Saturday, 31 March 2018

యామునాచార్యుడు


యామునాచార్యుడు
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_31.html
జయభేరి సినిమా మా బాల్యములో వచ్చిన ఒక కళా ఖండము. అందులోని పాటలు అనర్ఘ రత్నములు. 'మది శారదాదేవి మందిరము' 'రసికరాజ తగువారముకామా' అన్నపాటలు విన్నవారెవరూ వానిని మరువరు. అసలు పాటలు అన్నీ సందర్భ సహితములు కాబట్టి ఏ పాటకాపాటే సాటి. ఈ పాటల నుండి ' సినిమా కాస్త నడుస్తూనే వచ్చే 'సవాల్సవాలను చిన్నదానా సవాల్ పై సవాల్' అన్న పాట నేను వ్రాయబోవు ఈ యామునాచార్య వృత్తాంతమునకు ఒక ఆలంబనము. ఈ పాటలో నాయకుడగు నాగేశ్వరరావు గారు నాయిక అంజలికి పాటలో ఈ ప్రశ్నను విసరుతాడు. 'ఓ రూపవతీ నీవు కురూపివి కాదు, నిను కన్న తల్లి గొడ్రాలు కాదు...' ఈ ప్రశ్నను ఆమె సహచరులు రేలంగి రమణారెడ్డి గార్లు తృణీకరిస్తారు. తరువాత వేరే ప్రశ్న అడుగుట జరుగుతుంది. మనకు దానితో పనిలేదు. ఇటువంటి ప్రశ్నలు మనకు యామునాచార్యులవారి చరిత్రలో కనిపిస్తాయి. సినిమాలో జవాబు దాటవేస్తారు గానీ నిజానికి ఇటువంటి ప్రశ్నలకు ఎంత చక్కని సమాధానాలున్నాయో ఒకసారి వారి చరిత్రతోబాటూ తెలుసుకొందాము.
క్రీ.శ. 1150 వ సంవత్సరప్రాంతమునందు  పాండ్యరాజులు దక్షిణభారతమున సువిశాల ప్రాంతమును మీనాక్షీ మాత అనుగ్రహముతో మధురా పట్టణమును  రాజధానిగా చేసుకొని న్యాయమార్గములో  పరిపాలించేవారు.  దేశమంతా సుభిక్షంగావుండుటయేగాక, రా రాజులు సకలకళా పోషకులై విద్యావంత, విద్వాంస,  గురుకుల, పండితపరిషత్ పోషకులై  పాలితులయందు ఉత్తమ సాంస్కృతికాభిలాషను కలిగించుతూ ప్రజారంజకముగా పరిపాలించేవారు.
ఆ విధముగా పరిపాలించిన రాజులలోని ఒకరి కాలములో విద్వజ్జనకోలాహలుడు (అక్కియాళ్వాన్) అన్న పేరుగల పండితుడు వారి ఆస్థానములో వుండేవాడు. ఆయన గర్వి.  తన శాస్త్రపాండిత్యముతో మరియు వాదనా పటిమతో, ఎందఱో పండితులను ఓడించి  వారినుండి  కప్పము వసూలుచేసేవాడు. ఇవ్వలేనివారిపై రాజుతో అవాకులు చవాకులు చెప్పి శిక్ష వేయించేవాడు. ఈ ఆకృత్యమునకు లోనయిన వారిలో భాష్యాచార్యులు అనే పండితుడు కూడా ఒకడు. ఈయన  తన ఇంట్లో  అనేకులగు  విద్యార్థులకు  పేదలకు ఉచితముగానూ,ధనికులకు దక్షిణల ద్వారాను విద్యాబుద్ధులు గరిపేవాడు. అసలు శాస్త్రమే ఏమని చెబుతుందంటే
గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాI
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపపద్యతేII 
అంటే విద్యను అభ్యసించే విషయంలో 1.గురువును సేవించి,సపర్యలు చేసి ,2.ఆయనకు సమ్మతమైతే పుష్కలమైన ధనమును ఇచ్చి ,3.తన దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్య ను నేర్చుకోవడం  ఈ మూడు రకాలుగా తప్ప నాలుగో రకము లేదు అని.
భాష్యాచార్యులవారి గురుకులంలో యామునాచార్యుడు అనే విద్యార్థి ౘదువుకునేవాడు. యామునాచార్యులు పుట్టుకతోనే మహాప్రజ్ఞాశాలి. గురుకులంలో బాగా చిన్న వయస్సులోనే భాష్యాచార్యుల వారి పర్యవేక్షణలో సర్వశాస్త్ర పారంగతుడైనాడు. గురువుగారు ఏదయినా  పనిమీద బయటకివెళ్ళితే, నిర్వహణబాధ్యతను  యామునాచార్యులకు  అప్పగించి వెళ్ళేేవారు. ఒకసారి గురువుగారు బయటి వెడలిన సమయములో యామునాచార్యులు గురుకులమును  నిర్వహించుచుండినాడు. అప్పటికి అతని వయసు 12 సంవత్సరముల లోపే! 
కోలాహలుడు కర్ణాకర్ణిగా భాష్యాచార్యులు ఆయన పాండిత్యమును గూర్చి వినియుండినాడు. అయినా తనతో ఆయన వాదమునకు దిగలేదు కాబట్టి ఆయన పాండిత్యమును తృణప్రాయముగానెంచినాడు. అంతటితో ఊరుకొనక తన ఆధిపత్యమును చాటుకొనుటకు తన బంటును భాష్యాచార్యులవారి నుండి కప్పమును వసూలుచేసుకు రావలసినదిగా పనిచినాడు. గురువు లేదని చెప్పినా ధిక్కార స్వరముతో మాటలాడి గురుకుల విద్యార్థులను ఖిన్నులగావించినాడు. అప్పుడు యామునాచార్యులు ఓడినతరువాతనే కదా మేము కప్పము చెల్లించవలసినది మీ పండిత శ్రేష్ఠునితో వాదించుటకు నేను చాలు పద పోదామన్నాడు. అసలు విషయమేమిటంటే సాత్వికోత్తముడగు భాష్యాచార్యులవారు వుంటే ఈ వాడమునకు ఒప్పుకొనక కప్పమే కడుతానని చెప్పియుండేవారు. కొంత సమయము అందుకుగానూ అడిగియుండేవారు.
ఈ వార్త నగరమంతా ప్రాకిపోయింది. పండ్రెండు సంవత్సరముల బాలుడు కోలాహలునితో వాదించనున్నాడని తెలిసి నాగరికులు తండోపతండములుగా వాగ్వాదసమయమునకు సభామండపము చేరుకొన్నారు. ఆశ్చర్య చకితుడైన రాజు అన్నివిధములా వాదము వలదని నచ్చజెప్ప ప్రస్యత్నించినా యామునాచార్యులవారు వినలేదు. ఆసమయములో వేదశాస్త్ర విద్వన్మణియగు యామునుడు మధ్యందిన మార్తాండుడై అగుపించినాడు సభాసదులకు, ముఖ్యముగా మహారాణికి. ఆవిడ రాజుగారితో, పుంభావ సరస్వతిగా దోపు ఈ బాలుడు సామాన్యుడు కాదని నాకనిపించుచున్నది. ఈ సంవాదములో  విజయము ఈతనిదే అని నొక్కి పలికినది. రాజుకు కొలహలునిపైనే నమ్మకము. అందుచేత ఆ బాలుడు గెలిస్తే తన అర్ధ రాజ్యమును ఆతనికి పట్టము కడతానన్నాడు. కోలాహలునికి తగిన దండన ఇచ్చే అద్శికారమును కూడా యామునాచార్యునికే ఇస్తానన్నాడు. రాణి కూడా ఆవేశముతో కోలాహలుడు గెలిస్తే తాను రాణి పట్టమును త్యజించి దాసిగా శేషజీవితమును అంతఃపురములో గడుపుతాననింది.
