Sunday, 27 May 2018

ఏకనాథుడు (సంత్ ఏకనాథ్)


ఏకనాథుడు (సంత్ ఏకనాథ్)
https://cherukuramamohanrao.blogspot.com/2018/05/blog-post_27.html
ఏకనాథుడు (సంత్ ఏకనాథ్) వార్కరీ సాంప్రదాయానికి చెందిన మరాఠీ పండితుడు మరియు కవి. విఠోబాను ఆరాధించాడు. మరాఠీ సాహిత్యంలో ముందు తరము వారైన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు మొదలైన వారికీ, తరువాతి తరం వారైన తుకారాం, సమర్థ రామదాసుకీ ఒక వారధిగా నిలిచిన వాడు. ఆయన 16వ శతాబ్దం చివరిలో జీవించినట్లు ఒక అంచనా .  పైథన్ లోని 'ఏకవీర' వీరి కులదైవము. ఈయన భాగవత పురాణాన్ని ఏకనాథ భాగవతం పేరుతోనూ, రామాయణాన్ని  భావార్థ రామాయణము అన్న  పేరుతోను  మరాఠీలో వ్రాసినాడు. ఈయన శ్రీకృష్ణునికి పరమ భక్తుడు. రామునికీ అంతే. ఈయన ఉ మూలము అద్వైతమే! శంకరాచార్యుడు సంస్కృతంలో రాసిన 14 శ్లోకాల హస్తామలకం అనే రచనను 764 పద్యాలతో మరాఠీ లో ఆయన తిరగవ్రాసినాడు.

వాల్మీకి రామాయణము 24 వేలశ్లోకములు కలిగినదైతే వీరి రామాయణము 40 వెల శ్లోకములు కలిగియున్నది. ఈయన అపారమగు రామ భక్తుడు కూడా! ఈయనను గూర్చి ఒక చిన్న ఉదంతమును వుటంకించుతాను.
'యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రకృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనికదా ఆంజనేయ స్వామిని గూర్చి చెప్పినారు. రాముని ఎక్కడ కీర్తించుచున్నా సజల నయనుడై అవనత శిరస్కుడై, ముకుళిత హస్తుడై, తదేక ధ్యానములో ఉంటాడట ఆ రాక్షసాంతకుడు.
ఒక సందర్భములో తనరామాయణ కావ్యములో సీతమ్మను వెదకుటకై హనుమంతుడు లంకజేరి అచటి వన భవన విహారాదులను ఆశ్చర్యముగా తిలకించుచున్నాడట. ఈవిధమగు తన్మయతతో ఏకానాధుడు వ్రాస్తూవుంటే ఆంజనేయుడు అచటనే కూర్చుండి తదేకముగా ఆ రచనను పరికించుచున్నాడట. ఏకనాధుడు, తన రచనలో హనుమ ఆ లంకా పురిలో ఎచటికేగినా తెలుపు తప్ప వేరు కనబడుట లేదని వ్రాసినాడు. హనుమ ఆశ్చర్య చకితుడై ఏకనాధుని కట్టెదుట కనిపించి నాకు అంతా ఎరుపురంగులో కనబడితే నీవు తెలుపని వ్రాసినావే అని అడిగినాడట. దానికి ఆయన, నా అంతరాత్మ 'తెలుపు' అని తెలిపింది అందుకే అట్లు వ్రాసినాను అని చెప్పినాడట. పావని కూడా ఊరుకోలేదు. ఆయన వెంటనే స్వయముగా 'ఎర్రగా' వున్నట్లు చూసిన నేను చెబుతూవున్నా నీవు గ్రహించుట లేదే! అని గద్దించినాడట. వాదము పెరిగింది. ఇరువురూ రామ భక్తులగుటచే ఆ శ్రీరామచంద్రుని చేతనే  పరిష్కరింప జేసుకొన దలచినారు. రాములవారిని, వారు ప్రార్థించిన వెంటనే ఆయన ప్రత్యక్షమయి కారణము అడిగితే ఇరువురూ విషయమును వివరముగా చెప్పినారు. తప్పొప్పులను నిర్ణయించమన్నారు.  శ్రీరామచంద్రుడు  ఇరువురి దృష్టీ సరియైనదే అని తీర్పునిచ్చినాడు. ఆ తీర్పు ఇరువురికీ మింగుడుపడలేదు. అది ఎట్లు? మా ఇరువురిలో ఒకరిది మాత్రమె యదార్థము కావలెను అని ముక్తకంఠముతో అన్నారు. అందుకు శ్రీరామచంద్రుడు, హనుమంతుడు లంకాప్రవేశ సమయములో రాజసిక గుణముతో అడుగు పెట్టినాడు. తనకేంతసేపు అటు తనతండ్రి రామయ్య ఇటు తల్లి సీతమ్మ , ఇరువురినీ ఇడుముల బడదోసిన రావణుని రావణుని లంకనూ మట్టుబెట్టుటయే  తన లక్ష్యము. కావున రాజసముతో అరుణారుణ నేత్రుడైన హనుమంతునకు అంతా  రాజసవర్నమగు ఎరుపుగానే కనిపించింది అది వనమైన భావనమైనా ఆకయినా పూవయినా చెట్టయినా పుట్టయినా! పైగా అది త్రేతాయుగాపుమాట. ఎకనాతుడు కలియుగామువాడు. రసమచరిత సర్వస్వమూ ఆకళింపుజేసుకొన్న సాత్వికుడు, నిర్మలుడు, నిశ్చల భక్తి పరాయణుడు.  మరి తెలుపు సాత్వికతకు ప్రతీక. కావున ఆయన కంటికి అంతా తెలుపుగానే కనిపిస్తుంది కావున ఇరువురిదీ సబబే, సమంజసమే! అని అన్నాడట. భాస్క్తులిరువురూ ఆర్ద్రచిత్తులై స్వామికి సాష్టాంగ ప్రనామములను ఆచరించినారట.
చూచినారుకడా పరమాత్ముని భక్త వాత్సల్యము. వర్ణనలు ఎన్ని దాగినా, ఎట్లుసాగినా రాముడే నాయకుడు, రాముడే రక్షకుడు.
పైన తెలిపినది రామ పారమ్యతకు సంబంధించినది అయితే ఇపుడు చెప్పబోయేది శ్రీకృష్ణునకు సంబంధించినది. 
ఏకనాధులవారిని గూర్చి ఎన్నో ఉదంతములు ప్రచారములో వున్నాయి. అందులో ఇపుడు నేను తెలుపబోయేది ఒకటి. ఇది శ్రీ కృష్ణ సంబంధమయినది.

