Thursday, 7 February 2019

వేద గణితము-వైదిక విధాన సంకలనము


వేద గణితము
వైదిక విధాన సంకలనము

రెండంకెల ఈ కూటకమును ఒకసారి చూద్దాము చేద్దాము.

23
34
52
---
109
ఈ కూటకము కుడి నుండి ఎడమకు కూడినా ఎడమ నుండి కుడివైపునకు కూడినా అదే జవాబే వస్తుంది.
ఈ విషయమునే భాస్కరాచార్యుడు తన 'లీలావతి' లో ఈ విధముగా చెబుతాడు.
'కార్యః క్రమాత్ ఉత్కృమతః అథవా, అంకయోగః యథాస్థానకం అంతరంవా' అని. అంటే కూటకము కానీ తీసివేత కానీ కుడినుండి ఎడమకే గాక ఎడమనుండి కుడికి కూడా చేయవచ్చును. దీనిని 'బిందు పధ్ధతి' అంటారు. దానిని ఒకసారి చూద్దాము.
ముందు కుడి నుండి ఎడమకు తరువాత ఎడమ నుండి కుడికి చేద్దాము. క్రింది నుండి కూటకము మొదలుపెడదాము.  375+964+128 ఈ ఉదాహరణను గమనించుదాము.


     
  



8+4=12 ఈ పద్ధతిలో పదుల స్థానములో 1 ని మించిరాదు. ఆ విధముగా వచ్చినపుడు 4 పైన ఒక బిదువును పెట్టి దాని ప్రక్కన ఒక రెండు ఖాళీలను వదిలి (Leave 2 spaces) ఒకట్ల స్థానములో వుండే 2 ను ఉంచండి. ఇప్పుడు ఆ రెండుకు 7 ను కూడితే వచ్చే 7 ను మొత్తము యొక్క ఒకట్ల స్థానములో వ్రాయండి. మనము ఒకట్ల స్థానములోని అంకెలను కూడేటపుడు ఒక చుక్క వచ్చింది కాబట్టి పదులస్తానములో 1 వుంచుకొని కూడండి. 1+2+6 =9 కాబట్టి దానిని పైనున్న 7 కు కూడుకొంటే 16 వస్తుంది. ఇప్పుడు 7 పైన చుక్క వుంచి 6 ను క్రింద మొత్తములో వ్రాసుకొందాము. పదుల స్థానములో వచ్చిన ఆ ఒకచుక్క ఇప్పుడు 1౦౦ స్థానములో 1 ఔతుంది. 1+1+9=11 కాబట్టి 9 మీద ఒక చుక్క పెట్టి 11 లోని రెండవ 1ని 3 కు కూడితే 4 వస్తుంది. ఆ 4 ను క్రీ మొత్తములో వ్రాసుకొని 9 మీద ఉన్న ఒక చుక్కకు బదులుగా మొత్తములో 1 ఎడమవైపు చివర చేర్చండి. అదే జవాబు.
ఇదే జవాబును ఎడమనుడి కుడికి గూడా కూడి పొందవచ్చు. అప్పుడు 9 పైన ఉన్న చుక్కను 1 గాపరిగణించి కూడితే 14 వస్తుంది. దానిని అట్లే మొత్తములో వ్రాసి పదుల స్థానము కూడితే 7 పైనున్న చుక్కను కలుపుకొని 16 వస్తుంది. 1 ని ముందే మనము 9 పైనుంచుకొని కూడినాము కాబట్టి పదుల స్థానములో 6 వేస్తె చాలు. ఒకట్ల స్థానము కూడితే 17 వస్తుంది. పడులస్తానములోని 1 మనము ముందే కూడినాము కాబట్టి 7 వ్రాస్తే చాలు. అంతే. జవాబు మారదు. మొదటిసారి కాబట్టి విశధముగా వ్రాసినాను కానీ మీరు అలవాటు పడితే చాలా సులభముగా చేస్తారు. దీనివల్ల కూటకము పెద్దదయితే  99 గానీ ఇంకా దానిని మించితే నూర్లలో గానీ రావచ్చు. అప్పుడు కూడిక తప్పుపోయే అవకాశము ఎక్కువ. అందుకై ఈ బిందు పధ్ధతి పిల్లలకు నేర్పితే వారికి కూటకము ఎంతో సులభతరము చేసినవారవుతారు.
ఇప్పుడు 2 వ ఉదాహరణ తీసుకొందాము. 9+2= 11 . పెట్టి 1 తీసుకొని కూడండి. 1+6+3=10. ౦ ఒకట్లస్థానములో వుంచి 2 చుక్కలున్నాయికాబట్టి పదుల స్థానములో 2 వేసుకొని కూడండి. అట్లు చుక్కలు పెట్టుకొని కూడుకుంటే పదుల స్థానము మొత్తములో 9 వస్తుంది. వరుసగా ఆ విధముగానే కూడుకొంటూ పోతే మనకు జవాబు 3099౦ వస్తుంది.
మీరు కొన్ని కూతకములను ప్రయత్నించి ప్రావీణ్యత సాధించండి.
స్వస్తి.

హవనం


హవనం
https://cherukuramamohanrao.blogspot.com/2019/02/blog-post_7.html
ఉపోద్ఘాతము: నేను హవనమన్న శ్శీర్శికను ఉంచినా వివిధ విధములగు హవనములు, హవన ధర్మములు, వాడు సమిధలు, తీసుకొనవలసిన బాధ్యతలు మొదలగు వానిని గూర్చి వ్రాయుటలేదు. నాకు చేతనయిన మేరకు హవనము యొక్క గొప్పదనము మీమున్డుంచే ప్రయత్నమూ చేయుచున్నాను. ఇక చదవండి.

" ముస్లిం చెట్టుమీద ఆకుపచ్చ జండా కట్టి దర్గా అంటాడు .
క్రిస్టియన్ కర్ర కోసి శిలువ చేస్తాడు .
హిందూ ముక్కలు చేసి హవనం చేస్తాడు . " ఇది ఒక ముసల్మానుడు ఆస్యగ్రంధిలో ఉంచిన మాట, తానూ నిరంతరము చేసే జీవహింస, మరియు ముఖ్యముగా గోవధలను ప్రక్కనుంచుతూ. క్రైస్తవుడు శిలువకు మాత్రమే రెండు కర్రలను కోస్తాడు. మరి హిందువో నిర్దాక్షిణ్యముగా చెట్లను నరుకుతాడు. ఇది ఆయన లేఖనము యొక్క సారాంశము.
ఈ వాక్యాలను గమనిస్తే హిందువు కు చెట్టు అంటే గౌరవము లేదు, అనేకదా ఆయన భావము. కానీ ఆయనకు తెలియని విషయము ఏమిటంటే  బహుశా చెట్లకు హిందూ మతము లో ఉన్నంత ప్రాముఖ్యం ఏ ఇతర మతములలో లేకపోవచ్చునని నా భావన.