యామునుని సుఖాసీనుని కమ్మని ఆసనము చూపించినాడు మహారాజు. కోలాహలుడు యామునుని అహంకారపూరితుడగు ఒక మూర్ఖ బాలకునిగానెంచి వాదము వలదన్నాడు. యామునుడు ససేమిరా అనుటతో వాదము మొదలైనది. ఇరువురికి హోరాహోరీగా వివిధ శాస్త్రాలలో వాదోపవాదాలుజరిగినాయి. పండితపరిషత్తు ఇద్దరిలో ఏఒక్కరినీ విజేతగా నిర్ణయించలేకపోయింది. చివరిగా ఇరువురికి వారి ఇష్టానుసారం తమ ప్రత్యర్థికి మూడుప్రశ్నలు వేయుటకు అవకాశం యివ్వబడింది. చెప్పలేక పోతే ఓడిపోయినట్లే! ఆస్థాన పండితుడన్న భయంతో పండితపరిషత్తు  అవకాశం ముందు కోలాహలుడికి కట్టబెట్టింది. అతడిప్రశ్నలన్నింటికి యామునుడు అలవోకగా సమాధానం చెప్పినాడు. రాజుగారికి, పండితపరిషత్తుకి, సభాసదులకి, ఆఖరికి కోలాహలుడికి కూడా యామునుని అతులిత ప్రజ్ఞాపాటవాలను చూసి అవాక్కయినారు.  ఆ బాలుడి అద్భత, అప్రతిహత ప్రతిభకు అక్కడివారందరికి  ఆశ్చర్యము, ఆనందము, ఆప్యాయత, ఆదరము, అనురాగము, అభిమానము కలబోసిన గౌరవము ఏర్పడింది.
ఇప్పుడు యామునాచార్యుడికి, విద్వజ్జన కోలాహలుడిని మూడుప్రశ్నలు అడిగే అవకాశంవచ్చింది. అప్పుడు వారిద్దరికి జరిగిన సంభాషణ యిది.:
యా: పండితవరేణ్యా! నేను ఇప్పుడు ఒకవ్యతిరేకార్థ వాక్యాన్ని, తరవాత రెండు అనుకూలార్థ వాక్యాలని చెపుతాను. మీరు ఆ మూడింటినీ ఖండించినారంటే నేను ఒడినట్లే! అట్లు కాదేని మీరు  ఓడినట్లే!
వి: 'ఓ! అలాగే! మొదటి వాక్యం చెప్పుమరి.' (అన్నాడు కోలాహలుడు జంకుతూనే)
యా: మీ తల్లిగారు గొడ్రాలు కాదు.
(ఈ మాటను ఖండిస్తే  తనతల్లి వంధ్య అని అంగీకరించినట్లేకదా! మరి  అపుడు తన పుట్టుక ప్రశ్నార్థకమౌతుంది. ఏమీ తోచక ... ఇట్లన్నాడు.)
వి: ఈలోగా నేను ఆలోచిస్తూంటాను. నీ రెండవ ప్రశ్న చెప్పు.
యా: ఈ రాజుగారు పుణ్యాత్ములు.
వి:మరి  మూడో ప్రశ్న కూడా అడుగు?
యా: ఈ రాణిగారు పతివ్రత.
విద్వజ్జనకోలాహలుడు, మొదటి ప్రశ్నకు అవుననలేక తదుపరి రెండు ప్రశ్నలకు కాదనలేక,  నిర్వీణుడై అవనత శిరస్కుడై ఉండిపోయినాడు.  పండిత పరిషత్తు యామునాచార్యులను విజేతగా ప్రకటించింది.
రాజుగారు యామునాచార్యులను ఈ విధముగా అభ్యర్థించినాడు.
రా: యామునాచార్యా! నీ నాలుకపై నలువ రాణి నాట్యమాడుచున్నది. నీ బుద్ధిని బృహస్పతి స్వంతము చేసుకొొన్నాడు. విష్ణువు నీ చిత్తమును ఆవహించియున్నాడు. మీ పాండిత్యము నిరుపమానము. దయతో మీ  ప్రశ్నలకు మీరే  శాస్త్ర ప్రమాణములతో సమాధానమిచ్చి మమ్ము సంతోషపరచండి.
యా: అలాగే ప్రభూ!
మొదటిది: విద్వజ్జనకోలాహల పండితవర్యుల తల్లిగారు వంధ్యకాదు అనేవాక్యం నేను కాదంటున్నాను. అంటే ఆమె గొడ్రాలే యనుచున్నాను. కారణం ఆయన తన  తల్లికి ఏకైకసంతానము. “ఏకపుత్రవతీ వంధ్యా” అంటున్నది శాస్త్రము. అంటే ఒకే కొడుకు కొడుకూగాడు ఒకకన్ను కన్నూ కాదు అన్న నానుడి ఉండనే ఉన్నది.  మహాభారతమునందలి ఉద్యోగపర్వము నందలి 147 వ అధ్యాయంలోని 18 వ శ్లోకం ఈ విధముగా చెబుతూవుంది
“ఏకపుత్రం అపుత్రం వై ప్రవదంతి మనీషిణః”
“ఒకే కొడుకు ఉన్నవాడు కొడుకులు లేని వానితో సమానమని  పండితులు అంటున్నారు” అని కదా దాని దాని అర్థము.
ఇక రెండవవాక్యమగు  'మహారాజుగారు పుణ్యాత్ములు' అన్న మాటను కూడా నేను కాదంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరెంత పుణ్యాత్ములైనా, శాస్త్రము
రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః ।
భర్తా చ స్త్రీకృతం పాపం శిష్యపాపం గురుర్వ్ర జేత్ ।।
అని చేబుతూవుంది.
కావున తన దేశ ప్రజలు చేసిన పాపము రాజుదే !
రాజు చేసిన పాపానికి పురోహితునిది లేక  మంత్రిది కూడా కావచ్చు బాధ్యత.
స్త్రీ చేసిన పాపానికి భర్తదే బాధ్యత. శిష్యుడు చేసిన పాపానికి గురువుదే బాధ్యత. కావున రాజు పుణ్యాత్ముడు కానేరడు.
మూడవ వాక్యము మహారాణిగారు పతివ్రతా అనుట సమంజసము కాదు.  మహారాజా! ఋగ్వేదమునందలి వివాహమంత్రములలో ఒకటి ఇలాగ అంటోంది:
సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరఃI
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌఃII
అని వివాహ సమయము లో వరుడు స్త్రీతో అంటాడు. అంటే
"నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలినారు. నాల్గవ వానిగా నేను నిన్ను ఏలబోవుచున్నాను." అని అంటున్నాడు.
 "ఈ విషయమును  కాస్త విశ్లేషించి చెబుతాను." అని అంటూ ఈ విధముగా చెప్ప మొదలిడుతాడు.
 "అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనాచూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపనుచూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చిన పిదప  "గంధర్వుని"కి అప్పగించి చంద్రుడువెళ్ళిపోతాడు.  ఆమెను ఇప్పుడు చంద్రుని సాక్షిగా గంధర్వుడుస్వీకరించినాడు. "లావణ్యవాన్ గంధర్వః" అన్నట్లు "గంధర్వుడు ఆమెలో అందాన్నిప్రవేశపెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు." ఆ విధముగా  అందచందములనిచ్చి, ఆమెను  అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెను గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించినాడు. "అగ్నిర్వై కామ కారకః" అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా *ఒక కన్య "చంద్రుని" ద్వారా "ఆకర్షణను," "గంధర్వుని" ద్వారా "లావణ్యతను", "అగ్ని" ద్వారా "కామగుణాన్ని" పొందుతుంది. పిమ్మట ఆమె వివాహమునకు యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను తగిన పురుషునికిచ్చి  వెళ్ళవలెను కనుక కళ్యాణ సమయములో ఆమెను వరునికి ఇస్తాడు. అలా ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు.
ఈ వివరణ విన్న మాహారాజు  పరమానందభరితుడై, యామునాచార్యులవారిని కౌగిలించుకొని, రాజ ప్రాసాదమున వుండజేసి ఆయన తలిదండ్రి గురువులను రప్పించి  తానుచెప్పినరీతిగా, ఒక శుభముహూర్తమున  యామునాచార్యులకి అర్ధరాజ్యమిచ్చి పట్టాభిషిక్తుని చేసినారు. విద్వజ్జనకోలాహలుడి అహంకారమడగుటచే ఆ పండితుడిని  గౌరవించి పంపినాడు యామునాచార్యులు.