ఒకనాడు ఆయన తండ్రి శ్రాద్ధమున కై వివిధ రకములైన వంటకాలు చేయించినాడు. ఆ సువాసనలు వీధిలో పోతూ వున్న హరిజన బాలునికి నోరూరించినాయి. ఆ బాలుడు ఎకనాధుని వసకితి గుమ్మము వదలకుండా అక్కడే నిలుచుంది పోయినాడు. ఎదో పనిమీద లోపలినుండి గుమ్మము వద్దకు వచ్చిన ఎకనాతులవారు ఆ అబ్బయిని వివరములు అడిగినాడు. ఆ పిల్లవాడు అసలు విషయము చెబుతూనే, అతని హృదయము ఆర్ద్రతా భరితమయిపోయింది. శ్రాద్ధానికి చేసిన పిండివంటలను ఆ బాలునికి విస్తరి వేసి వడ్డించినాడు.ఆయన దృష్టిలో ఆ బాలుడు హరిజనుడు కాదడు సాక్షాత్తు హరియే! ఆ బాలకృష్ణుడే!

శ్రాద్ధ బ్రాహ్మణార్థమునకు వచ్చిన బ్రాహ్మణులు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహోదగ్రులై  ఎకనాథుతులవారిని అనరాని మాటలు అంటూ వెళ్ళిపోయినారు. అంతటితో వారు ఆగక బ్రాహ్మణ సంఘముచేత ఆయనను  వెలివేయించినారు. కానీ భక్తుడగు 
ఏకనాధుడు ఏ మాత్రమూ చింతించక తాను పరమ నిష్ఠాగరిష్ఠుడు భగవత్తత్పరుడూ    కావున ఆయన ప్రార్థనను ఆలకించి పిత్రుదేవతలే స్వయంగా వచ్చి ఆ నాటి శ్రాద్ధ కర్మలనుపూర్తి చేశి సంత్రుప్తులై ఎకనాథుని దీవించి వెడలినారట.
మరియొక ఉదంతము. ప్రతిదినమూ ఏకనాధులవారు  గోదావరి లొ స్నానంచేసి సంధ్యానుష్ఠానములు ముగించుకొని తిరిగి ఇంటికివచ్చి దేవతార్చన చేసుకొనే వారు. .ఒకరోజు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఒక కొంటెవాడు  అతనిపై తుపుక్కున ఉమ్మి నాడు. మైలపడుటచే ఏకనాధుడు కిమ్మనక మరల నదిలో స్నానం చేసి వచినాడు. మరల మరలా ఆ కుర్రడు 108 మార్లు వుమిశినాడు. ఆట్లు చేసి చేసి ఆతని నోరు ఎండిపోయింది. ఎకనాథుడు అన్నిమార్లూ ఏమాత్రము విసుగు చెందక స్నానమాచరించి వచ్చినాడు. పశ్చాత్తాప తప్తుడగు ఆ కొంటెవాడు, అన్నిమార్లు స్నానము చేసినా ఇసుమంతయూ విసుగు చూపని  ఏకనాథుని కాళ్ళపై బడి అతను క్షమాభిక్ష వేడినాడు. ఏకనాథులవారు  ఆ యువకుని లేవనెత్తి ఆలింగనము చేసికొని "నాయనా నీవు నాకు చాలా ఉపకారం చేసినావు. ఒకే దినం 108 సార్లు గోదావరిలో స్నానం చేసిన పుణ్యమును  నాకు దక్కించినావు." అని అతన్ని ఓదార్చి పంపినాడు. ఎకనాథులవారి సహనశీలతకు, క్షమా గుణానికీ జోహారు లర్పించి గ్రామవాసులంతా ఆయనకు పాదాభివందనము చేసినారు.
ఇట్టి సహనమును  'తితీక్ష'అని వివేకచూడామణి వర్ణిస్తుంది. సహనం శత్రువులను మిత్రులుగా చేస్తుంది. ఈ సహనాన్నే 'తితీక్ష'అని వివేకచూడామణి వర్ణిస్తుంది.
సహనం సర్వ దుఖానాం, అప్రతీకార పూర్వకం 
చింతా విలాపరహితం సా తితిక్షా నికాద్వాతే
సమస్త దుఃఖములను ప్రతీకారబుద్ధి తో కాక,చింత,బాధతో కాక సహనంతో అనుభవించు 
టయే తితీక్షగా నిర్వచించ బడినది.
అసలు రామాయణ భారతములలో కూడా వాల్మీకి వ్యాసులవారాలు 'క్షమయా (అనగా సహనము) నిష్ఠితాం జగత్' అని చెప్పినారు. 
సుఖదుఃఖా లను,మానావమానములను ఆగ్రహానుగ్రహములను, పై సమదృష్టిని  సాధించుటయే  సాధకునికి వుండవలిసిన సద్గుణము. 

