ఆంధ్ర భాగవత వినీలాకాశము లోని కొన్ని నక్షత్రములు - 2
భాగవతము –దశమస్కంధము-కృష్ణలీల
https://cherukuramamohanrao.blogspot.com/2020/12/2.html
10-1-338
శా. అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన
దండింపవే
అమ్మా! మట్టి తినడానికి నేనేమయినా
చంటిపిల్లవాడినా చెప్పు. ఇప్పుడే కదా
పాలు త్రాగినది, వెంటనే ఆకలి వేస్తుందా! నేనేమైనా వెర్రివాడినా మట్టి
తినుటకు. నీవు నన్ను కొట్టవలెననుచెడు తలంపుతో
వీరు ఈవిధముగా కల్పించి
చెప్పుచున్నారు. నీవు కోరితే నేను నా నోరు
తెరచి వాసన చూపగలను. ఒకవేళ
నేను చెప్పినదే అబద్ధమైతే కొట్టుదుగానిలే!
వీరి చెప్పుడుమాటలు నమ్మవద్దు. అని
చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని బెదిరిస్తున్న తల్లి యశోద కు ముద్దు
మాటలలో చెబుతూ వున్నాడు.
ఈ పద్యమును కాస్త విశ్లేషించుకొందాము.
బాలకృష్ణుని వాత్సల్యమును యశోదపై చూపబోవు
పద్యమిది. నిజానికి ఈ సందర్భమున యశోద
తల్లి. ఆమె పుత్రునిపై వాత్సల్యము చూపించవలసిన ఉనికి కలిగినది. కానీ ఇక్కడ బాలుని
రూపములో ఉన్న పరమాత్మ , తనను, ఆత్మతో సమానముగా, అసలు ఆ మాటకొస్తే అంతకన్నా మిన్నగా చూచుకొను ఆ తల్లికి తన విశ్వరూపము
చూపించదలచి ఈ నేపమును ఎన్నుకోన్నాడు. ఇంతా జేసి విశ్వరూపము చూపిచినా ఆమెను ఆ
స్మృతిలోనే ఉంచలేదు. కారణం ఆ మాటే ఆమె స్మృతిలో నిలచిపోతే మాతాసుతుల సంబంధము
అంతటితో ముగిసిపోతుంది. పరమాత్మకు ఆ అనుభూతి మరి దొరుకదు. అందువల్ల ఆయన ఆ అవకాశము
జారవిడుచుకోలేదు. పైపెచ్చు ఆయన పరమాత్మ అని రేపల్లె మాత్రమేప్రాకదు. విశ్వమంతా
నిండిపోతుంది. దానివల్ల అవతరణ కార్యమునకు అనేకమయిన అడ్డంకులు కలుగుతాయి. ఇవన్నీ
తెలిసినవాడు కావుననే ఆయన పరమాత్ముడైనాడు, నమ్మిన వారికి
పరమాప్తు డైనాడు. అందుచేతనే ఆమెకు ఆ అవకాశము కలుగనీలేదు. పైగా తల్లికి ఒకవిధముగా
మనకు మరొ విధముగా అర్థమగునట్లు తెలియజేస్తున్నాడు.
మొదలు పెట్టడమే ‘అమ్మా! మన్ను దినంగా నే
శిశువునో’ అన్నాడు. తల్లి ‘కాదు’ అని అర్థము చేసుకోనవలేనన్నది ఆయన ఉద్దేశ్యము.
మరిమనకో? బ్రహ్మాన్డమే బంతిగా భాసిల్లే పరమాత్మ దానితోనే కదా ఆడుకొంటున్నాడు! మరి
ఆ బంతితో ఆడుకొనే ఆయన ‘శిశువు’ కాక ఏమౌతాడు. నేను ‘ఆకొంటినో’ అని అంటున్నాడు.
నాకడుపు ఖాళీగా వుంచవు కదా నేనెట్లు ఆకలి గొంటాను అని ముద్దుముద్దుగానే తల్లికి
సమాధానమిస్తున్నాడు. మనుషులను కలుపుకొని పశుపక్షి వృక్షజాలములనేకాక సమస్త జలరాశులనూ
తన ఉదరములోనే దాచుకొన్న ఆయనకు ఆకలి ఎక్కడిది, నేను ‘వెర్రినా’ అంటాడు. ఒకవిధముగా
లౌకికుడగు వెర్రివాడు మన్నుతినవచ్చు, అందుచేత తల్లికి నేను వేర్రివాడను కాదు అని
నమ్మబలుకుతున్నాడు. మనకు మాత్రము నేను లోకాలనే వేర్రేత్తించే సౌందర్యము, సాహసము,
సమయస్ఫూర్తి, బుధజన విధేయత కలిగిన వాడను. ఆమాయలోబడి వెఱ్ఱి వాళ్ళయిన మీరు నన్ను వేర్రివాడని
తలచుచున్నారు అని తెలుపుచున్నాడు. ఇంత
భావమును భావుకుడగు భక్తుని మదిలో బంధించుచున్నాడు
భగవంతుడు.
ఒకపరి చూడండి వ్యాసులవారి సంస్కృత మూలం:
నాహం భక్షితవాన్ అంబ
సర్వే మిథ్యాభిశంసినః
యది సత్య గిరస్తర్హి
సమక్షం పశ్యమె ముఖం
"నేను తినలేదమ్మా. అంతా నా మీద తప్పుడు నేరం మోపుతున్నారు. అది నిజమని
నువ్వనుకుంటే, నువ్వే, నీ కళ్ళతో నా నోరు చూడు."
ఇంత చిన్న భావమును కలిగిన శ్లోకమును మన
పోతన్న ఎంతగా సాగదీసి నాడో చూడండి. అందుకే నాదృష్టిలో ఆయన కవిపోతు (కవి
వృషభులు)లకు అన్న, ఆయనే చెప్పుకొన్నాడు తనను 'పోతరాజని, నేనెవరిని చెప్పుటకు.
స్వస్తిమరొకమారు మరొక పద్యముతో.....
6 -10- 342
మ. “కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని
ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు
చింతింపఁగన్
పరమాత్ముడు కదా! తన్ను పెంచిన తల్లికి తన లీలావిలాసమును
చూపింపదలచినాడు. నోరు తెరచి చూడమన్నాడు.
అంతే! కొడుకు నోటిలో బ్రహ్మాండమును జూసి విభ్రాంతురాలైన
యశోద
ఈవిధముగా తలపోయసాగింది.
