Thursday, 7 February 2019

హవనం


హవనం
https://cherukuramamohanrao.blogspot.com/2019/02/blog-post_7.html
ఉపోద్ఘాతము: నేను హవనమన్న శ్శీర్శికను ఉంచినా వివిధ విధములగు హవనములు, హవన ధర్మములు, వాడు సమిధలు, తీసుకొనవలసిన బాధ్యతలు మొదలగు వానిని గూర్చి వ్రాయుటలేదు. నాకు చేతనయిన మేరకు హవనము యొక్క గొప్పదనము మీమున్డుంచే ప్రయత్నమూ చేయుచున్నాను. ఇక చదవండి.

" ముస్లిం చెట్టుమీద ఆకుపచ్చ జండా కట్టి దర్గా అంటాడు .
క్రిస్టియన్ కర్ర కోసి శిలువ చేస్తాడు .
హిందూ ముక్కలు చేసి హవనం చేస్తాడు . " ఇది ఒక ముసల్మానుడు ఆస్యగ్రంధిలో ఉంచిన మాట, తానూ నిరంతరము చేసే జీవహింస, మరియు ముఖ్యముగా గోవధలను ప్రక్కనుంచుతూ. క్రైస్తవుడు శిలువకు మాత్రమే రెండు కర్రలను కోస్తాడు. మరి హిందువో నిర్దాక్షిణ్యముగా చెట్లను నరుకుతాడు. ఇది ఆయన లేఖనము యొక్క సారాంశము.
ఈ వాక్యాలను గమనిస్తే హిందువు కు చెట్టు అంటే గౌరవము లేదు, అనేకదా ఆయన భావము. కానీ ఆయనకు తెలియని విషయము ఏమిటంటే  బహుశా చెట్లకు హిందూ మతము లో ఉన్నంత ప్రాముఖ్యం ఏ ఇతర మతములలో లేకపోవచ్చునని నా భావన.