స్వస్తి.


Saturday, 26 May 2018

భక్త అంబరీష

భక్త అంబరీష
https://cherukuramamohanrao.blogspot.com/2018/05/blog-post_26.html
అంబరీషుని చరితము సామాన్యముగా అందరికీ అంతో ఇంతో ఎంతోకొంత తెలిసియే వుంటుంది. భాగవతము చెరుకుగడ వంటిది. ఎంత నమిలినా ఎదో మధురిమ నాలుకకు తగులుతూనే వుంటుంది. అందుకే తిరిగీ ఒక పర్యాయము ఆ భాగవతోత్తముని చరిత్ర పునశ్చరణ చేసుకొందామన్న తలంపుతో తిరిగీ తెలుపవచ్చినాను.
అంబరీషుడు, నేను మే 23 న వ్రాసిన 'నాభాగ మహారాజు' కుమారుడు. ఈయన చరిత భాగవతము యొక్క నవమస్కందములో వస్తుంది. ఈయన అంబరీష చక్రవర్తిగా అందు అభివర్ణింపబడినాడు. అకుంఠిత వైకుంఠ నాథ భక్తుడు. 'నా స్పృశాత్ బ్రహ్మజాపోపి యన్నతః ప్రతిహతః క్వచిత్' అని భాగవతము తెలుపు చున్నది. అంటే ఈయన అపార విష్ణుభక్తుడగుటచే బ్రాహ్మణ శాపము కూడా ఆయనను ఏమీ చేయలేక పోయినది.
అసలు 'అంబరీషుడు' అన్న మాటకు అర్థము తెలుసుకొందాము.
'అంబాదికం రీశం నష్వరమితి జ్ఞానం యస్యాసు అంబరీషః' అని మహానీయులగు వంశీధర శర్మ గారు కొన్ని శతాబ్దముల క్రితము తమ వ్యాఖ్యానములో  వివరించినాడు. అంటే తల్లిదండ్రి ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమలు అన్న భవబంధములు నశ్వరము అంటే నశించేవిగా గుర్తించి తామరాకు నీటిబొట్టు చందముగా జీవితము సాగించినాడు తాను చక్రవర్తి అయివుండికూడా!  
అదే మహానుభావుడు చెప్పిన ఇంకా రెండర్థములను తెలుసుకొందాము.
అంబర అంటే ఆకాశము, ఇక్కడ ఆకాశమంత అన్న అన్వయమును తీసుకొనవలెను. ఈశ అనగా విస్తృతమైన జ్ఞానము. యస్యసః అంటే ఎవరికయితే వుందో! అంటే ఇప్పుడు మొత్తము కలిపితే ఆకాశమంత విస్తృతమైన జ్ఞానము ఎవరికైతే వుందో ఆయన అంబరీషుడు.
అం అంటే విష్ణువు. అచ్చులలో అకారమును నేను అని శ్రీ మహావిష్ణువే చెప్పు కొన్నాడు. ఏకాక్షర నిఘంటువును పరికించితే ఈ అర్థమును తెలుసుకొనవచ్చును. పరం అంటే పరమోత్కృష్ఠుడు అని ఈశ అంటే జ్ఞానము కలిగిన వాడు.
చూచినారా ఒక వ్యక్తి పేరుకు ఆయన గునగానములకు ఎంతటి సమన్వయముంటుందో మన పురాణములలో!
అట్టి అంబరీషుడు ఎట్టివాడనిన
చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద
పలుకులు హరిగుణపఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద
శ్రవములు హరికథాశ్రవణమంద
చూపులు గోవింద రూపవీక్షణమంద
శిరము కేశవ నమస్కృతుల యంద
పదము లీశ్వరగేహపరిసర్పణములంద
కామంబు చక్రికైంకర్యమంద