యామునాచార్యుల యవ్వనం రాజభోగాలతో గడిచిపోయింది. వివాహమై పిల్లలు కూడా కలిగగినారు. తన జీవిత లక్ష్యాన్ని ఆయన మరచి సుఖాలకు బానిసైనారు. దీనిని గ్రహించిన గురువు శిష్యుని తనతో శ్రీరంగమునకు వచ్చుటకు పురిగొల్పి తన జన్మ కారణమును గుర్తుచేసినాడు. తదాదిగా యామునులు రంగనాథుని దివ్య చరణారవిందములకే తన జీవితమును అంకితము చేసినాడు.
వీరు  1.శ్రీస్తుతి 2.స్తోత్రరత్నం 3.గీతార్ధసంగ్రహం 4.ఆగమ ప్రామాణ్యం.5.సిద్దిత్రయం అన్న ప్రసిద్ధగ్రంధములను రచించినారు. రచనలలో చిన్నదైన శ్రీస్తుతిలో విష్ణువు ధర్మపత్ని శ్రీదేవిని స్తుతించారు. స్తోత్రరత్నం-ఇది మహావిష్ణువు గురించి 65 శ్లోకాల గ్రంథం. వైకుంఠంలో విష్ణు వైభవం, ఆ భగవంతని కొరకు జీవుడు అన్వేషణ, చివరికి నీవే శరణు అంటూ శరణాగతి చేయడం మొదలైన విషయాలున్నాయి. గీతార్ధసంగ్రహంలో భగవద్గీత సారంసం ముఖ్యంగా ప్రస్తావించారు.