నిత్యపూజ జరిపేది తులసికి . ప్రదక్షిణం చేసేది మేడి, రావి, జువ్వి మొదలగు చెట్లకు . తోరణాలలో వాడేది మామిడి . విస్తరాకులకు వాడేది మోదుగ . ఉపనయనం లో వటువు పట్టుకునే కొమ్మ అదే ! శుభ, అశుభ కార్యములలో వాడేది దర్భ. మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. అది ఎంతటి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుందో ఈమధ్యనే రుజువయింది. అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. దసరా నాడు పూజలను అందుకునేది శమి. వినాయక పూజ జరిగేది పలువిధములగు ఏకవింశతి పత్రములతో! పరమాత్మ తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును  అని  భగవద్గీత ద్వారా తెలియజేస్తున్నారు. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు ఆరెండు వృక్షములను ఒకటిగా నాటి తమతమ దోష పరిహారార్థము వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు. పందిళ్ళు వేసేది ఆకులు, కొమ్మలతో! ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని . షామియానాల సంప్రదాయమే మనకు లేదు.దానిని మన ధర్మములో అశుచిగా పరిగణించుఁతారు.
నిత్యజీవితం లో భాగమైన చెట్టుయొక్క కొమ్మలను హవనం చేయడం ఎందుకు అనే ప్రశ్న బహుశా ఆయన పైన వ్రాసిన హిందువులకు సంబంధించిన వాక్యామునకు అర్థము ఉండవచ్చు. వాళ్ళ మతము ఆవిర్భవించిన దేశములో ఇసుక ఖర్జూరము తప్ప వేరు చెట్లు కనిపించవు. కావున వారికి చెట్లకు సంబంధించిన అవగాహన వుండే వీలే లేదు.
మనిషికి చెయ్యి విరిచితే పుట్టుకురాదు కానీ కొమ్మలను ఆకులను విరిచితే అవి తిరిగీ పుట్టుకొస్తాయి. పూజ, హవాన కార్యములకు కొన్ని ప్రత్యేకమగు చెట్ల ఆకులు, కొమ్మల పేళ్ళు మాత్రమే వాడుతారు చెట్టును సర్వనాశనం చేయరు . ఈ మాత్రము కూడా తెలుసుకోకుండా పుర్రెకు తోచినది వ్రాసి పాఠకుల ముఖముపై విసరివేయగా మనలో వున్న జిజ్ఞాసారాహిత్యులు ఔరా! ఎంతటి వాస్తవమును నొక్కి వాక్కాణించినాడని ముక్కుపై వ్రేలు వేసుకొంటారు. వాస్తవము తెలుసుకొనే ఓపిక ఉంటేకదా వారికి.
హోమం / హవనం/ యజ్ఞం/ యాగం .. పేరుఏదైనా , క్రియ ఏదైనా జరిగేది అగ్నిహోత్రునికి రకరకాల పదార్థాలను సమర్పించడం . అది వెర్రి పని కాదు . వివేకవంతులు చేసే పవిత్రమైన, లోకకళ్యాణమును ఆశించి చేసే కార్యం.
అగ్నికి సమర్పించే అతివిలువైన వస్తువుల నుండి వచ్చే ధూమము పరిసరాల కాలుష్యమును దూరం చేస్తుంది. వాతావరణ సమతౌల్యమును కలిగించుతుంది. మేఘములనావిర్భవింపజేసి వర్షము కురిపిస్తుంది.యజ్న ధూమము కలుశాయాయు వినాశినిగా పనిచేస్తుంది. మానసిక, శారీరక అలసటను దూరంచేస్తుంది . ప్రశాంతతను ప్రసాదిస్తుంది.
శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత లో చెప్పిన ఈ శ్లోకమును చూద్దాం !
! శ్లో ! అన్నాద్భవంతి భూతాని , పర్జన్యాదన్న సంభవఃl
యజ్ఞాద్భవంతి పర్జన్యో , యజ్ఞః కర్మ సముద్భవః ll 3-14
అన్నమువలన జీవము, మేఘములనుండి అన్నము, ( వర్షము వలన అన్నము / ఆహారము ) ,యజ్ఞముల వలన మేఘములు , కర్మవలన మేఘములు సంభవము అని కదా వివరించుట జరిగినది.
కాస్త లోతుగా ఆలోచిద్దాం, అసలు హిందువు హవనం ఎందుకు చేస్తాడో!
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తృ నిహాతసి
ఒక పనిని చేయవచ్చునా చేయకూడదా అన్న సందేహము మనలో కలిగినపుడు
ఆ సందేహ నివృత్తి చేయగలిగినది శాస్త్రం మాత్రమే అన్నది భగవంతుడు ఒక సందర్భములో చెప్పిన మాట. భగవద్గీత ఈ విధముగా చెబుతూవున్నది.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 3.10:
సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పినాడు, "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త కోరికలను తీరుస్తాయి."
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ।।  3.11
మీ యజ్ఞముల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.
1984 డిసెంబరు 2-3 మధ్య రాత్రిన జరిగిన భోపాల్ విషవాయు దుర్ఘటనను గూర్చి అందరికీ తెలిసిందే. అందు 5 లక్షలమంది మరణించినారని అంచనా. ఒక గొప్ప విశేషమేమిటంటే అంతటి ఉత్పాతము నుండి కూడా ముందురోజు యజ్ఞము చేసిన కుటుంబము మాత్రము పూర్తిగా రక్షిమ్పబడినది. ఇది నాటి పత్రికలో వచ్చినవార్త. కట్టుకథ కాదు.
మరియొక వాస్తవాన్ని గూర్చి తెలుసుకొందాము. 1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో విడిది చేసి యుండినారు......
మిగిలినది తరువాత చదువుదాము.........
హవనం-2
1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో విడిది చేసి యుండినారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ ప్రతినిధులు హాజరయి వుండినారు. మాంసాహారాన్ని వదలి శాఖాహారులుగా మారుట ఆ సదస్సున అంగీకరించిన తీర్మానము. అహింస మరియు శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని నిర్ణయించుకొన్నారు.
ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులను పరమాచార్య వారి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని రావటం జరిగింది. స్వామివారిని కలవాలని వారు ఎంతో ఉత్సాహాన్ని చూపించినారు.