సంగ మచ్యుతజన తనుసంగమంద
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలమంద
రసనఁ దులసీదళములంద, రతులు పుణ్య
సంగతుల యంద యా రాజచంద్రమునకు.
అంబరీషునికి సదా మనసు ఎల్లపుడూ,  మధురిపుడు అనగా మధు అను రాక్షసుని సంహరించినవాడు మధుసూదనుడు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క  శ్రీ  (శుభకరమైన) పాదాల మీద మాత్రమే, మాటలు హరి గుణగాన సంకీర్తనములు పై మాత్రమే, చేతులు వైష్ణవాలయాలను శుభ్రపరచుట యందు మాత్రమే, చెవులు విష్ణుకథలు వినుటకు మాత్రమే, చూపులు గోవిందుని వివిధ రూపములను సందర్శించుట మీద మాత్రమే, తల కేశవుని ఎదుట అవనత శిరస్కుడై నమస్కరించుటకు మాత్రమే, కాళ్లు పరాత్పరునికి జేయు  ప్రదక్షిణలకు మాత్రమే, కలిగే ప్రతి కోరికా చక్రిసేవకు మాత్రమే,  సాంగత్యము హరిభక్తులతో మాత్రమే,  ఆఘ్రాణించేది విష్ణుభక్తుల పాదపద్మములను మాత్రమే, రుచి తులసీదళాలపై మాత్రమే,; ఆసక్తి పుణ్యవిషయాలపై, మాత్రమే  వుండేది. ఎంతటి మహానీయుడో గమనించండి. అట్టి మహాహానుభావుని చరిత్రను విన్నా మనము ధన్యులమే కదా!
ఆయన భక్తి తత్పరతకు అవ్యయానందభరితుడై అంబరీషుని అనుదినమూ శ్రీమహావిష్ణువు కోగిలించుకొనేవాడట. శ్రీవిష్ణు వక్షస్థల స్థితయైన శ్రీదేవి పాదముల స్పర్శ అంబరీషునికి కలుగుటచే ఆ దినమునకు బొక్కసమునుండి అయిన ఖర్చు బంగారు నాణెములుగా వర్షించేదట. అంటే ఆ చక్రవర్తికి ప్రజల నుండి పన్నులు వసూలు చేసే భాసరము వుండేదికాదన్నమాట. నేటి తార్కికులు ఈ మాటను నమ్మక పోవచ్చు. కానీ ఆ మహనీయుని భక్తిని,  సాధించుట వదిలిపెట్టండి, కోలువగలిగే యోగ్యత వున్నదా అన్నది వారు హృదయ పరిశీలన చేసుకోవలసిన విషయము. మనకు లేనిది ఎవరికీ ఉండదు అన్న భ్రమను ఉంచుకొనుట తప్పుకదా! అంతటి తో ఆగక నా రాచతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును, నిఖిలజగదవక్రంబును నగు చక్రంబు నిచ్చి చనియె అని వ్యాసునిమాటగా మన పోతన చెప్పినాడు.
మాసానాం మార్గశీర్షోహం అన్న భగవానుని మాటననుసరించి మార్గశిర ఏకాదశి మొదలు కార్తీక ఏకాదశి వరకు వ్రతమాచరించి బ్రాహ్మణ, ఋషి, మునివరులకు సంతృప్తిగా దానములోసంగి షడ్రసోపేతమయిన భోజనము పెట్టించి సంతృప్తులను చేసిన పిదప తానూ ద్వాదశి ఘడియలు పూర్తియగు లోపుననే దీక్ష విరమించదలచుకొన్న సమయములో
దుర్వాసో మహాముని తన శిష్యబృందముతో అచటికి వచ్చినాడు. అంబరీషుడు ఎదురేగి సకలమర్యాదలను జరిపి భొజనమునకు ఆహ్వానించినాడు. కాళిందీ నదికిబోయి స్నానమాచరించి మాధ్యాహ్నిక సంధ్య ముగించుకొని వచ్చెదనని చెపీ శిష్య పరివారముతో బయలుదేరి వెడలినాడు. ద్వాదశి ఘడియలు ముగిసి త్రయోదశి వస్తే వ్రతనిష్ఠ భంగమయి పాపము పొందవలసి వస్తుందన్న భయముతో అక్కడవున్న ఋషి మునుల సలహానదిగినాడు. వారు వారు అభక్షితం ఆపోశితం నాశితమం అంటే నీరు త్రావుటచే వ్రాతఫలమూ దక్కుతుంది ఆహారము తినకున్దానూ వున్నట్లవుతుంది అని సలహా ఇచ్చినారు. అందుకు సంతసించి మూడు ఉద్ధరుణుల (అతి చిన్న గుంత గలిగిన స్పూను) తులసి తీర్థమును తీసుకొన్నాడు. నదినుండి తిరిగివచ్చి విషయము తెలుసుకోన్నవాడై క్రుచ్ఛ అన్న భూతమును సృష్టించి దానిచే అసువులు బాయమని అంబరీషుని శపించినాడు. అంతే ఆయన విష్ణు చక్రము అంబరీషునికి రక్షణ అన్న విషయమును మరచుటచే అది ముందు కృచ్ఛను తెగటాతార్చి  తాపసిని వెంబడించింది. పరుగెత్తి పరుగెత్తి అలసినవాడై ఆయన బ్రహ్మ లోకమున బ్రహ్మను కైలాసమున శివుని శరణుజొచ్చినా వారు విష్ణువే కాపాడగలడని సలహా ఇచ్చినారు. విష్ణువు చెంతకుపోయి అర్థించితే తానూ భక్త పరాదీనుదానని తెలుపుతూ అంబరీషునే శరణు జొచ్చమని  ఆదేశించినాడు. అంతటి తపస్సంపంనుడు వెళ్లి అంబరీషుని పాదములపై పడినాడు. ఆయన సుదర్శనమును పరిపరి విధముల ప్రార్థించి దానిని ఉపశమింపజేసి,  సజలనయనుడై మునిపుంగవుని లేవనెత్తి ఆయన పాదములపై బడి తనను మన్నించమని కోరినాడు. అంతట దుర్వాసో మహాముని ఇదంతా అంబరీషుని భక్తి తత్పరత లోకమునకు చాటుటకే అన్న రహస్యమును వెల్లడించి భోజనముచేసి ఆయనను ఆశీర్వదించి తనదారిన శిష్యగణముతో మరలినాడు. ఇక్కడ కూడా లౌకికులు మహర్షి క్రిందబడినా పైచేయినాదే అని తన లోపమును కప్పిపుచ్చుకోన్నాదనుతకు అవకాశము వున్నది. కానీ మనము తెలుసుకోనవలసినది ఏమిటంటే ఆయా యుగములలో వారు అనృతమునాడి యెరుగరు. అందునా ఆయన మునివరేణ్యుడు. ఆ వాస్తవమును తెలుసుకొంటే అనుమానములకు తావు ఉండదు. ఆవిధముగా వ్రతము సఫలమైన తరువాత రాజ్య భారమును తనయులకప్పగించి విష్ణురూప పరివేష్టిత హృదయుడై వైకుంఠమునుజేర కానలకేగి తపమాచరించి హరి అనుగ్రహముచే వైకుంఠము చేరినాడు.
 ఈ యంబరీషు చరితముఁ
దీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం
డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా!