ఇది కలయా! లేక విష్ణుమాయయా? లేక చిత్తభ్రమా? లేక ఇది సత్యమా?
నాకేమీ పాలుబోవుటలేదు. అసలు నేను యశోదనా కాదా? నేనేదయినా
పరస్థలమున వున్నానా? ఈ బుడుతడి నోటిలో బ్రహ్మాండమంతా ప్రజ్వరిల్లుటకు
కారణము ఏమిటి? ఆలోచించేకొద్దీ ఇదంతా అంతుచిక్కని ఆశ్చర్యమునకు
గురిచేస్తూవుంది అని విస్తుపోయింది.
గీతోపదేశ సమయములో, పరమాత్ముని విశ్వరూపము చూసిన అర్జునుడు కూడా,
స్వామి విశ్వరూపమును సందర్శించుకొని, యశోదా దేవి వలె
మనసులో తలపోయక,
తానేమేమి చూచినది స్వామితోనే వివరముగా చెబుతాడు.
పశ్యామి దేవాం స్తవ దేవదేహే
సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్
బ్రహ్మాణమీశాం కమలాసనస్థ
మృషీంశ్చ సర్వానురగాంశ్చదివ్యాన్
పరమాత్మ విశ్వరూపదర్శనం చేసిన పార్థుడి పారవశ్యానికి ప్రతీక
ఈ శ్లోకం. ‘కృష్ణా, నీ
విరాట్ స్వరూపంలో కమలాసనుడైన బ్రహ్మను, పాపవర్గ భయంకరుడైన శంకరుని, సకల
దేవతామూర్తులను, సప్తర్షులను, నానావిధ
ప్రాణికోటిని, దివ్యమైన
సర్పాలను కన్నులారా కాంచగలిగినాను’ అని చెబుతాడు. అది విరాట్ స్వరూపము. ఆ మూర్తిపై
భక్తితో దృష్టి నిలిపిన వ్యక్తికి పరమేశుని పాద సన్నిధి లబించినట్లే!
భక్తి భావము హృదయములో పాదుకొనవలెనంటే అచల విశ్వాసము, నిశ్చల భక్తి
ఎంతో అవసరము. అది లేనివాని పరిస్థితి ఈ క్రింది విధముగా
ఉంటుంది.
సంస్కృత న్యాయాల్లో “సన్యాసి యోషా న్యాయం” అన్నది ఇందుకు ఒక
చక్కని
ఉదాహరణ.
ఒక ప్రవాచకుడు వేదాంతోపన్యాసమును గావించి,
వైరాగ్యము యొక్క
గొప్పదనమును కూలంకషముగా తెలియజేసి బయటికి రాగానే అందమైన
యువతిని చూసినాడు, అంతే!
ఆరంభ ఆరంభములోనే ఆతని చూపుకు కేంద్రబిందువయ్యింది.
ఇటువంటి వారికి దేవుడేదిగివచ్చినా తమ మాయామోహములను వీడరు.
శిశుపాలునికి శ్రీకృష్ణుడు దేవునిగా కనిపించలేదు కదా! ఇక్కడ
యశోద ఎంతో
పారవశ్యముచే ఆ సర్వేశ్వరుని చూసినా దానిని నిలుపుకోగల
పారమార్థిక పరిపక్వత ఆమె సాధించలేదు కావున పరమాత్మ క్షణములో ఆమెను మాయామోహితగా చేసివేసినాడు.
ఈ దిగువన నేను కాకతాళీయముగా, శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు వ్రాసిన
ఒక వ్యాసములోని, పరమాత్మను
నిర్వచించే, ఒక ఖండమును, అత్యంత సంగతమని తలచి మీముందుంచుచున్నాను.
"బృహిర్బ్రహ్మ
వృద్ధౌ బృహతే ర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః వస్తుతః
అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మేతి" అని శంకర భాష్యం. ఒక దేశంలో ఉన్నది, ఒక దేశంలో లేనిది, ఒక కాలంలో ఉన్నది, ఒక కాలంలో లేనిది, ఒక వస్తువులో ఉన్నది, ఒక వస్తువులో లేనిది అని నిరూపించటానికి వీలులేక ఏది సర్వదేశ సర్వకాల సర్వవస్తువులలో సర్వావస్థలలో పరిపూర్ణంగా వ్యాపించి, తనకు రెండవది లేక, సర్వం తాను తానై ఉన్నదో అదే పరమాత్మ. ఆ పరమాత్మ వస్తువు దేహం పుట్టక మునుపు, పుట్టిన తర్వాత, ఆ వెనుక, కాలత్రయంలోనూ సృష్టిస్థితిలయాల బాధలేక, స్వతస్సిద్ధంగా ఉన్నది. ఒక ఖాళీస్థలంలో ఇల్లు కట్టుకొంటే, ఇంటి చుట్టూ ఉన్న జాగాను ఆవరణం అంటున్నాము కదా! ఇల్లు లేనప్పుడు ఉండిన ఖాళీలోనే ఇల్లు కట్టిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఇంటిలోపల ఉన్న ఖాళీ ప్రత్యగాత్మ అయితే ఇంటి వెలుపల ఉన్న ఆవరణం పరమాత్మ అన్నమాట. అది ఖాళీగా ఉన్న మైదానంలో ఏర్పడిన వ్యవహార భేదమే కాని వస్తుభేదం కాదు. ఆ విధంగానే, ప్రత్యగాత్మ పరమాత్మల ఐక్యానుసంధానానికే యోగమని, బ్రహ్మజ్ఞానమని, విదేహ కైవల్యమని పేర్లు. ఈ జీవుని వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థమైన ప్రత్యగాత్మ యొక్క; ఈశ్వర వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థమైన పరమాత్మ యొక్క ఐక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే అమనస్క రాజయోగ సమాధి. ఇందుకు భిన్నంగా మాయ కమ్ముకొన్నప్పుడు జీవికి దేహాభిమానం కలుగుతుంది. జడములైన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనవే తాననే విపరీతదృష్టి అలవడుతుంది. ఇదే బ్రాంతి. దీని పేరే మోహం. అభిమానం వల్ల దంభము మొదలైన గుణాలేర్పడుతాయి. ఆత్మాశ్రయత్వమే సర్వానర్థాలకూ మూలం. ఈ స్థితిని ఇటు యశోద అటు అర్జునుడు చెతికంది కూడా అట్టిపెట్టుకోలేక పోయినారు.
