఏదయినా కావచ్చు. కావున శివ కేశవ
భేదములను మరచి కళ్యాణ రూపుడగు పరమాత్మను స్మరించుదాము. ఒకరు ఎక్కువ
ఒకరు తక్కువ అని ప్రవచించుట అర్థవిహీనము, అసలు ఒక విధముగా మూర్ఖత్వము.
పామరులమగు మనము శంకరాద్వైతము యొక్క లోతులకు పోనవసరము లేదు. ఏ
రూపములో కొలిచినా అది
ఆపరమాత్మునికే చెందుతుంది. అందుకే
ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి
సాగరం l
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతిll
అన్నారు పెద్దలు.
చినుకు చినుకు రాలి చిన్న వాగుగ
మారి
వాగు వాగు చేరి వంకయౌచు
వంకలన్ని చేరి వరదలు నదులౌచు
వచ్చి కడలి జేరు వనరుగాను
అంటే కణకణము అణువణువూ పరమాత్మయనెడు మహా సాగరము చేరుచున్నవి
అనికదా అర్థము.
వైష్ణవులు కేశవ అన్నపదమును విష్ణువు కు ప్రతినామముగా తెలిపి ఈ శ్లోకమునకు
అర్థము చెబుతారు. కానీ నిజమునకు ‘కేశవ’ అను శబ్దము ‘క’ ‘అ’ ‘ఈశ’ యొక్క
సంకలనము, అనగా త్రిమూర్తులుగా భాసించే ‘కేశవ’ అను మహాసాగరమును
చేరుతాయి అని అర్థము.
ఇదియే అద్వైత సారాంశము. ఆ మాట చెప్పిన అపరస్వరూపులైన ఆది శంకరులే ఏకైక
జగద్గురువు.
స్వస్తి.
Neatly explained sir. Thanks for the information which we can't imagine to gather. Sincerely thank for your efforts sir.
ReplyDelete