భక్త అంబరీష
https://cherukuramamohanrao.blogspot.com/2018/05/blog-post_26.html
అంబరీషుని చరితము సామాన్యముగా అందరికీ అంతో ఇంతో ఎంతోకొంత తెలిసియే
వుంటుంది. భాగవతము చెరుకుగడ వంటిది. ఎంత నమిలినా ఎదో మధురిమ నాలుకకు తగులుతూనే
వుంటుంది. అందుకే తిరిగీ ఒక పర్యాయము ఆ భాగవతోత్తముని చరిత్ర పునశ్చరణ
చేసుకొందామన్న తలంపుతో తిరిగీ తెలుపవచ్చినాను.
అంబరీషుడు, నేను మే 23 న వ్రాసిన 'నాభాగ
మహారాజు' కుమారుడు. ఈయన చరిత భాగవతము యొక్క నవమస్కందములో
వస్తుంది. ఈయన అంబరీష చక్రవర్తిగా అందు అభివర్ణింపబడినాడు. అకుంఠిత వైకుంఠ నాథ
భక్తుడు. 'నా స్పృశాత్ బ్రహ్మజాపోపి యన్నతః ప్రతిహతః క్వచిత్'
అని భాగవతము తెలుపు చున్నది. అంటే ఈయన అపార విష్ణుభక్తుడగుటచే
బ్రాహ్మణ శాపము కూడా ఆయనను ఏమీ చేయలేక పోయినది.
అసలు 'అంబరీషుడు' అన్న మాటకు అర్థము
తెలుసుకొందాము.
'అంబాదికం రీశం నష్వరమితి జ్ఞానం యస్యాసు అంబరీషః'
అని మహానీయులగు వంశీధర శర్మ గారు కొన్ని శతాబ్దముల క్రితము తమ వ్యాఖ్యానములో వివరించినాడు. అంటే తల్లిదండ్రి ఇల్లు ఇల్లాలు
పిల్లలు ప్రేమలు అన్న భవబంధములు నశ్వరము అంటే నశించేవిగా గుర్తించి తామరాకు
నీటిబొట్టు చందముగా జీవితము సాగించినాడు తాను చక్రవర్తి అయివుండికూడా!
అదే మహానుభావుడు చెప్పిన ఇంకా రెండర్థములను తెలుసుకొందాము.
అంబర
అంటే ఆకాశము, ఇక్కడ ఆకాశమంత అన్న అన్వయమును తీసుకొనవలెను. ఈశ అనగా విస్తృతమైన
జ్ఞానము. యస్యసః అంటే ఎవరికయితే వుందో! అంటే ఇప్పుడు మొత్తము కలిపితే ఆకాశమంత
విస్తృతమైన జ్ఞానము ఎవరికైతే వుందో ఆయన అంబరీషుడు.
అం
అంటే విష్ణువు. అచ్చులలో అకారమును నేను అని శ్రీ మహావిష్ణువే చెప్పు కొన్నాడు.
ఏకాక్షర నిఘంటువును పరికించితే ఈ అర్థమును తెలుసుకొనవచ్చును. పరం అంటే పరమోత్కృష్ఠుడు
అని ఈశ అంటే జ్ఞానము కలిగిన వాడు.
చూచినారా
ఒక వ్యక్తి పేరుకు ఆయన గునగానములకు ఎంతటి సమన్వయముంటుందో మన పురాణములలో!
అట్టి
అంబరీషుడు ఎట్టివాడనిన
చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద
పలుకులు హరిగుణపఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద
శ్రవములు హరికథాశ్రవణమంద
చూపులు గోవింద రూపవీక్షణమంద
శిరము కేశవ నమస్కృతుల యంద
పదము లీశ్వరగేహపరిసర్పణములంద
కామంబు చక్రికైంకర్యమంద
సంగ మచ్యుతజన తనుసంగమంద
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలమంద
రసనఁ దులసీదళములంద, రతులు పుణ్య
సంగతుల యంద యా రాజచంద్రమునకు.