స్వస్తి.
మరొకమారు మరొక పద్యముతో..........
70.1.495
మ. జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ
గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్
దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి
రచటన్ గోపార్భకుల్ భూవరా!
ఈ పద్యమును
శుకయోగీంద్రుడు పరిక్షిన్మహారాజునకు గోపకులు కృష్ణునితో
గూడి చల్దులు
ఆరగించుతాను ఈ విధముగా వర్ణించుచున్నాడు.
ఓ పరీక్షిన్మహారాజా! తామరపుష్పమునకు నాభీస్తానము ఏదయితే వుంటుందో
అట్టి స్థానమున
శ్రీకృష్ణుని కూర్చుండజేసి,చుట్టూ తామర రేకులు పరచుకొని
వున్నట్లు గోపబాలకులు
చల్దులారగించుటకు కూర్చున్నారట.రాతిపలకలు,
తామరాకులు, వెడల్పైన
గడ్డిపోచలుతోను లతలుతోను పొడుగాటి పొన్న
పూలతోను అల్లిన చదరలు, తెచ్చుకున్న చిక్కాలు, వెడల్పైన ఆకులవంటివి
అన్నీ
కంచములుగా భావించి
అందరూ చక్కగా చల్దులు ఆరగించినారట.
ఎంతటి చక్కని
సాదృశమోకదా! ఎంత రమ్యమైన పోలిక.పద్మమును నాభియందు కలినవాడు ఇచట పద్మాకారమునకు
నాభియై కూర్చున్నాడు. అనుచర భక్తగణమంతా ఆ పద్మముయోక్క రేకులు. ఆ కర్ణిక
ఉన్నంతవరకూ, ఆ పరమాత్మ నామము ఆకర్ణికమగునంతవరకు, పర్ణికలై ఆ కర్ణిక చుట్టూ
తామున్నంతవరకూ తమకే ఆపదాలేదన్నది వారి సుధృడ విశ్వాసము.
ఇక్కడ వీలయినంత క్లుప్తముగా
అఘాసుర వధను గూర్చి ముచ్చటించుకొందాము.
కృష్ణపరమాత్మ సాటి
గోపబాలురతో కలిసి తమతమ ఇళ్ళకు పోవుసమయమున తన మిత్రులతో ‘రేపు పొద్దున మనము మనకిష్టమయిన రీతిగా చల్దులను చక్కగా చిక్కములలో పెట్టుకొని, వెళ్ళెదము. అరణ్యములో మనందరము ఒక రమ్యమయిన కలిసి కూర్చుని తెచ్చుకున్న
చల్దులు ఆరగిద్దాము’ అన్నాడు.
కొన్ని సంవత్సరాల
క్రితము, మన Lunch Box లేక Lunch Carrier లను ఒక plastic thread తో అల్లిన bag లో పెట్టుకొని పోయే రోజులు గుర్తు ఉండే వుంటుంది. పూర్వము ఆవిధముగా వుండే
తిత్తిని గోగు నారతోనో జనుపనారతోనో చేసేవారు. దానిని 'చిక్కము' అంటారు. తెలియనవారు గ్రహించుటకు ఈ మాట వ్రాసినాను.
మరుసటి రోజు అనుకొన్న
ప్రకారమే వారు పశువులతో అడవిజేరి ఆడుకుంటుంటే అక్కడికి, బాలకృష్ణుడు మట్టుబెట్టిన,
బకాసురుని సోదరుడగు అఘాసురుడు శ్రీకృష్ణుడు ఆతని బృందముపై పగ తీర్చుకొనుటకు అచటికి
వచ్చినాడు. అఘము అనగా పాపము. వాడు వచ్చి కొండచిలువ రూపంలో పైదవడ ఆకాశామునకు తాకుతూ ఉందా అన్నట్లు కింది
దవడ భూమికి తాకించి నోరుతెరుచుకొని పరమాత్ముని ఆయన పరివారమును ప్రతీక్షించ
సాగినాడు.
కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు,
మ్రింగివేస్తుంది. తరువాత అది ఏ చెట్టుకో గట్టిగా చుట్టుకున్నపుడు లోపల ఉన్న జీవి ఎముకలను నజ్జునజ్జు చేసి నిర్జీవినిచేసి
ఆరగించుతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది.
ఎదో కొండమార్గమని తలచి
గోపబాలురు తమ గోసంపదతో సహా ప్రయాణమును కొనసాగించినారు. వారు దాని కడుపులోనికి
వెళ్ళిపోయినారు. వారి వెనుక వస్తూవున్న శ్రీకృష్ణునికి, అదికొండచిలువ అని, అఘాసురుడు
ఆ రూపములో ఉన్నాడని తెలుసు. కృష్ణుడు ఏమాత్రము వెనుకాడక లోనికి వెళ్లి గొంతు
వద్దకు చేరి తన శరీరమును నిటారుగా పెంచి పెద్ద స్తంభములా అయిపోయినాడు. అది నోటిని
నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను తాకించి చివరకు దాని ప్రాణము తీసినాడు. ఆ విగత ప్రాణి
నుండి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి చిన్నికృష్ణుని లోనికి చేరిపోయిందిపోయింది. పరమాత్మలో
లీనమగుటతో ఆ రక్కసుని పాపములన్నీ పటాపంచలయిపోయినాయని వేరుగా చెప్పనవసరము లేదు.
ఈ లీలలోని అంతరార్థము కాస్త తెలుసుకొన
ప్రయత్నించుదాము. అఘము లేక పాపము అనగా దుష్కర్మ ఫలితము. ఈ ఫలితము దుఃఖదాయకము. అదే
ఈ నోరు తెరుచుకొని మనదారికడ్డముగా యున్న కొండచిలువ. మన పాపకర్మ మనలను దానిలోకి నేరుగా
నడిపించినది. ఈ పాపము అనగా కర్మ ఫలము ప్రారబ్ధమూ కావచ్చు, సంచితమూకావచ్చు. కానీ గోపబాలుర విశ్వాసము ఒకటే! సర్వకాల సర్వావస్తల యందునూ,‘వెనక
కృష్ణుడు ఉన్నాడు’ అన్న ఒక మూఢనమ్మకము. మనకు కావలసినది కూడా అదే!
పిల్లలను బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీరినందరినీ తీసుకొని తమ చల్డులనారగించుటకు ఉచిత స్థలమును చూసి, వారితో ఈ విధముగా చెబుతున్నాడు.