నిత్యపూజ జరిపేది తులసికి . ప్రదక్షిణం చేసేది మేడి, రావి, జువ్వి మొదలగు చెట్లకు . తోరణాలలో వాడేది మామిడి . విస్తరాకులకు వాడేది మోదుగ . ఉపనయనం లో వటువు పట్టుకునే కొమ్మ అదే ! శుభ, అశుభ కార్యములలో వాడేది దర్భ. మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. అది ఎంతటి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుందో ఈమధ్యనే రుజువయింది. అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. దసరా నాడు పూజలను అందుకునేది శమి. వినాయక పూజ జరిగేది పలువిధములగు ఏకవింశతి పత్రములతో! పరమాత్మ తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును  అని  భగవద్గీత ద్వారా తెలియజేస్తున్నారు. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు ఆరెండు వృక్షములను ఒకటిగా నాటి తమతమ దోష పరిహారార్థము వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు. పందిళ్ళు వేసేది ఆకులు, కొమ్మలతో! ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని . షామియానాల సంప్రదాయమే మనకు లేదు.దానిని మన ధర్మములో అశుచిగా పరిగణించుఁతారు.
నిత్యజీవితం లో భాగమైన చెట్టుయొక్క కొమ్మలను హవనం చేయడం ఎందుకు అనే ప్రశ్న బహుశా ఆయన పైన వ్రాసిన హిందువులకు సంబంధించిన వాక్యామునకు అర్థము ఉండవచ్చు. వాళ్ళ మతము ఆవిర్భవించిన దేశములో ఇసుక ఖర్జూరము తప్ప వేరు చెట్లు కనిపించవు. కావున వారికి చెట్లకు సంబంధించిన అవగాహన వుండే వీలే లేదు.
మనిషికి చెయ్యి విరిచితే పుట్టుకురాదు కానీ కొమ్మలను ఆకులను విరిచితే అవి తిరిగీ పుట్టుకొస్తాయి. పూజ, హవాన కార్యములకు కొన్ని ప్రత్యేకమగు చెట్ల ఆకులు, కొమ్మల పేళ్ళు మాత్రమే వాడుతారు చెట్టును సర్వనాశనం చేయరు . ఈ మాత్రము కూడా తెలుసుకోకుండా పుర్రెకు తోచినది వ్రాసి పాఠకుల ముఖముపై విసరివేయగా మనలో వున్న జిజ్ఞాసారాహిత్యులు ఔరా! ఎంతటి వాస్తవమును నొక్కి వాక్కాణించినాడని ముక్కుపై వ్రేలు వేసుకొంటారు. వాస్తవము తెలుసుకొనే ఓపిక ఉంటేకదా వారికి.
హోమం / హవనం/ యజ్ఞం/ యాగం .. పేరుఏదైనా , క్రియ ఏదైనా జరిగేది అగ్నిహోత్రునికి రకరకాల పదార్థాలను సమర్పించడం . అది వెర్రి పని కాదు . వివేకవంతులు చేసే పవిత్రమైన, లోకకళ్యాణమును ఆశించి చేసే కార్యం.
అగ్నికి సమర్పించే అతివిలువైన వస్తువుల నుండి వచ్చే ధూమము పరిసరాల కాలుష్యమును దూరం చేస్తుంది. వాతావరణ సమతౌల్యమును కలిగించుతుంది. మేఘములనావిర్భవింపజేసి వర్షము కురిపిస్తుంది.యజ్న ధూమము కలుశాయాయు వినాశినిగా పనిచేస్తుంది. మానసిక, శారీరక అలసటను దూరంచేస్తుంది . ప్రశాంతతను ప్రసాదిస్తుంది.
శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత లో చెప్పిన ఈ శ్లోకమును చూద్దాం !
! శ్లో ! అన్నాద్భవంతి భూతాని , పర్జన్యాదన్న సంభవఃl
యజ్ఞాద్భవంతి పర్జన్యో , యజ్ఞః కర్మ సముద్భవః ll 3-14
అన్నమువలన జీవము, మేఘములనుండి అన్నము, ( వర్షము వలన అన్నము / ఆహారము ) ,యజ్ఞముల వలన మేఘములు , కర్మవలన మేఘములు సంభవము అని కదా వివరించుట జరిగినది.
కాస్త లోతుగా ఆలోచిద్దాం, అసలు హిందువు హవనం ఎందుకు చేస్తాడో!
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తృ నిహాతసి
ఒక పనిని చేయవచ్చునా చేయకూడదా అన్న సందేహము మనలో కలిగినపుడు
ఆ సందేహ నివృత్తి చేయగలిగినది శాస్త్రం మాత్రమే అన్నది భగవంతుడు ఒక సందర్భములో చెప్పిన మాట. భగవద్గీత ఈ విధముగా చెబుతూవున్నది.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 3.10:
సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పినాడు, "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త కోరికలను తీరుస్తాయి."
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ।।  3.11
మీ యజ్ఞముల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.
1984 డిసెంబరు 2-3 మధ్య రాత్రిన జరిగిన భోపాల్ విషవాయు దుర్ఘటనను గూర్చి అందరికీ తెలిసిందే. అందు 5 లక్షలమంది మరణించినారని అంచనా. ఒక గొప్ప విశేషమేమిటంటే అంతటి ఉత్పాతము నుండి కూడా ముందురోజు యజ్ఞము చేసిన కుటుంబము మాత్రము పూర్తిగా రక్షిమ్పబడినది. ఇది నాటి పత్రికలో వచ్చినవార్త. కట్టుకథ కాదు.
మరియొక వాస్తవాన్ని గూర్చి తెలుసుకొందాము. 1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో విడిది చేసి యుండినారు......
మిగిలినది తరువాత చదువుదాము.........
హవనం-2
1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో విడిది చేసి యుండినారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ ప్రతినిధులు హాజరయి వుండినారు. మాంసాహారాన్ని వదలి శాఖాహారులుగా మారుట ఆ సదస్సున అంగీకరించిన తీర్మానము. అహింస మరియు శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని నిర్ణయించుకొన్నారు.
ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులను పరమాచార్య వారి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని రావటం జరిగింది. స్వామివారిని కలవాలని వారు ఎంతో ఉత్సాహాన్ని చూపించినారు.