శంకర మీనన్ గారు అందరినీ తగురీతిగా పరిచయము చేసినారు. స్వామివారిని వారికి పరిచయము చేయబోగా వారు వారించి, “నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు.
కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదట “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?” అని అడుగుట జరిగింది. అందుకు మహాస్వామి వారు “అది చేయతగినదే. అది పాపం కాదు” అని తెల్పినారు. ఆ మమతకు అతిధులు ఫక్కున నవ్వినారు. స్వామి వారిని అవమానపరచినారని మీనన్ ఆగ్రహముతో ఊగిపోయినారు.
స్వామివారు మీనన్ ను శాంతపరిచి, “వారిపై కోప పడవద్దు. వారు జీవహింస పాపము  అన్న ఒక నిర్ధారణతో ఇచ్చటికి  వచ్చినారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వటంజరిగింది. నన్ను అవమాన పరచవలెనన్న ఆలోచన వాళ్ళకు లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి. అంతే!” అని శాంతంగా చెప్పినారు.
మహాస్వామి ఈ విధంగా తన సంభాషణ సాగించినారు. “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపినాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా?  న్యాయమూర్తిది పాపకార్యము కాదా?”
వారు అలోచనలో పడినారు. మరలా స్వామివారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చినాయనుకుందాము. అప్పుడు ముందు అగ్నిమాకప వాహనాన్ని పంపిస్తాము. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనము, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాము. కొంతమంది ప్రాణ రక్షణ కంటే దేశ రక్షణ గొప్పది. అదేవ్బిధముగా రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధాలలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ సంఘటనలన్నింటిలోనూ మనం జీవహింసను అమోదిస్తూ ఉన్నాము. ఇలాంటి నియమాలను మనము ఏర్పరుచుకున్నవే! అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.
వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘అహం బ్రహ్మస్మి’ అన్న వేదవాక్యము అనుభవములోనికి వచ్చినవానికి యజ్ఞముతో పని ఉండదు.
వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానమున్నది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి కర్మకాండ యందు విపరీతమైన మక్కువ. ఆయన లోకక్షేమము కొరకు తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయినాడు. ఆ స్థితిని పొందినా అతను వానిని మానలేదు. నారదమహర్షి వచ్చి అతనికి జ్ఞానోదయము కలిగించిన పిదప, అతను వానిని మానివేయుట జరిగినది.
కాబట్టి, కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. అహింస అనేది వారి వారి ఆశ్రమ ధర్మాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే అహింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు.
అయినాకూడా
అగ్నికార్యం గావాలంబం సన్యాసం పలపైత్రుకంl
దేవేరాశ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జ్యయేత్ll
అని శాస్త్రవచనము. అగ్నికార్యము అంటే గృహస్తులు చేసే యజ్ఞయాగాదులు, గోవధ, సన్యసించుట, తద్దినములలో మాసము వండుట మరియు మాంస భక్షణము, వేదోక్తముగా వివాహము జరిగిన స్త్రీతో సంతానమును పొందుట అన్నవి కలియుగమున పాటింపనవసరము లేనివి. ‘అగ్ని కార్యం’ బదులుగా ‘అశ్వమేధం’ అన్న పాఠాంతరము కూడా కలదు. ఆమాట కూడా నిజమే కావచ్చు. ఈ కాలమున అప్పుడప్పుడు అటు ప్రభుత్వమూ కానీ, ఇటు కోటీశ్వరులు కానీ, లేక పెద్ద పెద్ద దేవస్థానములు కానీ యజ్ఞములు తలపెట్టినా అశ్వమేధము చేసిన సందర్భములు కానరావు. యుగధర్మమును అనుసరించియే జీవన విధానము సాగుతూవుంటుంది.
ఈవిధముగా హవనమును గానీ, చెట్లను గానీ, ఆహార విషయములలో గానీ, గోపూజల యందు గానీ, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే ఎన్నో విషయములను సోపపత్తికముగా తమ దివ్యదృష్టిచే నిరూపించి మనకొసగినారు. రెండువేలు, పదిహేను వందల సంవత్సరముల మత గ్రంధముల ఆధారముతోను, ప్రవక్తలు చెప్పుటచేతనూ ఏర్పడిన మతము కాదు మనది. ఇది ధర్మము. బ్రహ్మజ్ఞాన తత్పరులగు మునులు తమ శృతులచే మనకందించిన సహేతుక శాస్త్రీయ విజ్ఞానముతో కూడిన జీవన విధాన ధర్మము.
మనలను పాశ్చాత్యులు, కుహనా లోకిక వాదులు, మహమ్మదీయ చరిత్రకారులు, వామపక్ష అధినాయకులు అన్నివిధాలా కళ్ళకు గుడ్డకట్టి సినిమా చూపించినారు. అగమ్యగోచరములో ఉంచి మన విధులు కర్తవ్యములను మనచేతనే అవహేళన చేయించే స్థితికి తెచ్చి మనలను నీతి, నియమము, అహింస, సత్యము, శౌచము, దయ, ధర్మము, అంటే ఏమిటో తెలియని ఒక 7 రోడ్ల కూడలిలో కళ్లుపొడిచి నిలబెట్టినారు. కానీ విశ్వ జేత, విశ్వనేత, విశ్వదాత, విశ్వత్రాత, విశ్వ తాత (తాత అంటే తండ్రి అని అర్థము), అగు ఆ పరమాత్మ మనకు చూపు ప్రసాదించినాడు. ఆయనపై అచంచల విశ్వాసముతో, ప్రగాఢ భక్తితో, నిరంతర అనురక్తితో, అకుంఠిత శక్తితో, ముక్తి పై రక్తితో మనము పూజించితే ఈ 7 గుణములను మనము కూడలి నుండి కదలకుండానే మనవడ్డకు చేర్చుతాడు. మన దేశము, మన ధర్మము, మన పూర్వుల యొక్క ఔన్నత్యమునకు సంబంధించిన వాస్తవాలను లోకానికి చాటుదాం.