‘ఎండన్ మ్రగ్గితి
రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార! చల్ది
గుడువన్ రమ్యస్థలం బిక్క డీ
దండన్ లేఁగలు నీరు
ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచున్
దండంబై విహరించుచుండఁగ
నమందప్రీతి భక్షింతమే?”
మీరు ఇప్పటివరకు ఎండలో
తిరిగినారు. ఆకలిపాలయినారు. దాహము గొంతును దహించుతూవుంది. మనము తెచ్చుకొన్న చల్దులు తినుటకిదియే సరియగు స్థలము’ అన్నాడు.
అప్పుడు పై పద్యములో
చెప్పిన రీతిలో కూర్చున్నారు గోపబాలకురు.
విచ్చిన తామరపూరెక్కలవలె
తాము కూర్చుని మధ్యలో ఉన్న పీఠము అనగా కర్ణికగా కృష్ణుని మధ్యలో కూర్చుండ జేసినారు.
వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని, తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు
చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు
కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న
చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొనిన పెద్ద
పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివి
పువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.
మాటిమాటికి వ్రేలు
మడిఁచి యూరించుచు-
నూరుఁగాయలు
దినుచుండు నొక్క;
డొకని కంచములోని
దొడిసి చయ్యన మ్రింగి-
"చూడు
లే"దని నోరు చూపునొక్కఁ;
డేగు రార్గురి చల్దు
లెలమిఁ బన్నిదమాడి-
కూర్కొని కూర్కొని
కుడుచు నొక్కఁ;
డిన్నియుండఁగఁ బంచి
యిడుట నెచ్చలితన-
మనుచు బంతెనగుండు
లాడు నొకఁడు;
"కృష్ణుఁ
జూడు" మనుచుఁ గికురించి పరు మ్రోల
మేలి భక్ష్యరాశి
మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు
నొక్కఁడు;
ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు.
ఒకడు వాని యింటినుంచి
ఊరగాయలు తెచ్చినాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. కానీ వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు.
ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి తన ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని
చల్దిమూట నుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితె నోరు
చూపించి ‘నేనెక్కడ తిన్నాను?’ అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే
వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది
తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు
అంటే అందరి విస్తళ్ళ నుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు
కృష్ణుని చూపించి ‘ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా’ అనేవాడు
పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు.
ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని
రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు.
వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకు కృష్ణుని చూస్తూ తినటములో కడుపు
నిండుతుంది.
ఎంత స్వభావోక్తితో
కూడిన పద్యమో చూడండి. పామరుడనైన నేను ఈ పద్యము గొప్పదనము వర్ణింపనశక్తుడను. పరమ భక్తాగ్రేసరుడగు
అన్నమయ్యే ఈ పద్యభావమును గ్రహించి తన ‘పదము’ లో ఈ విధముగా మలచినాడు. గమనించండి.
అచ్చపురాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి
కృష్ణ
ఊరుగాయలును
నొద్దికచద్దులును
నారగింపుచును నందరిలో
సారె బాలుల సరసాల తోడ
కోరి చవులు గొంటివి
కృష్ణా
తక్కిన చరణములు ఈ పద్యముతో సంబంధము లేనందువల్ల
నేను ఉటంకించుట మానినాను.
ఇప్పటికే ఆ పరమాత్మునుని
లీలా పారవశ్యములో ఉన్న నాహే పరమాత్ముడు ఎక్కువగా వ్రాయించినాడు.
మరొకమారు మరొక
పద్యముతో......
గోపికల శ్రీకృష్ణ అన్వేషణ
10.1.1012
ఉ. నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె
నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!
నీలమేఘశ్యాముడు, కమలాక్షుడు, కరుణా వరుణుడు, సిగపై
నెమలి
పింఛమును దాల్చినవాడు, చిరునవ్వు
చెలువారే చక్కని మోము కల వాడు
మానినీమణుల మానధనం దోచి నాడు. ఓ మల్లియలారా! మీ
పొదల మాటున
దాగినదేమో కాస్త చూసి చెప్పగలరా!
గోపికల విరహవేదన ఎంత అలతి పదములతో అవ్యయమై
అనంతకాలము
నిలుచులాగున వ్రాసిన ఆమహానుభావుని చరణ యుగళికి
సాష్టాంగ
దండప్రణామమునర్పించక ఉండగలమా!
ఇక్కడ ఒకముఖ్యమైన విషయము చెప్పుకొనవలసియున్నది.
శ్రీరామ భక్తుడగు మన పోతన్న భాగవతమున శ్రీరామ చరితము చెప్పు సందర్భమున శ్రీరాముని వినుతించుతూ ఈ క్రింది పద్యమును
గ్రంధస్థము చేసినాడు.
ఉ. నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు
పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్
(భా. 9-361.)
టీక
నల్లని వాడు = నల్లగా ఉండు వాడు; పద్మ = పద్మముల వంటి; నయనంబుల
వాడు = కన్నులు గల వాడు; మహా
= గొప్ప; ఆశుగంబులున్ = బాణములు; విల్లునున్
= బాణాసనమును; తాల్చు
వాడు = ధరించెడి వాడు; కడు
= మిక్కిలి; విప్పు = విశాల మైన; వక్షము
వాడు = రొమ్ము గల వాడు; మేలున్
= శుభములు; పైన్ = మీద; జల్లెడు
వాడు = కురిపించు వాడు; నిక్కిన
= ఎగు; భుజంబుల వాడు = భుజములు కల వాడు; యశంబున్ = కీర్తిని; దిక్కులన్
= దిక్కుల కడ వరకు; జల్లెడు
వాడు = వ్యాపించిన వాడు; ఐన
= అయినట్టి; రఘుసత్తముడు = రఘువంశపు తిలకుడు; ఇచ్చుత = తీర్చుగాక; మా
= మా; కున్ = కు; అభీష్టముల్
= కోరికలు.
నల్లటివాడు, పద్మాలవంటి
కళ్ళు గలవాడు, గొప్ప
ధనుస్సు బాణాలు ధరించువాడు, విశాలమైన
వక్షస్థలం గలవాడు, మేళ్ళు
అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు
గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు
తీర్చుగాక.