ఓ పరీక్షిన్మహారాజా! ఈ అంబరీషుని కథను ఆసక్తితో విన్న వారు, చదివిన వారు గొప్ప జ్ఞానవైభోగాలు పొంది పుణ్యాత్ములు అవుతారు అని శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్పినాడు.
కావున పాఠకులు తదేకముగా చదివి పరమాత్ముని భక్తి తత్పరులగుడురుగాక అని ఆ మహావిష్ణువును ప్రార్థించుతూ శెలవు తీసుకోనుచున్నాను.
స్వస్తి.

Thursday, 24 May 2018

మధుర (మధురాధిపతేరఖిలం మధురమ్.)


                                 మధుర
అధరం మధురం వదనం మధురం - నయనం మధురం హసితం మధురమ్,
హృదయం మధురం గమనం మధురమ్ - మధురాధిపతేరఖిలం మధురమ్.
మధురాధిపతేరఖిలం మధురమ్.
 ఇది వల్లభాచార్య విరచితమని, అందలి 8 శ్లోకములలో ఇది మొదటిదని, అందరకూ తెలిసినదే! వల్లభాచార్యులను గూర్చి మునుపు సవిస్తారముగా వ్రాసియుండినాను. మధురాధిప లోని 'మధురా' అన్న పదములో 'ధు' తీసివేస్తే 'మరా' మిగులుతుంది. వాల్మీకి మహర్షి 'మారా మారా' అంటేనేకదా 'రామ రామ' అయినది. కావున ఇక్కడ 'మరా' తిప్పిచదివితే 'రామ' అవుతుంది. మరి మనిషి తన జీవితకాలములో ఒక్కసారయినా 'రామ' అనకుంటే ఆ 'మధుర' లోవుందే మధ్యాక్షరము ఆవ్యక్తిని 'ధూ' 'ధూ' ధూ' అంటుందట. కావున మధురమగు ఆ 'రామ నామమును' ఒక్కసారయినా తలవండి.
స్వస్తి.