అంబరీషునికి సదా మనసు ఎల్లపుడూ,
మధురిపుడు అనగా మధు అను రాక్షసుని సంహరించినవాడు మధుసూదనుడు
అనగా శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ (శుభకరమైన) పాదాల మీద మాత్రమే, మాటలు హరి గుణగాన సంకీర్తనములు పై మాత్రమే, చేతులు
వైష్ణవాలయాలను శుభ్రపరచుట యందు మాత్రమే, చెవులు విష్ణుకథలు
వినుటకు మాత్రమే, చూపులు గోవిందుని వివిధ రూపములను సందర్శించుట
మీద మాత్రమే, తల కేశవుని ఎదుట అవనత శిరస్కుడై నమస్కరించుటకు
మాత్రమే, కాళ్లు పరాత్పరునికి జేయు ప్రదక్షిణలకు మాత్రమే, కలిగే
ప్రతి కోరికా చక్రిసేవకు మాత్రమే, సాంగత్యము హరిభక్తులతో మాత్రమే,
ఆఘ్రాణించేది విష్ణుభక్తుల పాదపద్మములను మాత్రమే, రుచి తులసీదళాలపై మాత్రమే,; ఆసక్తి పుణ్యవిషయాలపై,
మాత్రమే వుండేది. ఎంతటి
మహానీయుడో గమనించండి. అట్టి మహాహానుభావుని చరిత్రను విన్నా మనము ధన్యులమే కదా!
ఆయన భక్తి తత్పరతకు అవ్యయానందభరితుడై అంబరీషుని అనుదినమూ శ్రీమహావిష్ణువు
కోగిలించుకొనేవాడట. శ్రీవిష్ణు వక్షస్థల స్థితయైన
శ్రీదేవి పాదముల స్పర్శ అంబరీషునికి కలుగుటచే ఆ దినమునకు బొక్కసమునుండి అయిన ఖర్చు
బంగారు నాణెములుగా వర్షించేదట. అంటే ఆ చక్రవర్తికి ప్రజల నుండి పన్నులు వసూలు చేసే
భాసరము వుండేదికాదన్నమాట. నేటి తార్కికులు ఈ మాటను నమ్మక పోవచ్చు. కానీ ఆ మహనీయుని
భక్తిని, సాధించుట వదిలిపెట్టండి,
కోలువగలిగే యోగ్యత వున్నదా అన్నది వారు హృదయ పరిశీలన చేసుకోవలసిన విషయము. మనకు
లేనిది ఎవరికీ ఉండదు అన్న భ్రమను ఉంచుకొనుట తప్పుకదా! అంతటి తో ఆగక ‘నా రాచతపసికి
భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును,
నిఖిలజగదవక్రంబును నగు చక్రంబు నిచ్చి చనియె’ అని వ్యాసునిమాటగా మన పోతన చెప్పినాడు.