ఈ పద్యము పోతన్న గారికి మనవలెనే తనకు కూడా ఎంతో
నచ్చివుంటుంది. అందుకే ఈ పద్యమును అనుకరించుతూ శ్రీకృష్ణుని మీద కూడ గోపికలు
కృష్ణుని వెతుక్కుంటు మల్లెలను అడిగినారు అని రాస్తే కాని తృప్తి చెందలేదు.
శ్రీకృష్ణ లీలలలోని ఈ పద్యము, గోపికలు, పద్మనయనములు, కృపారసము, నవ్వుతో
కూడిన మోము, సరస శృంగారము, మల్లెపూలు, ఇన్ని సుకుమారమగు విషయములు కలిగిన ఈ పద్యము
వానికన్నాకూడా ఎంతో సుకుమారముగా నడచినది. అదే ఆ మహనీయుని గొప్పదనము. ఆయన భాగవతము
మన పాప చింతనల పవియై (వజ్రాయుధము), పరమేశ్వరుని
జూపు వెలుగుల రవియై, మన
మూఢత్వమను చీకటికి ఛవి (కాంతి), పోతన
అనబడు కవియై, పరమాత్ముని
లోన నిలుపుకొన్న గవియై, మనసందేహాలగది
తాళపు చెవియై, భక్తుల
దివియై ఆంధ్ర దేశమునకు ఆరని దీపమై ఆవిర్భవించియున్నది. అట్టి భాగవతము కల్గిన
ఆంధ్రభూమిపై మనమెత్తిన జన్మను, తెనుగు
నేర్చుకొని, భాగవతముచదివి, మన
భూమి భాషల గొప్పదనమును లోకానికి చాటి ఋణమును తీర్చుకొందాము.
కృష్ణ లీలలు ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రజ్ఞ
చాలదు. అందుకే ఆ
బాలకృష్ణునికి నమస్కరించి అడుగు ముందుకు వేసి
సత్యభామా రూపిణియైన భూదేవి తన కుమారుడైన నరకునితో తలపడిన ఘట్టముతో శ్రీకృష్ణుని
వైపు మిమ్మాకర్షింప దలచినాను.
నరకాసుర వధ ఘట్టములోని పద్యముతో మళ్ళీ మీముందుకు
వస్తాను.......
నరకాసుర వధ ఘట్టము
10-2-17
సీ. సౌవర్ణ కంకణ ఝణఝణ
నినదంబు;
శింజినీరవముతోఁ జెలిమి
సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు;
గండమండలరుచిఁ గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు;
బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమశబ్దంబు
పరిపంథి;
సైనిక కలకల స్వనము నుడుప
10-2-177-1
తే.వీర శృంగార భయ రౌద్ర
విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక
యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట
యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.
పైడి కరకంకణముల ఝణఝణ
ధ్వనులు, అల్లెత్రాటి
శబ్దములో అంతర్లీనము
కాగా, కర్ణకుండల మణుల ఘనమైన
కాంతులు, చెక్కిళ్ళ
నునుపుతో చెలిమి
చేయగా, కనుకొనలు ప్రసరించు కడు
ధవళకాంతులు, ములుకుల
అంటే
బాణముల వాడిని అంటే వాని
థళథళ మెరిసే పదునును కప్పివేయగా;
శరములు ప్రయోగించుట వలన
కలిగిన ధనుష్టంకారము, శత్రుసైన్యముయోక్క
కలకల ధ్వనులను అణచివేయగా, వీరము, శృంగారము, భయము, రౌద్రము,
విస్మయము అనే భావములు
అన్నియునూ కలసి ఈ భామగా రూపొందినవా
అన్నట్లుగా సత్యభామ బాణముల
సంధించి, ఆకర్ణాంతము
లాగి, ప్రయోగించగా
గుర్తించలేనంత వేగముగా అవి
పయనించి దానవుల దారుణ మారణ
హోమమునకు కారణమైనది.
ఇంతటి యుద్ధకౌశలము ఈమె
ఎక్కడనుండి నేర్చినది అన్న అనుమానము మన
పోతన్నకే వచ్చినట్లుంది.
తన విస్మయమును ఏవిధముగా ప్రకటించుచున్నాడో
చూద్దాము.
అది మరియొకమారు.........
10.2.181
సీ. వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని
కొమ్మ;
బాణాసనం బెట్లు పట్ట నేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ;
గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె?
సరవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే;
నిపుణత సంధించె నిశితశరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి;
యస్త్రమంత్రము లెన్నఁ డభ్యసించెఁ?
10.2-181.1.
ఆ. బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే
గతి నొనర్చె సింహగర్జనములు?
ననఁగ మెఱసెఁ ద్రిజగదభిరామ గుణధామ
చారుసత్యభామ సత్యభామ.
వీణనే చక్కగా పట్టుకోలేని పడతి, విల్లు ఎక్కుపెట్టడం ఎలా నేర్చిందో? చెట్టు
ఆపుకు తీగనేరని లేమ, వింటి కొసలకు నారిని ఎట్లు సంధించిందో? సరమున
ముత్యాలు గూర్చనేరని లేమ, వాడి ములుకులను ఏరీతి ప్రయోగించిందో?
చిలుకకు పలుకులు నేర్పలేని చిన్నది, అస్త్రమంత్రములను ఎప్పుడు
అభ్యసించిందో? మాట్లడమన్నా మాటలాడని మగువ యుద్ధమందున
సింహగర్జనలు ఏరీతి చేయగలిగిందో? అని ఆశ్చర్యపోయే విధముగా ఆ
యుద్ధభూమిలో ముల్లోకములూ పొగడదగ్గ
సుగుణాల రాశి, ‘చారుసత్యభామ
సత్యభామ’ అన్న ప్రయోగమును సత్యభామకు విశేషణముగా వాడినాడు పోతన.
చూసిన వెంటనే ఇది పునరుక్తి దోషమా
అనిపిస్తుంది.
పోతన ఆపని చేయడు చారుసత్య అంటే నిజముగా
మిక్కిలి శ్రేష్ఠమైన భామ
అంటే లలన యగు ఎవరు అంటే సత్యభామ అన్నది
అన్వయము. ఆ విధముగా
సత్యభామ భాసిల్లినది.
ఈ నరకాసుర యుద్ధ ఘట్టమును నాచన సోముని
ఉత్తర హరివంశములోని
ఇదే అధ్యాయముతో పోల్చినట్లయితే మనము
ఆశ్చర్యపడక మానము.