పరమేశ్వరుడు భక్త పరాధీనుడు (విద్యాపతి మిశ్రుని కథ)


పరమేశ్వరుడు భక్త పరాధీనుడు (విద్యాపతి మిశ్రుని కథ)
 పూర్వము అనగా ఒక 5,6 వందల సంవత్సరముల క్రితము వంగదేశమున విద్యాపతి మిశ్రుడు అన్న ఒక మహా పండిత,కవి, గాయకుడుండేవాడు. తానూ తన సతీసమేతముగా దైనందిన గృహ కృత్యములు ముగిసిన పిదప పరమేశ్వరుని పాదసేవానురక్తులై నిరంతరమూ నిత్య జీవితమును గడిపేవారు. ముఖ్యముగా మిశ్రులవారు పరమశివునిపై పరమ భక్తిప్రపత్తులతో అనేకానేక కీర్తనలను రచించుటయేగాక తదేక ధ్యాన తత్పరుడై, నిష్కల్మష భక్తితో తను వ్రాసిన గీతములను నోరారా, తనివిదీర ఆలపించేవాడు. పరమేశ్వరుడు ఆ గానరస గంగా ప్రవాహములో తన్మయుడై ఒలలాడజొచ్చినాడు. రానురానూ శంభునికి కైలాసమువీది మిశ్రుని గృహములోనే చెంతనవుండి మరీ గానామృతమును గ్రోలవలెనను తలంపుతో  వారి ఇంటికి ఒక పనివాని వేషములో వచ్చి ఆ దంపతుల నెంతగానో బ్రతిమాలి పనికి కుదురుకొని మిశ్రులవారి నీడగా వెన్నంటి ఆయన గీతములోని ప్రతి అక్షరము సంగీతమయమై శొభిల్లుచుండ విని పులకించి పోసాగినాడు. అట్లని యజమానులు చెప్పిన పనులు చేయుటలేదా అంటే, వారు చెప్పుటకు ముందే అన్ని పనులూ చేసి విద్యాపతిగారిని అనుసరించేవాడు.
ఒకానొకరోజు విద్యాపతి మిశ్రులు పొరుగు వూరికి పోవుట సంభవించినది. ఎండతీవ్రత అత్యధికముగా ఉండుటచే యజమానికి ఛత్ర ఛాయనందజేయుటకు సేవక రూపములో వున్నా శంకరుడు కూడా వద్దన్నా వినకుండా బయలుదేరినాడు. అసలు విషయము తెలియని మిశ్రులవారు ఆ అక్భిమానమును త్రోసిపుచ్చలేకపోయినారు. దారిన బడగానే పాతనండుకొన్నారు మిశ్రులవారు. గాన సుధ జాలువారుతూనే వుంది. తత్పరుడైన శివుడు తన్మయుడై వింటూ గొడుగు యజమానికి పట్టి నడుస్తూనే వున్నాడు. నడువగా నడువగా వారు ఒక నిర్జల ప్రాంతమున ప్రవేశించినారు. మిశ్రులవారికి దాహమై ఆమాట సేవకునితో తెలిపినాడు. కానీ ఆప్రాంతములో నేరేదోరుకడు అనికూడా హెచ్చరించినాడు. సేవకుని రూపములో వున్నశివుడు ప్రయత్నించుతానంటూ మరచెంబు పట్టుకొని కొంతదూరము పోయి యజామాని చూచుతలేదని గ్రహించి తన కాలి బొటనవ్రేలితో భూమిని గట్టిగా నొక్కినాడు. గంగాపతికి నీటికి కొదవా! తీయని చల్లని జలధార పైకి ఉబికి వచ్చినది. చేబుకు పట్టి ఆనీటిని యజమానికి ఇచ్చినాడు. దాహార్తి అధికముగాగాలిగిన మిశ్రులు అమృత తుల్యమగు ఆ నీటిని త్రావిన పిదప అనుమాన మానసుడై ఇచట ఎటువంటి జలాశయమూలేదే ఇంత మధురమైన నీరు ఎక్కడిదని నిగ్గదీసినాడు తన ఛద్మ వేషధారియైన అనుచరుని. ఇక నిజాము దాచాలేనని తెలుసుకొని పరమేషుడు ఆయనకు ప్రత్యక్షమై విషయమును చెప్పి తానూ అంతర్హితుడౌతానన్నాడు.  మిశ్రులవారు ఆయనను బ్రతిమాలగా, తన రహస్యము బయల్పడనంతవరకూ ఉంటానని మాట ఇచ్చుతచే పని ముగించుకొని ఇరువురూ ఇల్లుచేరినారు. తిరుగు ప్రయాణములో గొడుగు పట్టుకొనుట మిశ్రులవారి వంతయినది.
ఇంటికి వచ్చినదిమొదలు మిశ్రులవారి పత్ని తమ భృత్యునికి ఏపని చెప్పినా విద్యాపతి గారే చేయ మొదలిదినారు. ఎక్కడికీ సహించలేక ఆమె భర్తను' పనివానిని పనిచ్యనీకుండా మీరే పనిచేయుటకు పనివాదేందుకు' అని చీవాట్లు పెట్టింది. ఖిన్నుదయినా విద్యాపతి మిశ్రులవారు నిజాము చెప్పక తప్పలేదు. అంతట శివుడు నిజరూపముదాల్చి తానూ అంతర్దానమండుచున్నట్లు మిశ్రులతో చెప్పినారు. దంపతులిరువురూ ఆయన కాళ్ళపైబడి క్షమాపణ కోరుకోగా వారిని జీవితము ముగిసిన పిదప శివసాయుజ్యము చెర వరమోసంగి అంతర్ధానమందినాడు.
ఇటువంటి మహానీయులేందరో ఈ పుణ్యభూమి హారానికి మణులై ప్రకాశించినారు.  అట్టి భూమిపై పుట్టినందుకు మనమూ మనవంతు భక్తి విధేయతలతో భగవంతుని ప్రార్థించుదాము.
స్వస్తి.