ఆగమ ప్రామాణ్యముగా  దేవాలయ నిర్మాణము, విగ్రహ ప్రతిష్ఠ, ఆరాధన విధానము, సమగ్రముగా వివరించినారు.  సిద్ధాంతగ్రంధము  ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయ, సిద్ధాంతాలు ప్రస్తావించినారు.  వైష్ణవ మతప్రచారమునకు యామునాచార్యులు చాలా కృషి చేసినారు.
యామునాచార్యుల వారి గూర్చి తెలుసుకున్న శ్రీరామానుజాచార్యులు వారిని కలవాలనుకున్నారు. అలాగే శ్రీరామానుజాచార్యులవారే తన తరువాత
ఆచార్యపీఠాన్ని అధిరోహించాలనుకున్నారు యామునాచార్యులు. దురదృష్ఠవశాత్తు యామునాచార్యులు జీవించివుండగా వారిని శ్రీరామానుజాచార్యులు కలవలేకపోయినారు. అప్పటికే శ్రీరంగం బయలుదేరిన శ్రీరామానుజాచార్యులు అక్కడకి చేరుకున్న కొన్ని ఘడియలకే యామునాచార్యులు పరమపదించారు. యామునాచార్యుల వయస్సు అప్పటికి సుమారు 120 సంవత్సరములు.