నాచనసోమన పోతన యౌవ్వనములో ఉన్న కాలమునకు
పెద్దవాడయి
వుంటాడు. ఈయన కడప ప్రాంతమునకు
చెందినవాడు. ఆయన తన ఉత్తర
హరివంశమున వ్రాసిన పద్యములు పరిశీలించితే
తప్పక ఆ పద్యముల సొబగు,
పోతన ఆయనవద్దకు జని, అందలి సౌందర్య మాధుర్యమును గ్రోలి ఆరీతినే ఈ
నరకాసుర వధ ఘట్టమున, తన పద్యములలో అనుకరించినాడు లేక
అనుసరించినాడు అనిపిస్తుంది.
' ఇది నాచన సోమన రచన:
తంత్రీ వినోదంబు తడవు సైపని వ్రేళ్ళ
గొనయంబు తెగలపై గోరికనుట
యద్దంబు పిడి ముట్టనలయు పాణి తలంబు,
లస్తకంబిఱియించు లావు కలిమి
చెలికత్తెనొత్తిలి చీఱలేని యెలుంగు,
సింహనాదంబుచే జెదరకునికి
ప్రమద నర్తన కేళి బంతవింపని పదం,
బైదు రాణంబుల నలత బడమి
సోయగపు జిత్రరూపంబు జూచుచోట,
వేసరు విలోచనంబులు వికృత దైత్య
లక్ష్యమీక్షించుటయు మొక్కలంపు గెలుపు
గైకొనియె సత్యభామ సంగ్రామ సీమ''
తంత్రులను మీటుటకే కనలి పోయే వ్రేళ్ళు వింటి అల్లెత్రాటిని ఏవిధముగా వింటికి అనుసంధించ గలుగుతుంది. అద్దము యొక్క పిడిని పట్టుకుంటేనే కందిపోయే చేయి ధనువు మధ్య గల ధృడమైన పిడిని ఏవిధముగా పట్టుకోగలుగుతుంది. చేలికత్తెలనే గట్టిగా పిలువలేని స్వరము సింహనాదముల నేవిధముగా చేస్తుంది, స్త్రీ సహజమైన సౌకుమార్యముగల నాట్యమే చేయనోపని సుకుమార పదములు ఐదు విధములగు నైపుణ్యతలను అంటే 1.విల్లు ధరించుట 2. బాణమును సంధించుట ౩. ఆకర్ణాంతము లాగుట, 4. ప్రత్యాలీఢ పాదమ్ముతో నిలచుట(ఎడమ కాలు ముందుంచి నిలచుట) 5. శరమును వదలుట అన్న ఈ ఐదు పనులను ఒకే సమయమున అలయకుండానే ఏవిధముగా చూపగలదు. సోయగముతో కూడిన రూప లావణ్యముల గాంచ వలసిన ఆమెలో వికృతమగు రక్కసుని లక్ష్యముగాగొని ఆతని కదలికలు సునిశితముగా చూసి వేసారిన కన్నులు గలిగి అలసి కూడా అసాధ్యమైన గెలుపు గైకొనె నా సంగ్రామ సీమ లో సత్యభామ.
ఈ పద్యము సత్యభామా సౌకుమార్యమును తెలుపుతూ ఆమె యుద్ధము ఎట్లు చేయగలదు అన్న సందేహమును వ్యక్తము చేస్తున్నాడు సోమన.
అదే ఎత్తుగడ, అదే భావము, అదే నడక ఇవి చూస్తే తెలియదా! పోతన అది ఎవరిదయినా
మంచిని గ్రహించి తనదయిన రీతిలో ఆయా సన్నివేశములను అజరామరము చేసినాడు అన్న విషయము.
తరువాతి పద్యము నరకాసుర వధ వర్ణన .......
8. 10.2.199
శా. ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు
ఘోషింతు వో!
తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం
గృపం గావఁడే!
చెల్లంబో! తలఁ ద్రుంచెనంచు నిల
నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ
డుద్దీప్తాహవక్షోణిపై.
పూర్వము విష్ణువు వరాహావతారుడు అయినట్టి
కాల మందు నేను ఆయన
ఇల్లాలిని అని చెప్పేదానివి కాదమ్మా! మరి
నీ కుమారునిగా నన్నెరిగిన ఆయన
దయాదాక్షిణ్యము లేక ఈ విధముగా తల
ద్రుంచుట న్యాయమా అని
ఆక్షేపించుచున్నట్లుగా పెద్ద శబ్దముతో
భూమిపై పడగా ఆతని మొండెము కూడా
భూమిపై త్రుళ్ళిపడినది. ఆవిధముగా
నరకాసురుడసువులు బాసినాడు.
పోతన మానవత్వపు ఊహను ఒకసారి గమనించండి.
ఎంతసహజమయిన వర్ణన. అసలు నరకుని తెగటార్చు సమయమున ఆతల్లి మానసికముగా ఎంత క్షోభకు
గురియై ఉంటుందో? అయినా లోకమంతా ఆమె సంతానమే కదా! "అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు
దుష్టాంగంబు ఖండించి శే
షాంగశ్రేణికి రక్ష చేయు క్రియ” ను గూర్చి
మన పోతన్నే ప్రహ్లాద చరిత్ర ఘట్టమున హిరణ్యకశిపునిచే చెప్పించినాడు కానీ ఆ మాటను
ఇక్కడ రుజువు చేసినాడు.
నరకాసుర వధ సమాప్తం.
తరువాత రుక్మిణీ కళ్యాణ ఘట్టము.
దశమస్కంధము-రుక్మిణీ కళ్యాణ
ఘట్టము
1.
10-1-1704
సీ. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక;
దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల;
కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన;
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ;
దడవిన బంధసంతతులు వాయు
10.1-1704.1-తే.
నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ప్రభూ శ్రీకృష్ణా! కంసాది ఖల విదారీ!
శ్రీకరా! మానినీ మానస చిత్తచోరా! నీ
గుణగణములు నా చెవుల సోకితే చాలు నా
దేహతాపములన్నీ తీరిపోతాయి. నీ
శుభ కారకమగు నీ ఆకారము చూచిన చాలు నాకు
సకలార్థములూ
లభించుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు
నాకు లోకోన్నతి దక్కుతుంది. నీ
నామస్మరణ ఎడతెగకుండా భక్తితో చేసిన చాలు
నాకగు భవబంధములన్నీ
పటాపంచ లౌతాయి. అలాంటి నీవు నామనస
అనవరతమూ నిలచినావు.