శంకర మీనన్ గారు అందరినీ తగురీతిగా పరిచయము చేసినారు. స్వామివారిని వారికి పరిచయము చేయబోగా వారు వారించి, “నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు.
కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదట “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?” అని అడుగుట జరిగింది. అందుకు మహాస్వామి వారు “అది చేయతగినదే. అది పాపం కాదు” అని తెల్పినారు. ఆ మమతకు అతిధులు ఫక్కున నవ్వినారు. స్వామి వారిని అవమానపరచినారని మీనన్ ఆగ్రహముతో ఊగిపోయినారు.
స్వామివారు మీనన్ ను శాంతపరిచి, “వారిపై కోప పడవద్దు. వారు జీవహింస పాపము  అన్న ఒక నిర్ధారణతో ఇచ్చటికి  వచ్చినారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వటంజరిగింది. నన్ను అవమాన పరచవలెనన్న ఆలోచన వాళ్ళకు లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి. అంతే!” అని శాంతంగా చెప్పినారు.
మహాస్వామి ఈ విధంగా తన సంభాషణ సాగించినారు. “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపినాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా?  న్యాయమూర్తిది పాపకార్యము కాదా?”
వారు అలోచనలో పడినారు. మరలా స్వామివారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చినాయనుకుందాము. అప్పుడు ముందు అగ్నిమాకప వాహనాన్ని పంపిస్తాము. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనము, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాము. కొంతమంది ప్రాణ రక్షణ కంటే దేశ రక్షణ గొప్పది. అదేవ్బిధముగా రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధాలలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ సంఘటనలన్నింటిలోనూ మనం జీవహింసను అమోదిస్తూ ఉన్నాము. ఇలాంటి నియమాలను మనము ఏర్పరుచుకున్నవే! అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.
వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘అహం బ్రహ్మస్మి’ అన్న వేదవాక్యము అనుభవములోనికి వచ్చినవానికి యజ్ఞముతో పని ఉండదు.
వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానమున్నది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి కర్మకాండ యందు విపరీతమైన మక్కువ. ఆయన లోకక్షేమము కొరకు తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయినాడు. ఆ స్థితిని పొందినా అతను వానిని మానలేదు. నారదమహర్షి వచ్చి అతనికి జ్ఞానోదయము కలిగించిన పిదప, అతను వానిని మానివేయుట జరిగినది.
కాబట్టి, కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. అహింస అనేది వారి వారి ఆశ్రమ ధర్మాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే అహింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు.
అయినాకూడా
అగ్నికార్యం గావాలంబం సన్యాసం పలపైత్రుకంl
దేవేరాశ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జ్యయేత్ll
అని శాస్త్రవచనము. అగ్నికార్యము అంటే గృహస్తులు చేసే యజ్ఞయాగాదులు, గోవధ, సన్యసించుట, తద్దినములలో మాసము వండుట మరియు మాంస భక్షణము, వేదోక్తముగా వివాహము జరిగిన స్త్రీతో సంతానమును పొందుట అన్నవి కలియుగమున పాటింపనవసరము లేనివి. ‘అగ్ని కార్యం’ బదులుగా ‘అశ్వమేధం’ అన్న పాఠాంతరము కూడా కలదు. ఆమాట కూడా నిజమే కావచ్చు. ఈ కాలమున అప్పుడప్పుడు అటు ప్రభుత్వమూ కానీ, ఇటు కోటీశ్వరులు కానీ, లేక పెద్ద పెద్ద దేవస్థానములు కానీ యజ్ఞములు తలపెట్టినా అశ్వమేధము చేసిన సందర్భములు కానరావు. యుగధర్మమును అనుసరించియే జీవన విధానము సాగుతూవుంటుంది.
ఈవిధముగా హవనమును గానీ, చెట్లను గానీ, ఆహార విషయములలో గానీ, గోపూజల యందు గానీ, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే ఎన్నో విషయములను సోపపత్తికముగా తమ దివ్యదృష్టిచే నిరూపించి మనకొసగినారు. రెండువేలు, పదిహేను వందల సంవత్సరముల మత గ్రంధముల ఆధారముతోను, ప్రవక్తలు చెప్పుటచేతనూ ఏర్పడిన మతము కాదు మనది. ఇది ధర్మము. బ్రహ్మజ్ఞాన తత్పరులగు మునులు తమ శృతులచే మనకందించిన సహేతుక శాస్త్రీయ విజ్ఞానముతో కూడిన జీవన విధాన ధర్మము.
మనలను పాశ్చాత్యులు, కుహనా లోకిక వాదులు, మహమ్మదీయ చరిత్రకారులు, వామపక్ష అధినాయకులు అన్నివిధాలా కళ్ళకు గుడ్డకట్టి సినిమా చూపించినారు. అగమ్యగోచరములో ఉంచి మన విధులు కర్తవ్యములను మనచేతనే అవహేళన చేయించే స్థితికి తెచ్చి మనలను నీతి, నియమము, అహింస, సత్యము, శౌచము, దయ, ధర్మము, అంటే ఏమిటో తెలియని ఒక 7 రోడ్ల కూడలిలో కళ్లుపొడిచి నిలబెట్టినారు. కానీ విశ్వ జేత, విశ్వనేత, విశ్వదాత, విశ్వత్రాత, విశ్వ తాత (తాత అంటే తండ్రి అని అర్థము), అగు ఆ పరమాత్మ మనకు చూపు ప్రసాదించినాడు. ఆయనపై అచంచల విశ్వాసముతో, ప్రగాఢ భక్తితో, నిరంతర అనురక్తితో, అకుంఠిత శక్తితో, ముక్తి పై రక్తితో మనము పూజించితే ఈ 7 గుణములను మనము కూడలి నుండి కదలకుండానే మనవడ్డకు చేర్చుతాడు. మన దేశము, మన ధర్మము, మన పూర్వుల యొక్క ఔన్నత్యమునకు సంబంధించిన వాస్తవాలను లోకానికి చాటుదాం.

స్వస్తి.


1 comment:

  1. Very nice and descriptive article. Thanks for the post and information.

    ReplyDelete