స్వస్తి.


Sunday, 3 February 2019

భాస్కరాచార్యుని దైవ ధ్యానము


భాస్కరాచార్యుని దైవ ధ్యానము
https://cherukuramamohanrao.blogspot.com/2019/02/blog-post.html
భారతీయ మహా గణిత శాస్త్రజ్ఞులుగా ప్రసిద్ధికెక్కిన భాస్కరులు ఇద్దరు. భాస్కరాచార్య-1,  7వ శతాబ్దమునకు చెందినవారు. భాస్కరాచార్య-2 పన్నెండవ శతాబ్దమునకు చెందిన వారు. ఈయనను గూర్చియే మనమిపుడు తెలుసుకొనబోవుచున్నాము.
భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించినాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడు. ఈయన ఖ్యాతి గాంచుటకు కారణమైన అతి ముఖ్య సంఘటన ఒకటుంది. ఈ కథనము కొంతమందికి తెలిసియుండవచ్చు. తెలియనివారికొరకై పునశ్చరణ చేయుచున్నాను.

భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. వీరు ఒక  కుండలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండ క్రింద మరొక కుండను పెట్టి  వాటిలోని నీటి చుక్కలు క్రిందయున్న ఒక చట్టి లో పడే సమయం బట్టి ముహూర్తములను, శుభాశుభములను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన ఏకైక కుమార్తె  లీలావతి పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించినాడు.  ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి  ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యము అనుకోకుండా ఆ కుండలలోని పై కుండలో జారిపడింది. ఆ ముత్యము పై కుండ చిల్లుకు అడ్డుపడుటచే  నీటిచుక్కలు పడు సమయం మారింది. దానితో ముహూర్త గణన తప్పింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరమే వైధవ్యము ప్రాప్తించినది . ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు  లీలావతిని కూడా ఆ దుఃఖము నుండి బయల్పరచుటకు లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేయుట మొదలుపెట్టినాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని నిరుపమ  ప్రఖ్యాతుడైనాడు. తన కుమార్తె 'లీలావతి పేరుతో గణిత గ్రంధమును రచించి ఆమెకు కూడా ప్రఖ్యాతిని గడింప జేసినాడు.
నేను ఇపుడు ఆమె పేరుతో వ్రాసిన లీలావతి గణితమును గూర్చియే ముచ్చటించుచున్నాను.
అసందర్భమనుకోకుంటే ఇపుడు మీకు ఒక ఆశ్చర్యకరమగు విషయమును చేబుతాను.
MATHEMATICS అన్న ఆంగ్ల పదము మనకు తెలిసినదే! కానీ అది సంస్కృత జన్యము అని తెలియక పోవచ్చు. MATHE MATI CS గా వ్రాసుకొంటే మేధ మతి క్స్. అంటే మేధోమతి+క్స్. ఆ CS చేర్చటముతో మేథిమటిక్స్ అయిపోయింది.‘మేధ’ అంటే తెలివితేటలు., మతి అంటే బుద్ధి. కాబట్టి తెలివితేటలను అభివృద్ధిచేసే శాస్త్రము కావున MATHEMATICS అయిపోయినది. త్రేతాయుగము నాటికే 1067 ను ఏమంటారు అన్నది మన వాళ్లకు తెలుసు. వాల్మీకి రామాయణములో రావణుని గూఢచారులగు శుక.సారణులు, తమ ఏలిక పనుపున పోయి  రాముని సైన్యమును గూర్చి తెలుసుకొని రావణునితో ఈ క్రింది శ్లోకముతో మొదలుపెట్టి ఇంకా మూడు శ్లోకములు చెబుతాడు. మొదటి శ్లోకము మాత్రమె మీముందు ఉంచుచున్నాను.
ఏషాం కోటి సహస్రాణి నవ పంచ చ సప్తచ l
తథా శంఖ సహస్రాణి తథా వృంద శతానిచll 6-28-4 (వాల్మీకి రామాయణం)
కోటి అనగా 107 శంఖు అనగా 1012 వృంద అనగా 1012. సముద్ర అంటే 1052 . వానర సైన్యము దానికి మించినది. పై శ్లోకము ప్రకారము, మహౌఘ అనగా1067, 1072 వున్నది. దీనిని బట్టి మనవారు గణితములో ఆకాలానికే ఎంత ప్రగతిని సాధించియుండినారో మనకు తెలుస్తుంది. మననుండి అరబ్బులు గ్రహించితే వారినుండి పాశ్చాత్యులు గ్రహించేవరకూ వారికి గణితమంటే ఏమిటో తెలియనట్లే చెప్పుకొనవచ్చును.