సమయం లేదు. నీపై ఆన. దయతో నన్ను
చిత్తగించు.
పైన బాహిరమగు పద్యభావమును గ్రహించియుంటారు. అసలు ఆంతరికముగా
ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టమున తెలుసుకొనవలసిన విషయములు కొన్ని ఉన్నవి. వానిని గూర్చి
కాస్త తెలియజేస్తాను.
విదర్భ దేశము విదర్భ రాజ్యమునకు రాజధాని. ఈ
దేశమునకు పేరెన్నికగన్న రాజు భీష్మకుడు. ఆయన కుమార్తె రుక్మిణి అని, ఆమె
కోరిక మేరకు శ్రీకృష్ణుడు విదర్భ వచ్చి ఆమె అన్న రుక్మి ని శృంగభంగము చేసి, అతనిని
ఆశ్రయించిన బంధు మిత్రులను ఓడించి, రుక్మిణిని ద్వారకకు కొనితెచ్చి వివాహము
చేసుకొన్నది భాగవతులందరికీ తెలిసిన విషయమే! ఈ సందర్భములో ఎక్కువ మందికి తెలియని
ఒకటి రెండు విషయములు తెలుపుతాను.
1. కర్మ
యోగమును ఆశ్రయించినవారు దర్భ లేకుండా
క్రతువులను చేయలేరు. అదే జ్ఞానయోగమును ఆశ్రయించిన వారికి దర్భ అవసరము లేదు. విదర్భ
జ్ఞాన మార్గీయులచే పాలింప బడినది కాబట్టి ఆ దేశము\ప్రాంతము విదర్భ అంటే దర్భ అవసరములేని ప్రాంతమైనది.
2. రుక్మి
భీష్మకుని పెద్ద కుమారుడు. ఇతనికి నలుగురు అనుజులు ఉన్నారు.
జ్ఞాన\అజ్ఞానమునకు 5 గణుపులు ఉంటాయి అని పెద్దలు
చెబుతారు. ఈ ఐదు గణుపులలో మొదటి గణుపు
రుక్మి. ఐదు మందిలో ఇద్దరు పెద్దవాడయిన రుక్మి అనుచరులు. మిగత ఇర్వురు ఉదాసీనులు.
అంటే వాళ్ళు దేనినీ తవ్వరు పూడ్చరు. ఈ 5గణుపులకు సమన్వయార్థమును ఒకసారి
పరిశీలించుదాము. నిజానికి ఇవి
‘త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణశ్రోత్రములు’ అన్న జ్ఞానేంద్రియ పంచకములు. వ్యాస భాగవతములో ఈ
5గురి పేర్లు ఈ విధముగా ఇవ్వబడినాయి.
రుక్మము అంటే బంగారము. అది జ్ఞానమునకు
ప్రతీక. విదర్భను గూర్చి మొదలే
జ్ఞానాపేక్ష కల్గిన దేశముగా చెప్పుకొన్నాము కదా! అందుకే ఆ దేశ ప్రభువగు భీష్మకుడు తన 5 మంది కుమారులకు మరియు 6వ సంతానమైన కుమార్తెకు
జ్ఞానాన్వయమైన రుక్మము అనగా బంగారము అన్న పేరు వచ్చేలాగున ఈ విధముగా పేర్లు పెట్టినాడు. ఆ పేర్లు వరుసగా 1.
రుక్మి 2. రుక్మకేశుడు 3. రుక్మబాహు 4. రుక్మరతుడు 5. రుక్మమాలిని చివరిగా కుమార్తె పేరు
‘రుక్మిణి’. ఈ పేర్లు చెప్పకనే ఒక వాస్తవాన్ని చెబుతూ ఉన్నాయి. భీష్మకుని మొదటి
కుమారుడు రుక్మి. అంటే సువర్ణము . దాని ఆ
రుక్మికి శోభను కూర్చేవాడు రుక్మ కేశుడు. మనిషికి జుట్టు అందము. ఇక బలము
కూర్చేవాడు రుక్మ బాహు. అంటే రుక్మికి ఆకర్షణ బలము ఈ ఇరువురు తమ్ములు. మిగిలిన
ఇరువురిలో ఒకరు రుక్మ రతుడు. అంటే
‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్న వేద వాక్యమును నమ్మి ఆరాధించేవాడు. కావున ఐహికము, దైహికము
అయిన ప్రలోభమయమగు కర్మలకు యీతడు అతీతుడు. బ్రహ్మజ్ఞాన రతుడు కాబట్టి ఆయన ఏదీ
పట్టించుకోడు.ఇక మిగిలిపోయిన చివరి తమ్ముడు రుక్మ మాలిని. ఏ జ్ఞానమయితే రుక్మమో
దానికి కాపుదారుడు ఈయన. తోటకు మాలి ఉన్నట్లు ఈయన ‘తత్వమసి’ అన్న
వేదవాక్కును(ఛాందోగ్యోపనిషత్తు) నమ్మి ఆ రుక్మమే తానై కాపాడేవాడు. కావున ఈ ఇరువురు
రాగ ద్వేషాలకు అతీతులు.
జ్ఞానేంద్రియ పంచకములయిన ‘త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణశ్రోత్రము’ లను గూర్చి
ఒకమాట చెప్పుకొందాము. చర్మము కన్నులు నాలుక ముక్కు చెవులు బాహ్యానుభవమును గూర్చు
ఇంద్రియములు. ఇవి ఇటు మంచిని అటు చెడును కూడా తమ అనుభవములోనికి తీసుకోగలుగుతాయి.
కానీ ఇవి ఏ మనసుకైతే చేర్చుతున్నాయో ఆమనసు సత్కర్మ పక్షపాతియైతే సత్వము సత్కర్మలను
ఆశ్రయించుతుంది. దుష్కర్మ పక్షపాతియైతే ఆదారి లోనే పోతుంది. ఈ ద్వంద్వముల వాళ్ళ
మనసు ఎప్పుడూ ఘర్షణకు లోనవుతూ వుంటుంది. అందుకే మనోనిశ్చలత మనిషికి ఎంతో అవసరము
అన్ని ఎన్నోవిధములుగా పెద్దలు చెప్పినారు. అందుకే రుక్మి అతని మొదటి ఇరువురు
సోదరులూ, అతని
స్నేహితులూ పరమాత్ముడగు శ్రీకృష్ణునిచే శృంగభంగమునకు గురియైనారు.