Sunday, 20 May 2018

కాళిదాస మహాకవి లోకజ్ఙత! (విశ్లేషణ శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు)

కాళిదాస మహాకవి లోకజ్ఙత! (విశ్లేషణ శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు)
నిన్న మనం కాళిదాస -------శాకుంతలమ్ -నాటకంలో --చతుర్ధాంకంమ్ ---లో శకుంతల నత్తవారింటికి పంపే ఘట్టం విన్నాం. మనో విశ్లేషణా సామర్ధ్యం గురించి చర్చించాం. ఈరోజు అదే అంకంలోని మరోరెండు శ్లోకాలను పరిశీలిస్తూ , ఆమహాకవి లోకజ్ఙతను తెలిసికుందాం.
శకుంతలను శ్వశుర గృహానికి పంపుతూ అల్లుడు దుష్యంతున కొక సందేశ మిస్తున్నాడు. వినండి ఆశ్లోకం.
శ్లో : అస్మాన్ సాధు విచింత్య సంయమ ధనాన్ , ఉచ్చైః కులంచాత్మనః /
త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతం స్నేహప్రవృత్తించ తామ్ /
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యా త్వయా /
భాగ్యాయత్త మతఃపరం నఖలు తద్వాచ్యం వధూబంధుభిః //
అల్లునికి మామగారు సందేశంపంపేటప్పుడు చాలాఒద్దికగా మాటలువాడాలి. అల్లుడు నొచ్చుకోని విధంగా ఉండాలి.. చెప్పవలసిన విషయంమాత్రం మానరాదు. పాపం కణ్వుడు ఆశ్రమంలోలేని సమయంలో దుష్యంతుడు శకుతలను గాంధర్వవివాహం చేసికున్నాడు. మూడురోజులలో తనఅంతః పురానికి తీసికొని వెళతానన్నవాడు. ఆడినమాట నిలబెట్టుకోలేదు. శకుంతల చూద్దామా గర్భవతి. మరి యీపరిస్థితిలో గత్యంతరంలేక కణ్వుడు శకుంతలను పంపవలసి వచ్చింది. సరే తప్పదుదుగదా బాధ్యత నిర్వహించాల్సిందే! అందుకే యీ సందేశం.
అస్మాన్ సాధు విచింత్య సంయమ ధనాన్- శాంతమే ధనముగాగల మాగురించి జాగ్రత్తగా ఆలోచించుకో! అని ఒకఅర్ధం. ఇది బెదిరింపు మాఅనుజ్ఙ లేకుండా మాఆశ్రమంలో ప్రవేశించి మాపిల్లను వంచించావు. మాఓరిమి వలన బ్రతికిపోయావు. మాటతప్పావో జాగ్రత్త! అనిహెచ్చరిక !
ఇక రెండవ అర్ధం: సామ్యంగా, వినయంగా రాజా! మాపిల్లని పంపుతూ వస్తువాహనాదులను పంపలేదని యలుగకు. మేము కేవలము తపోధనులము. లౌకికమైన కాంచనాది ధనములు మాకడ నెక్కడివి? అందుచేతనే కానుక లేమియు నీయజాలక పోయితిమి. అనిరెండవ యర్ధము.
ఉచ్చైఃకులంచాత్మనః- ఉన్నతమైన మీవంశమర్యాద నాలోచింపుము. అనియొకఅర్ధము. మీవంశీయులిట్టి తులువతనమును యెన్నడైన ప్రదర్శించినారా? మరి నీవేల యిట్లొనరించితివి? అని నిగ్గదీయుట దీనియాంతర్యము.
చేసిన తప్పు దిద్దుకొని వంశగౌరవమును కాపాడుకొనుమని మంచిని బోధించుట మరియొక యర్ధము.
"త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతం స్నేహ ప్రవృత్తించ - బంధువులకెవరికీ తెలియకుండా నీకు లోబడిన యీమె ప్రేమ యెంతగొప్పదో ఆలోచించుకో! లోకంలో డబ్బుతో దేనినైనా కొనగలం కానీ ప్రేమను కొనలేము. అటువంటి యామెప్రేమను వృధా చేయకు,. అని యెుక అర్ధం;
ప్రేమకు మారురూపమైన మాపిల్లను అయినవారికెవరికీ తెలియకుండా మాయచేసి యనుభవించావు. ఇప్పుడీమెను కాదన్నావో స్త్రీ ప్రేమకు నీవు దూరమైపోతావు. జాగ్రత్త! అని మరో అర్ధం.
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషుదృశ్యాత్వయా- " రాజానాం బహువల్లభాః -రాజులకు చాలామంది భార్యలుంటారట! వారికన్నా భిన్నంగా మా అమ్మాయిని చూడమని( అంటే రాణినిచేయమని) నేను అడగటంలేదు. అందరివలెనే యేలుకో! ప్రత్యేకతలేమీ చూపకు ,అనిఒకఅర్ధం;
సా మా - ఆమె యెవరనుకున్నావు. సాక్షాత్తూ ఆలక్ష్మియే విష్ణుఅంశా సంభూతుడవగు నిన్ను వెదికికొనుచూ వచ్చింది. (నా విష్ణుః పృధివీపతిః- అనిగదా) కాదన్నావో బ్రష్ఠుడ వౌతావని హెచ్చరిక!
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యా - అందరివలెనే సాధారణమైన మర్యాదను మాపిల్లపట్ల చూపిన చాలునని మరియొక యర్ధము.
భాగ్యాయత్త మతః పరమ్ - తరువాత దానియదృష్టం. ఎలాజరగాలో దానిజీవితం అలాజరుగగలదు.అని ఒకఅర్ధము. అదియదృష్టవంతురాలే ! మహారాణియే యగును లెమ్ము అని మరోఅర్ధం;
న ఖలు తద్వాచ్యమ్ వధూబంధుభిః- ఇకనాపై బంధువులు అల్లునకు జెప్పుట పాడిగాదు. అని ఒకవైపు. ఆడపిల్లవైపు వారు యింతకన్నా చెప్పరాదుగదా! యికనీభార్యను యెట్లేలు కొనదగునో నీకు చెప్పవలసిన పవిలేదులే యని మరొక వైపు సా భిప్రాయముగా కణ్వుని సందేశమును కాళిదాసు చిత్రించి తన లోకజ్ఙతను వెల్లడించినాడు.
స్వస్తి!