ఇటువంటి అనేకానేక విషయములు కాకుండా నేడు స్నాతక, స్నాతకోత్తర పట్టాలు సంపాదించే వారు చదివే ఎన్నో విషయములను ఆయన తాను వ్రాసిన సిద్ధాంత శిరోమణి లో మనము చూడవచ్చును.
ఈయన సంస్కృతములో గొప్ప పండితుడు. తన ‘లీలావతి’ గణితములో పరమాత్ముని ప్రార్థన ఏవిధముగా చేస్తున్నాడు అన్నది నేను మీ ముందుంచనున్నది.
ప్రీతిం భక్తజనస్య యో జనయతే విఘ్నం వినిఘ్నన్ స్మృతఃl 
తం బృందారక బృందవందిత పదం నత్వా మతంగాననం ll
పాటీం సద్గణితస్య వచ్మి చతుర ప్రీతిప్రదాం ప్రస్ఫుటాంl
సంక్షిప్తాక్షర కొమలామల పదైః లాలిత్య లీలావతీంll
ప్రీతిం భక్తజనస్య జనయతే = భక్త జనులకు ప్రీతీ కలుగు రీతిగా అనుగ్రహించుతూ
విఘ్నం వినిఘ్నం= విఘ్నములను భంగపరచునట్టి
బృందారక బృంద వందిత పదం = శ్రేష్ఠులగు భక్త బృందముచే నమస్కరింపబడు పాదములను గల్గిన
నత్వా మతంగాననం = గజముఖుడగు విఘ్నేశ్వరునకు నమస్కరించుతూ
పాటీం సద్గణితస్య = గొప్పదగు అంకగణితమును (Arithmetic)
చతుర ప్రీతిప్రదాం ప్రస్ఫుటాం = చతురులగు పాఠకులకు ప్రీతిప్రదమగు రీతిలో ప్రస్ఫుటముగా అంటే చక్కగా అర్థమగురీతిలో   
సంక్షిప్తాక్షర కొమలామల పదైః = తక్కువ అక్షరములు కలిగి యుంటూ ఎటువంటి మాలిన్యములు లేని కోమల పదజాలముతో లలితమగు రీతిలో లీలావతీ గణితమును
వచ్మి = చెప్పబోవుచున్నాను.
ఇదే శ్లోకమునకు ఇంకొక అర్థము చెప్పుకొందాము.
వి = పక్షి (ఏకాక్షర నిఘంటువు) (జటాయువు) ఘ్న = రెక్కలు విరిచినవాడు (రావణాసురుడు)
 (శ్రీ రామునికి) ఎవరితోకూడా అంటే మతంగాననం = ఎనుగును బోలిన తలగలిగిన కుంభకర్ణుని కలిపి, రావణుని
వినిఘ్నం = చంపినట్టి రామునికి
నత్వా = ప్రణమిల్లెదను
ప్రీతిం భక్తజనస్య యో జనయతే అన్న మాటకు కూడా ఎంతో ప్రెమతో పరమభక్తుడగు విభీషణునికి రాజ్యమునిచ్చినాడు.
ఈ శ్లోకమునకు అర్థము శ్రీకృష్ణుని పరముగాకూడా తీసుకొనవచ్చును. కంసవద్కు గానూ బలరామకృష్ణులు మధుర వెళ్ళినపుడు వారిని చంపుటకు మావటివానితో కువలయాపీడనము అన్న మదగజమును కంసుడు పురమాయించుతాడు. శ్రీకృష్ణుడు అవలీలగా దానిని చంపుతాడు. బృందారక బృంద వందిత పదం అంటే బృందావనము నందలి గోపికా బృందములచే పూజింపబడిన పరమాత్మ మరియు కువలయాపీడనము అన్న మతంగము అనగా ఏనుగును నిర్జించిన శ్రీకృష్ణునికి నమస్కరించి ఈ గణితగ్రంధమును వ్రాయుచున్నాను.
 తన భక్తిని ఇన్నిరీతులుగా పరమాత్మను వివిధ రూపములలో ఒకే శ్లోకములో నుతించినాడు. ఈ క్రింది శ్లోకమును చూడండి:
అచిన్త్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనేl
సమస్త జగదాధారామూర్తయే బ్రాహ్మణే నమఃll
ఈ శ్లోకము కూడా లీలావతి గణిత గ్రంధము లోనిదే! ఇందులోకూడా ఒక విశేషమున్నది. శ్లోకము చదువుతూనే, అచిన్త్యుడు, అవ్యక్తుడు,నిర్గుణుడు, గుణాత్మకుడు, సమస్తజగములకు ఆధారభూత మూర్తి యగు పరబ్రహ్మకు నమస్కారములు అన్నది బాహిరమగు అర్థము.
ఇక ఆంతరంగికమగు అర్థమును ఒకసారి చూద్దాము.
వ్యక్త అనగా -> Numerals -> 1,2,3....
అవ్యక్త -> Alzebra -> x, y, z, ............
చింత్య -> Real Numbers -> (1)2, (-1)2, (2)2, (-2)2, (3)2, (-3)2, .............
అచింత్య -> Imaginary Numbers -> Any number accompanied by −1.
నిర్గుణ -> Point -> No specific nature.
గుణ -> Multiplication -> x and ÷
ఇన్ని గుణములు కలిగిన పరబ్రహ్మ రూపము ఈ గణితము అని తెలియజేస్తున్నాడు ఆ మహానుభావుడు. అటు సంస్కృతములోనూ ఇటు గణితములోనూ అటు కన్నబిడ్డపై అవ్యాజ మమకారములోనూ అగణిత గుణగణ ప్రతిభాభాస యుతుడు భాస్కరాచార్యుడు.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము. కాని ఈ గ్రంథంలో (న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి. కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి." అసలు ఈ మాటకు మూలము ఋగ్వేదము లోనే యున్నది.
ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.
తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళ గణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడైనారు.
వీరు మరణించిన సంవత్సరం క్రీ.శ. 1185. భారతదేశపు రెండవ (భాస్కర-1) మరియు ఐదవ (భాస్కర-2) కృత్రిమ ఉపగ్రహాలకు వీరి పేరు పెట్టినారు.
స్వస్తి.

Friday, 1 February 2019

పరమేశ్వరాంకిత పద్య ధార - 1

పరమేశ్వరాంకిత పద్య ధార-1
శ్రీ కరులు సుముఖ షణ్ముఖ గౌరి శ్రీధరుడు
శ్రీ దేవి హృదయ వన శ్రీనివాసుండు
శ్రీరస్తు సర్వశుభ శ్రీ ర్విజయమస్తు          
అనుచు దీవించగా ఆనంద వార్ధి
పున్నమి చంద్రుని పూర్ణ బింబమును
చూసి ఎగసెడు  చూడ్కి చుక్కలంటగను
ఉల్లాసమెగసినా ఉల్లమ్ము దాటి
పోవనుంకించగా  పోరిమి తోడ
తల నేల తాకించి తామసము వీడి
దండాలు పెట్టి నను దరిజేర్చమంటి

వ్యక్తావ్యక్త గుణేతరం  పరతరం షట్త్రింశ  తత్వాత్మకం
తస్మాదుత్తమ  తత్వ మక్షరమిదం  ధ్యేయం సదా యోగిభిః

ఓంకారాది సమస్త మంత్ర జనకం సూక్ష్మాది సూక్షంపరం
శాంతం పంచమ మీశ్వరస్య  వదనం  ఖం వ్యాప్తి తేజో మయం

ఓం ఈశానః  సర్వ విద్యానం
ఈశ్వరః సర్వ భూతానం
బ్రహ్మధిపతి బ్రాహ్మణోధిపతిః బ్రహ్మ
శివోమే అస్తు  సదా శోవోం


సరస్వతీ ప్రార్థన (రచయిత, డా. చింతలపాటి మురళీకృష్ణ గారు)
ఏ దేవి నెలుగెత్తి యెవరు ప్రార్ధించినన్
నింతకింతగ పల్కరించు తల్లి -
నీరీతి నీ వాఙ్మయీ చిత్ర సంపదన్
మురిపించువారి నెన్నుదుట నిలచి
నీ వర్ణనారూప భావాంబరోద్భూత
చిచ్చక్తి లోక సంక్షేమ మరసి
దివ్యమౌ మహనీయ తేజ సంపుటి నింపి
తెలుగుభాషను వోలె తీర్చిదిద్ది

చెరుకు రససిద్ధి గల్పించి చివరి వరకు
రామమోహను రూపానురక్తి కలుగ
జనులనందర గాచెడి శక్తి వనుచు
వేడుకొందు సరస్వతీ!వివిధ గతుల!

