కాంచీ పురాధిదేవతలు
వారించి
మహిమచే వాంఛితాల వరద
వరదరాజులు
బ్రోచు 'వ' 'ర' 'ద' యనుచు
కామాక్షి
కన్నులు కామకోటిని జేర్చు
కామకోటిని
జేర్చు కడలియడుగు
ఏకామ్రనాథుని
ఎన్ని మదిన గొల్వ
కొల్వ
వీలేలేని కోర్కెలడచు
కామకోటి సుపీఠ
కరుణా సుధా ధారి
దారి చూపు
తనదు దరినిజేర్చ
అన్న చెల్లి
బావ ఆదిశంకర పీఠ
పీఠమయ్యి కంచి
పేరు గాంచ
కాంచ పుడమి
తల్లి కటికినయ్యెను కాంచి
కాంచి నిలుప
భక్తి కలుగ ముక్తి
నేను వ్రాసిన ఈ పద్యము 'సీసము' అన్నది
నేను తెలుపనవసరము లేదు. ఇందు నేను ‘ముక్తపదగ్రస్తము’
అన్న అలంకారమును ఉపయోగించినాను. అది కామాక్షీదేవి అనుగ్రహము.
మొదటి పాదము 'వరద' తో అంతమయితే
తరువార్హి పాదము వరద తో మొదలయ్యింది.
అదేవిధముగా మూడవ పాదము 'కామకోటిని జేర్చు' తో ముగిస్తే నాలుగవ పాదము దానితోనే మొదలయ్యింది.
ఈ విధముగా పద్యము సాగుతుంది. ఇందు ఒక పాదము చివర ఉపయోగించిన పదము
రెండవ పాదము యొక్క ప్రారంభములో ఉపయోగించినా అర్థము అన్వయము వేరుగా
వుంటుంది.
పద్యము ఆసాంతము ఈవిధంగానే సాగుతుంది. మూక కవికే మాటలు ప్రసాదించి 'మూక
పంచ శతి' వ్రాయంచిన తల్లి సరస్వతీ దేవిని నా
తలపులయందుంచి వ్రాయినందుకు ఆ తల్లులకు శత సహస్రానేక సాష్టాంగ దండప్రణమములు.
ఇక భావమును మీముందుంచే ప్రయత్నము చేస్తాను.
తమిళములో 'వ' అంటే 'రా' అని, తెలుగులో 'వ' అన్నా 'ర' అన్నా 'ద' అన్నా రమ్మనియే
అర్థము .
కంచి వరదరాజ స్వామిని వరద అని అంటేచాలు వచ్చి మనకోర్కెలు తీర్చేటంత
దయాళువు ఆయన.
కోటి కోటి కోరికలున్న మన కోరికలను దీర్చి కామకోటిని చేర్చే తల్లి
కామాక్షి కి మ్రొక్కితే చాలు. మన అభీష్టము సిద్ధించుతుంది. ఇక్కడ 'కామ కోటి' అన్న మాటను ఒకసారి మనము విశ్లేషించుకోవలసి వుంటుంది.
‘చతుర్విధ పురుషార్థములు’ అంటే ‘ధర్మ, అర్థ,
కామ, మోక్షములు’. ‘కోటి’ అన్న మాటకు మరియొక అర్థము ఏమిటంటే ‘కొన’ కొస’ అని. కాబట్టి ‘కామకోటి’ అంటే
కామమునకు ‘కొన’ అంటే ‘మోక్షము’ అని అర్థము.
అమ్మకు ఒక్కసారి నమస్కరించితే కోట్ల కొలది మన కామితాభీష్టములను తీర్చుటయే గాక
జన్మాంతమున మోక్షమును ప్రాప్తింపజేస్తుంది.
ఇక కామాక్షీ నాథుడగు ఏకామ్రనాథుని కొలిస్తే, కొలుచుటకు వీలేలేని
కోర్కెలను అణచుతాడు.
‘కామకోటి పీఠ కరుణా సుధాధారి’ అంటే కంచి
కామకోటి పీఠ అధిష్టాన దేవతయగు ‘చంద్రమౌళీశ్వరుడు’
ఇంకొక విధముగా అన్వయించుకోదలిస్తే నడిచే దేవుడగు చంద్రశేఖర
యతీంద్రులు తనవద్దకు చేర్చుకొంటాడు అని అనుకోవచ్చు.
కావున అన్న (వరదరాజస్వామి విష్ణువు అవతారము .) అంటే నారాయణుడు. ఆయన
సహోదరి అమ్మవారు. అందుకే ఆమెను ‘నారాయణి’ అంటారు.
నారాయణునిగా పరమాత్మకున్న లక్షణాలన్నీ శక్తిస్వరూపిణియగు శ్రీమాత అంటే కామాక్షీ
దేవికి ఉంటాయి. ఆ తల్లి భార్తయగు ఏకామ్రనాథుడు ఆవిధముగా వరదరాజస్వామికి
బావయగుతాడు. కంచి లో మొదట వెలసినది వరదరాజులవారే!
ఆ విధముగా వారు మువ్వురికేకాక చంద్రమౌళీశ్వర, (చంద్రశేఖర
సంయమీంద్రుల) పీఠమునకు పీఠమై (నెలవై)
పేరుగాంచిన కంచి భూమికి వఢ్యాణమై
(కాంచి అంటే వఢ్యాణము ఆని అర్థము) చెెలగగా అట్టి కంచిని గాంచి అంటే చూచి (తిలకించి) భక్తి
నిలిపిన ముక్తి కలుగును.
No comments:
Post a Comment