Saturday, 19 May 2018

క్రోధో వైశ్వానరో దేవో


కోపము - తాపము
క్రోధో వైశ్వానరో దేవో ఆశా వైతరిణీ నది
విద్యా కామదుఘాః దేనుః సంతుష్టిః నందనం వనం
తన క్రోధమగ్ని గాంచగ
తన ఆశే వైతరిణిని  తప్పక చేర్చున్
తన విద్య కామధేనువు
తనతృప్తే నందనమ్ము తలవగ రామా!
కోపము అగ్ని వంటిది. అది తననూ కాల్చుకొంటుంది పరులనూ నిర్దాక్షిణ్యముగా కాల్చివేస్తుంది. ఇక ఆశ వైతరిణీ నది వంటిది. ఈ వతరినీ నదిని గూర్చి ఒక్కమాట చెప్పుకొందాము. ఇది వంద యోజనాల వెడల్పు ఉంటుంది. చిక్కని రక్తము, చీము కూడా. భయంకర  జలచరాలు, ఒక్క క్షణం కూడా భరించలేని దుర్వాసన కలిగియుంటుంది.  ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి   తను చేసిన  పాపాలకు ఫలితం అందులో మునిగి అనుభవించవలసిందే. అందుకనే తమ వారి కోసం భువిపై వారిపేరు మీద గోదానం చేస్తారు.  గోదానం చేస్తే వైతరిణి  నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో  శ్రీమహావిష్ణువు స్వయంగా  గరుత్మంతుడికి  తెలియజెప్పినాడు. విద్య పాలిచ్చే పాడియావు వంటిది. తన సంతృప్తే నందనవనము. ఎంతటి నీతి వాక్యములో గమనించండి.
కోపము తాపము గూర్చును
తాపము తనతోడ తెచ్చు తక్కిన చెడుగున్
పాపమునవి సమకూర్చును
కోపము గమనింప నరక కూపము రామా!