రాముడు మోహనుండు రఘురాముని చేత మహేక్షు దండమే /
కామశరాస్త్ర సన్నిభముగా నలరారుచు పల్కుపల్కునన్/
హేమ రసార్ద్రభూషితమునై విలసిల్లుచు తెల్గువారికిన్/
కామితమిచ్చుచున్ చెరకు కండరసంబు ననుగ్రహించెడిన్ !! (05/12/17)
(పై రెండు పద్యముల రచయిత, డా. చింతలపాటి మురళీకృష్ణ గారు)


విళంబి నూతన సంవత్సరము 11/1/18

వాణీ స్థుతి (స్వీయ రచన)
ఏ దేవి సకల కవీంద్ర జిహ్వా పుండ
రీక నివాస మంగీకరించు
ఏ దేవి జడ పైన ఎనలేని రత్నమై
ఒదుగు చంద్రుండెంతొ  ఉజ్వలముగ
ఏ దేవి గళసీమ నింపునింపెడు హీర
నీహార హారాల నిండుకాంతి
ఏ దేవి ఎకిరింత ఎన్న రాయంచయై
స్వేతపద్మాసన సేవ కొదుగు

హస్తముల కీర పుస్తక అక్షమాల
వీణ కల్గిన ఏ దేవి విధికి సుదతి
అట్టి తల్లిని తిరముగా నాత్మ దలచి

వేడుకొందుము శుభముల వెల్లువలకు

మకరంద పానప్రమత్త పుష్పంధయ
         కమనీయ మృదుల గానములు వినుచు
ఘనదామ్ర కిసలయ ఖాదన తత్పర
       వన హృద్య కోకిల ధ్వనులు వినుచు
పరిపక్వ సహకార ఫలరస పరివృత్త
     సలలిత కీర భాషణలు వినుచు
నృత్త విశేష మానిత తాల వృంతాభ
    బర్హిబర్హణ విరావములు వినుచు

చూత జంబీర దాడిమీ శోభలలర
మదిని బంధింప విరజాజి మల్లె విరులు
తటములో మీల గతులెంతొ తనియజేయ
అవ్యయానందమున వచ్చె నావిళంబి

సమస్య : శవ పూజల్ సుఖదాయకంబులు కదా! సంవత్సరాదిన్ సఖా!
భవభోగమ్ముల నివ్వగో రుచుసదా   భక్తిన్ ప్రపూజింతుమే
మవధా నమ్మున నిల్పుచున్ మదిగ దిన్నా సాం తమున్ ప్రీతితోన్
ఎవనిన్ పూజలు సేతుమో  ఫలితమున్ ఇమ్మంచు  నేడట్టి కే

శవ పూజల్ సుఖదాయకంబులు కదా! సంవత్సరాదిన్ సఖా!

న్యస్తాక్షరి
అంశము: సీతారామ కళ్యాణము
ఛందస్సు - ఆటవెలది నాలుగు పాదాల చివరి అక్షరములు వరుసగా 'భ - ద్ర - గి - రి ఉండవలెను
నా పూరణ
చూపు నేలదాక సుందరమౌ శుభ
మూర్తమందు సీత మోద  సాంద్ర
వేదఘోష నడుమ వేసెను  తా సాగి  

రాగభరిత  మాల రాము జేరి

మంచికి ఊపిరూదుచును మాన్యత దానికి తోడుజేయుచున్
మించిన ఆర్ద్రతన్ మితము మీరు సహాయము చేయు బుద్ధియున్
ఉంచుచు నీలకంఠుడను ఉన్నత వ్యక్తిని బంపి నాదరిన్
సంచిత పాప కార్య ఫలసాయము బాపితివయ్య శంకరా!

చేసిన పాపమేమొ మరి చెప్పెడు వారొకరైన లేరు  నే
చేసెదనంచు సాయపడి చిక్కును దీర్చుచు దానియంతమున్
చూసేడు వారు లేరు బహు చోద్యము నా కథ, నింకనైన నా
కోసము, బన్నముల్ గడుప కూరిమి నొక్కని బంపు శంకరా! 

అడ్డము లేరటంచు తమకబ్బిన వంచన, మంచియన్న ఓ
గుడ్డను పింజేపోసి మరి కూరిమి తోడుత కట్టి నాల్క పై
దొడ్డగు జుంటితేనియను తుమ్మెద పట్టుల తెచ్చి రాచి తా
చెడ్డకు పూత పూయుచును చిమ్మె విసంబును ఎంచిచూడగన్

బొడ్డును కోతుమంచు చిరు పొట్టను కోసెడు మంత్రసానులీ
గడ్డన మారువేసముల కత్తుల పూవుల గుత్తులంచు బల్ 
సొడ్డుల తోడుతన్ మిగుల సూక్ష్మ విధమ్మున దారి మార్చి కా
లొడ్డుచు క్రింద త్రోయు కడు లుచ్ఛులు తుచ్ఛులు కాన వచ్చెడున్

సత్వము వారసత్వమయి సామరస్త్వము దానియంగమై
తత్వములో రసత్వమును సత్వర రీతిన పొందగోరి భి
న్నత్వము నమ్మబోక నిను నమ్ముచు నాయెద నిల్పి నేను ఏ
కత్వము చాటుచున్ త్యజిత కాముడ నై మదిగొల్తు శంకరా!  