‘మాసానాం మార్గశీర్షోహం’ అన్న భగవానుని
మాటననుసరించి మార్గశిర ఏకాదశి మొదలు కార్తీక ఏకాదశి వరకు వ్రతమాచరించి బ్రాహ్మణ, ఋషి,
మునివరులకు సంతృప్తిగా దానములోసంగి షడ్రసోపేతమయిన భోజనము పెట్టించి సంతృప్తులను
చేసిన పిదప తానూ ద్వాదశి ఘడియలు పూర్తియగు లోపుననే దీక్ష విరమించదలచుకొన్న సమయములో
దుర్వాసో మహాముని తన శిష్యబృందముతో అచటికి వచ్చినాడు. అంబరీషుడు
ఎదురేగి సకలమర్యాదలను జరిపి భొజనమునకు ఆహ్వానించినాడు. కాళిందీ నదికిబోయి స్నానమాచరించి
మాధ్యాహ్నిక సంధ్య ముగించుకొని వచ్చెదనని చెపీ శిష్య పరివారముతో బయలుదేరి
వెడలినాడు. ద్వాదశి ఘడియలు ముగిసి త్రయోదశి వస్తే వ్రతనిష్ఠ భంగమయి పాపము పొందవలసి
వస్తుందన్న భయముతో అక్కడవున్న ఋషి మునుల సలహానదిగినాడు. వారు వారు ‘అభక్షితం
ఆపోశితం నాశితమం’ అంటే నీరు త్రావుటచే వ్రాతఫలమూ దక్కుతుంది ఆహారము తినకున్దానూ
వున్నట్లవుతుంది అని సలహా ఇచ్చినారు. అందుకు సంతసించి మూడు ఉద్ధరుణుల (అతి చిన్న
గుంత గలిగిన స్పూను) తులసి తీర్థమును తీసుకొన్నాడు. నదినుండి తిరిగివచ్చి విషయము
తెలుసుకోన్నవాడై క్రుచ్ఛ అన్న భూతమును సృష్టించి దానిచే అసువులు బాయమని అంబరీషుని
శపించినాడు. అంతే ఆయన విష్ణు చక్రము అంబరీషునికి రక్షణ అన్న విషయమును మరచుటచే అది
ముందు కృచ్ఛను తెగటాతార్చి తాపసిని
వెంబడించింది. పరుగెత్తి పరుగెత్తి అలసినవాడై ఆయన బ్రహ్మ లోకమున బ్రహ్మను కైలాసమున
శివుని శరణుజొచ్చినా వారు విష్ణువే కాపాడగలడని సలహా ఇచ్చినారు. విష్ణువు
చెంతకుపోయి అర్థించితే తానూ భక్త పరాదీనుదానని తెలుపుతూ అంబరీషునే శరణు జొచ్చమని ఆదేశించినాడు. అంతటి తపస్సంపంనుడు వెళ్లి అంబరీషుని
పాదములపై పడినాడు. ఆయన సుదర్శనమును పరిపరి విధముల ప్రార్థించి దానిని ఉపశమింపజేసి,
సజలనయనుడై మునిపుంగవుని లేవనెత్తి ఆయన
పాదములపై బడి తనను మన్నించమని కోరినాడు. అంతట దుర్వాసో మహాముని ఇదంతా అంబరీషుని
భక్తి తత్పరత లోకమునకు చాటుటకే అన్న రహస్యమును వెల్లడించి భోజనముచేసి ఆయనను
ఆశీర్వదించి తనదారిన శిష్యగణముతో మరలినాడు. ఇక్కడ కూడా లౌకికులు మహర్షి ‘క్రిందబడినా
పైచేయినాదే’ అని తన లోపమును కప్పిపుచ్చుకోన్నాదనుతకు అవకాశము వున్నది. కానీ
మనము తెలుసుకోనవలసినది ఏమిటంటే ఆయా యుగములలో వారు అనృతమునాడి యెరుగరు. అందునా ఆయన
మునివరేణ్యుడు. ఆ వాస్తవమును తెలుసుకొంటే అనుమానములకు తావు ఉండదు. ఆవిధముగా వ్రతము
సఫలమైన తరువాత రాజ్య భారమును తనయులకప్పగించి విష్ణురూప పరివేష్టిత హృదయుడై వైకుంఠమునుజేర
కానలకేగి తపమాచరించి హరి అనుగ్రహముచే వైకుంఠము చేరినాడు.
ఈ యంబరీషు చరితముఁ
దీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం
డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా!
‘ఓ పరీక్షిన్మహారాజా!
ఈ అంబరీషుని కథను ఆసక్తితో విన్న వారు, చదివిన వారు గొప్ప
జ్ఞానవైభోగాలు పొంది పుణ్యాత్ములు అవుతారు’ అని
శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్పినాడు.
కావున పాఠకులు తదేకముగా చదివి పరమాత్ముని భక్తి తత్పరులగుడురుగాక
అని ఆ మహావిష్ణువును ప్రార్థించుతూ శెలవు తీసుకోనుచున్నాను.
స్వస్తి.
No comments:
Post a Comment