అశ్రునయనములతో యామునాచార్యుల విగత దేహమును గాంచుతూ, ముడుచుకొని వున్న కుడిచేతి మూడువ్రేళ్లను గమనించినాడు. అందులో ఏదో పరమార్ధం వుందని
శ్రీరామానుజాచార్యులు ఆత్మజ్ఞానంతో యామునాచార్యుల అంతరార్ధం గ్రహించి ఈ విధముగా తన నిశ్చయమును బహిర్గతపరచినారు.
1.నేను వ్యాసమహర్షి రచించిన బ్రహ్మసూత్రాలకు శ్రీ వైష్ణవ సిద్ధాంతపరమైన రచన చేస్తాను- అన్నారు శ్రీరామానుజాచార్యులు. అంతే, ముడుచుకొన్న ఒక వ్రేలు పైకి లేచింది.
2. నేను ఆళ్వార్ల సంప్రదాయన్ని కాపాడుతాను- అనగానే యామునాచార్యుల రెండవ వ్రేలు తెరుచుకుంది.
3. నేను నా తర్వాత సమర్ధుడైన శిష్యునికి ఆచార్యపీఠాన్ని అప్పగిస్తా-అనగానే మూడో వ్రేలు కూడా తెరుచుకుంది.
ఇదంతాచూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయినారు.

అన్నప్రకారం శ్రీరామానుజాచార్యులు తన జీవిత కాలంలో నెరవేర్చి యామునాచార్యుల ఆత్మకి శాంతిని ప్రసాదించినారు. యామునాచార్యులకు 'ఆళవందార్' అన్న నామాంతరము కూడా కలదు.
స్వస్తి.

3 comments:

  1. మంచి విషయప్రస్థావన .ఇట్టి విషయములవల్ల పరిజ్ఞానము ఒనగూరుతుందిగాని వృధామాటలతో ఒకరినొకరు విమర్శలవల్ల లాభము సూన్యముగదా!

    ReplyDelete
  2. చాలాబాగా రాసారండి కాపీ చేసుకొనే అవకాశం ఇవ్వలేదు

    ReplyDelete