శ్రీ శంకర తోటకాష్టకము

పరమేశ్వర పాదసేవానురక్తి కలిగినటువంటి పరమ భాగవతులకు నేను అందించే చిరుకానుక ఈ పరమేశ్వర తోటకాష్టక స్తోత్రము.
తోటకము అన్నది ఛందస్సులో ఒక పద్య విశేషము . ఈ తోటకములో రచింపబడినది వెంకటేశ్వరా సుప్రభాతమునందలి 'కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీల తనో' అన్న పద్యముతో మొదలయి 'అజ్ఞానినా మయా దోషా' తో ముగిసే స్తోత్రము. ఇందులో 'సులభం సుఖదం...' వరకు రచన తోటక వ్రుత్తములోనే సాగుతుంది.ఈ వెంకటేశ్వరా స్తోత్రమును ప్రతివాద భయంకర అణ్ణన్ అన్న పరమ భక్తుడు మనవళ మహాముని శిష్యుడు రచించుటకు ఎన్నో శతాబ్దములకు పూర్వమే జగద్గురు ఆదిశంకరులవారిని నుతిస్తూ వారి నలుగురు ప్రథమ శిష్యులలో ఒకరి, ఆనందగిరి అన్న పూర్వ నామము కలిగి, శంకరులచేత ప్రతిష్ఠింపబడిన ఉత్తరామ్నాయ పీఠమునku మొదటి పీఠాధిపతియైన తోటకాచార్యులవారు.ఆయన శంకరులవారి శిష్యులయిన కొత్తలలో మండమతిగా వుండేవారట.అందుచే అందరూ ఆయనను 'గిరి' అని 'అచల' అని పిలిచేవారట. అంటే వారి దృష్టిలో ఆయన అంత మొద్దు.
ఒకనాడు శంకరులవారు ఆనందగిరియోక్క అచంచల భక్తిని మిగత శిష్యులకు చూపనెంచి, ఆవల ఒడ్డుననున్న తన ఆరవేసిన బట్టలను తెమ్మన్నాడు. శిష్యులు ఆలస్యమును సహించలేక పాఠము చెప్పమని శంకరులవారిని తొందర చేసినారు. శంకరులవారు తమ తపః శక్తితో ఆనందగిరిని సకల వేదశాస్త్ర పండితుని గావించినాడు.
బట్టలు తెచ్చి నిలిచిన ఆనందగిరి పారవశ్యముతో తదేకముగా గురువును చూస్తూ, కష్టమగు తోటక వృత్తములో, గురుస్తోత్రమును ఎనిమిది శ్లోకములలో చేసినాడు. అదే తోటకాష్టకముగా ప్రసిద్ధినందినది. ఆయన అప్పటినుండి తోటకాచార్యులుగా పిలువబడినారు.

అటువంటి తోటకములో నావంటి చదువురానివాడు శివుని స్తుతిస్తూ ఒక 

అష్టకమును సంస్కృతములో వ్రాయబూనుట సాహసమే! అయినా నా ఈ 

ప్రయత్నమునకు పరమేశ్వరానుగ్రహము లభించుట చేతనే నేను దీనిని 

సంస్కృతములో వ్రాయగలిగినానని త్రికరణ శుద్ధిగా నమ్ముచున్నాను. నా ఈ 

చిరుప్రయత్నమును మనసారా అభినందిన్చుతారన్న నమ్మకముతో ఈ 

పరమేశ్వర స్తోత్రముతో మీ ముందుకు వస్తూవున్నాను.

భూతాధిప కాల విభూష ధరా
శరణాగత రక్షక సాదు ప్రభో
మమ పాపవిదారక మాన్యవరా
పరమేశ దయాకర పాహి ప్రభో ll 1 ll

కరుణా వరుణాలయ కామ హరా
భవతారణ కారణ భవ్య పరా
అహిధారణ మారణ అక్షధరా
పరిపాలయ మాం శివ భాగ్యకరా ll 2 ll

శివ శంభు మహేశ్వర శైల స్థితా
భవ భూతి ప్రదాయక భద్ర హితా
ఇహ సాగర వారధి ఈప్సితదా
సుకపోల సుధామతి శూన్యరతా ll 3 ll

గళహాల రసంధర గౌరివరా
శిశుచంద్ర విలాసిత శీర్షధరా
అకళంక అనీశ మహా2హిధరా
శరణాగత వత్సల సారతరా ll 4 ll

సుముఖం సుహృదం శుభ సౌఖ్య యుతం
హర శంకర శూలి మహా మహితం
కరిదానవ భంజక కాలసతం
విధి విష్ణు సదార్చిత విశ్వనుతం ll 5 ll
శితికంఠ మయస్కర శీత శిరా
భవబంధ విమోచన భాగ్యకరా
కవిగాయక వందిత కావ్య వరా 
వరదాభయవారణ వస్త్ర ధరా ll 6 ll

పరమేశ పరాత్పర భక్తసుధా
జగదీశ జగద్దిత చారు కథా
పరదేవత, పాలిత భక్త ప్రథా
రమణీ ప్రతి, భంజక రాగ వ్యథా ll 7 ll

పరమాత్మ పతంజలి పాణి నుతం
ప్రమథాధిప, పావన వాణి సతం
సురగంగ జటావళి ఝూట స్థితం
పరమేశ సదాకురు భక్త హితం  ll 8 ll

శివ తోటకమిదం ప్రోక్తం అష్టకస్తోత్ర రూపిణం
ఏ పఠంతి సదా భక్తాః తేషాం శంభుః ప్రసీదతి ll

రామమోహన కృతం స్తోత్రం సాయం ప్రాతర్ పఠేన్నరః

సర్వార్థ సిద్ధిమాప్నోతి సర్వ దుఃఖోపశాన్తయే ll

విష్ణు నుతి
మామ మామ మీకు మాసంపదలనిచ్చి
మసలజేయు మంచి సంతునిచ్చి
మామతీశు నతము మనసార నుతియించి
మంచి పొందగలరు మరల మరల
విష్ణు పత్ని లక్ష్మీదేవికి  తండ్రి యగుటచే సముద్రుడు విష్ణువునకు మామ. అదేవిధముగా తన పాదముల చెంత పుట్టిన గంగ సముద్రుని చేరుటచే విష్ణువు సముద్రునికి మామ, కావున ఆ మామ మామ మీకు మహా సంపదలనిచ్చి , మంచి సంతానమునిచ్చి కాపాడుగాక! మా అనగా లక్ష్మీ దేవికి ఈశుడగు విష్ణువును సతతమూ తలచి సకలసంపదలను సతతమూ పొందుదురుగాక!  

లక్ష్మీదేవి తన సమస్యను ఏవిధముగా పరిష్కరించుకొన్నదో చూడండి

కమల దళాయతాక్షి తమకమ్మున  కాంతుని గూడ నెంచి యా
యమల తటిల్లతాంగి హరి యక్కున జేరుచు యోరకంటితో
తమ దెస గాంచు  యా నలువతత్తర బాపగ నెంచి పూరుషో
త్తము కుడి కన్ను మూయ తమి తగ్గెను తామర గుంక నాభిలోన్

ఒక ఊహ
మత్స్య కేతనుడా ముగుద  మదిన జేరి
చూపు తూపుగ, వింటిగ సుదతి భృకుటి
చేసి విడిచెను నామది  చెదిరి పోవ
ఆపుకోలేను ఈవిరహ మహరహమ్ము

నేటి దుస్థితి
అతిధి ఇల్లు త్రొక్కి అరుదెంచినంతనే
కూరుచుండ జేసి కుశలమడిగి
దాహమిచ్చి యతని తనియింపగా జేసి
గౌరవించినారు గాంచ నాడు

గెస్టు వచ్చినంత గెట్టిన్ను ప్లీజంచు
గ్లాట్టుమీట్ యు చెప్పి కదలనీక
కాఫి చేతికిచ్చి గాసిప్పు మాట్లాడి
పంపుతారు నేడు ‘బాయి’ జెప్పి

అతిథి సేవలెల్ల అగ్నికాహుతియాయె
కాలమాయే మంచి కాలమంత
సాంప్రదాయమెల్ల  చట్టుబండైపోవ
ఏమి మిగిలె మనకు ఎంచిజూడ

పాత చింతకాయ పచ్చడి రుచులను
ఎట్లు తెలియగలరు ఇంట లేక
రోజు మారెనేని రోత వాసనలొచ్చు
తిండ్లు తిన్న కలుగు తిప్పలెన్నొ

చచ్చి బతికి చేయు సంపాదనములెల్ల
హాస్పిటళ్ళ జేసి యంకితమ్ము
సైడెఫెక్ట్లుతోడ చచ్చిపోవుట తప్ప
ఏమి పొందగలము ఈ ధరిత్రి


నాగ సుబ్బా రెడ్డి నవనీత హృదయుండు
నయము కలిగినట్టి నడత యుండు
మానవత్వముపైన మాన్యత బహుమెండు
మనసు గాంచ తనది మల్లెచెండు
కష్టాల కండెల కరకు కంకులగుండు
దొరిలించి ఫలితాల దోచుచుండు
సంసార రథ పార్థ సారధి యాతండు
సంస్కారమున సవ్యసాచి యతడు
రమ్య గుణమణి గృహిణిని రాణి జేసి
ఏల సంసార సామ్రాజ్యమెల్ల వేళ
ఆర్తి తోడుత నడిగెద  నంబ కరుణ
రేయియునుపగలు బనాసు రెడ్డి బడయ

వివిధ విధముల నవ్వులు
పూర్ణ చంద్రుని నవ్వు పులకరింపుల నవ్వు
పూలు విరియు నవ్వు  పుచ్చు నవ్వు
వీరోచితపు నవ్వు విశ్వజేతలనవ్వు
వెగటు పుట్టు నవ్వు వెకిలి నవ్వు
తేలుకుట్టిన నవ్వు తేనే బూసిన నవ్వు
తేలికయిన నవ్వు తిక్కనవ్వు
మేలుబంతుల నవ్వు మేధావికగు నవ్వు
 ముద్దులొలుకు నవ్వు మొలక నవ్వు

పొగరు కూడిన నవ్వును వగరు నవ్వు
రక్కసుల నవ్వు వెలుపల రాని నవ్వు
చెప్పలేనన్ని నవ్వులు జెలగ భువిని
చెప్పలేకుంటి నెన్నని చేతగాక 

ఒక సినీతార వీరాభిమాని


కచ్చటికమ్ము తోడనొక కమ్మని పోజున గోడనున్న నీ
పచ్చని మేను జూచునను పజ్జన వచ్చెడుబస్సు గ్రుద్దగా
అచ్చెరువంద నా రుధిర మంటుచు నీ పదదోయి వెంటనే

విచ్చె  వియచ్చరల్ బొగడ వేడుక కెంపుల తమ్మి పూవులై


పోల్రెడ్డి
వెన్న కన్నను మిన్నయౌ మనసు వుండి
బాధ జలధుల గుండెలో బడసి యుండి
మానవత్వము నెప్పుడూ మరువకండి
మసలు బసిరెడ్డి పల్రెడ్డి మాన్యతముడు
నీల ఘనుడతండు నీటైన వపుషుడు
నొక్కు జుట్టు వాడు నడుగు రేడు
నాణ్యమైనయట్టినాగరీకుడతండు
నెమ్మి చెరువు నాకు నెయ్యుడతడు

రామకృష్ణా రెడ్డి
మనిషి మౌని గాని మనసేమో మాటాడు
వెతల గతుల జూచి వెరవడతడు
బాధ హృదయ గదిన  బంధించి యుంచును
రామ కృష్ణ రెడ్డి రజత నగము
నాగేశ్వరమ్మ నిజముగ
మాగిన రసభరితమైన మామిడి పండున్
సాగెడు తుంగా తీర్థము
రాగములో కోకిలమ్మ రాగము బోలున్
అభినందన
 కచము జంఘమంట కదులుచు శ్రీదేవి
విరులు కురులు జేర్చి  వేడ్క మీర
మరులు గొల్పు రీతి మందస్మితము తోడ

సిరులు తెచ్చు మీకు శీఘ్ర గతిని
అభినందన
 కురులు జంఘమంటి కుులుకగ, శ్రీదేవి 
విరులు  జేర్చి జడకు  వేడ్క మీర
మరులు గొల్పు రీతి మందస్మితము తోడ
సిరులు తెచ్చు మీకు శీఘ్ర గతిని

దేశ పటము
రాజకీయములందు రాటుదేలిరి గాని
శూరత క్రియలందు చూపుటేది
కవితలల్లుటయందు కాళిదాసులె గాని
ఉపమానములు వ్రాయ నూహ ఏది
వాగ్దాన కర్ణులై వరలు వారలె గాని
మాటలు నిలబెట్టు మాన్యతేది
శ్రీ రంగ నీతులు జెప్పువారలె గాని
చేతలో జూపించు చేవ ఏది
కుటిల బుద్ధులు మంచిని కుంచె తోడ
చేసి పటమును గోడకు జేర్చినారు
చూపుటకు దప్ప నది చేత చూరగొనదు
వీరలే నేడు మనపాలి వీరులైరి
జయహో భారత మాతా
స్వాతంత్ర్య దినము దగ్గర పడింది. వీలు చేసుకొని తల్లి భారతిని తలచుకొందామా!
వీర నారులు మరి విదుషీ లలామల 
      మహిళామణులయొక్క మాన్య మాత
దేవ పుత్రులగాక దేవదూతలగాక
                       దేవునే కంటివి తెల్ప గీత
వేలవత్సరముల వెనుక వెలసినయట్టి 
                పరమ పావన కీర్తి భరిత నేత
వేద చోదితమైన విజ్ఞాన ఖనివౌత
                    నిష్ఠ తోజేతును నీకు జోత

విశ్వవిజ్ఞాన దాతయౌ విమల చరిత
చారు కరుణానురాగాల శాంత సరిత
దివ్య ఋషిముని శాస్త్రజ్ఞ ధీర భరిత
లేదు  కొలమానమిల  కొలువ నీదు గరిత