ఈ విధముగా మన పురాణేతిహాసములన్నీ ‘తమసోమా
జ్యోతిర్గమయ’ అన్న వేదవాక్కునకు దృష్టాంతరములు. ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహత
ఏర్పడుతుందో అప్పుడు పరమాత్మ మిగిలిన అంటే కర్మఫలము వల్ల ఏర్పడిన దోషములను సవరించి
ఆత్మను తనలో ఐక్యము చేసుకొంటాడు.
జీవాత్మలో తపన పెరిగేకొద్దీ మనసు వేరు ఏ విషయము మీద
కూడా మగ్నము కాదు. ఈ సందర్భములో పింగళి నాగేంద్ర రావు గారు వ్రాసిన యుగళగీతమును
రుక్మిణి అనగా జీవాత్మ పరముగా కలిగే తపనను మీ ముందుంచుచున్నాను.
విరహము
కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా
వియోగ
వెళల విరిసే ప్రేమల విలువను కనలేవా
నీ
రూపమె నే ధ్యానించునది నా హౄదయములో నా మనసులో
నీ
రూపమె నే ధ్యానించునది
మెలకువనైనా
కలలోనైనా కొలుతును నిన్నె ప్రాణ నాథునిగ
లోకములన్ని
ఏకమె అయినా నాజత వీడవుగా
నీ
రూపమె నే ధ్యానించునది ఈ విరహాములో ఈ నిరాశలో
నీ
కోసమె నే జీవించునది
పై పాటలో లోతుగా ఆలోచించితే ఎంతయో వేదాంతమున్నది. జీవాత్మ
తపన ఉన్నది. రుక్మిణి తన వలపు రాయభారిగా పంపినది ‘అగ్నిద్యోతనుని’. ద్యుతి అంటే
వెలుగు. అంటే ఆ పురోహితుడు వేరేవవరో కాదు తన ప్రాణమే! వెచ్చదనముండేవరకే కదా ప్రాణముండేది.
అంటే భగవంతునికి తన ప్రాణమునే సమర్పించి జీవాత్మ పరమాత్మ లో చేరుటకు తపించుతూ
వుంది. వీనిని ఆకళింపు చేసుకొని పాటించితే జీవాత్మ పరమాత్మ సాయుజ్యమును
చేరుకొంటుంది. ఇదియే శ్రీకృష్ణ పరమాత్మను జీవాత్మయగు రుక్మిణీదేవి కల్యాణమాడుట.
ఇంకొక రెండు విషయములను తెలియజేస్తాను.
1. రుక్మము అంటే బంగారు అని చెప్పుకొన్నాము. శ్రీ సూక్తములో లక్ష్మీ దేవిని 'చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం' అన్నది అమ్మవారికి చేసే సంబోధన. మరి హిరణ్యము అన్నా బంగారు! రుక్మము అన్నా బంగారే!తల్లి ఏ రూపములో అవతరించినా పేరులో మార్పు లేదు.
2. రుక్మిణీ దేవి శ్రీ మహాలక్ష్మియై ఉంది కూడా గౌరీ పూజకు పోయింది. అక్కడ ఆ తల్లిని ఏమని ప్రశంశించింది: 'అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ' అని. లక్ష్మిదేవిది ఆర్ధిక శక్తి మాత్రమే! కాబట్టి సర్వశక్తివతురాలగు ఆది పరాశక్తిని పూజించింది. దేవతలలో అహంకారము అనేది ఉండదు ఉన్నా అది ఎదో విధముగా అణగి పోతుంది. ఆతల్లి పేరే మంగళ గౌరి. మరి మాంగళ్యమునకు ఆమ్వే అధిదేవత కదా! ఈ లక్ష్మీ దేవి చేసిన మంగళ గౌరీ పూజయే మనకు ఆదర్శము. ఈ మాట విశ్నుస్వరూపుడగు వ్యాసులవారు వ్రాసినది. మరి వష్ణవులు మంగళగౌరీ పూజ పాతిన్చుతారో లేదో నాకు తెలియదు. 'పరబ్రహ్మ పదార్థ మొకటే' అన్న అద్వైత మార్గమును అర్థము చేసుకొంటే అసమానతలు అంతరించిపోతాయి.
అందుకే పోతన ముందే చెప్పినాడు ‘భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!’ అని. మేరునగ సాదృశులగు పండిత పౌరాణిక శ్రేష్ఠుల ముందు నేనొక పిపీలికమును. ఇంతకు మించి ఏమి చెప్పగలను.
మరొక మారు రుక్మిణీ కల్యాణములోని మరొక పద్యముతో........
2. 10.1.1706
ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ!
సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు
నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద
నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన
భవత్ప్రతాపమున్
ఓ శుభకరా, శుభాకారా! పురుషసింహమా! సింహమునకు చెందవలసిన సొమ్మును నక్క కోరినట్లు, మదొన్మత్తుడగు శశిపాలుడు నీ పదదాసియగు నన్ను, రుక్మిణిని, తీసుకు
పోదలచుచున్నాడు. అద్భుతమైన నీ ప్రతాపమును ఆ అధమాధముడు తెలియలేకున్నాడు.
మరొకమారు మరో పద్యముతో ........
2. 10.1.1706
ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ!
సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు
నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద
నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన
భవత్ప్రతాపమున్
ఓ శుభకరా, శుభాకారా! పురుషసింహమా! సింహమునకు చెందవలసిన
సొమ్మును నక్క కోరినట్లు, మదొన్మత్తుడగు శశిపాలుడు నీ పదదాసియగు నన్ను,
రుక్మిణిని, తీసుకుపోదలచుచున్నాడు. అద్భుతమైన నీ ప్రతాపమును ఆ
అధమాధముడు తెలియలేకున్నాడు.
మరొకమారు మరో పద్యముతో ........
వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్
దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ
గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా
చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ
ముఖ్యాధముల్.
నేను గత జన్మలలో భగవంతుడు
లోకకల్యాణకారకుడగు నారాయణుని కోరి
వ్రతములు దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ మరియు దాన ధర్మములు
మొదలైనవి చేసి ఉన్నట్లయితే; వసుదేవనందనుడగు కృష్ణుడు నాకు భర్త
యగునుగాక! యుద్ధములో శశిపాలాది అధమాధములు
ఓడిపోవుదురు గాక!
మరొకమారు మరో పద్యముతో ........
4. 10.1.1708
ఉ. అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి
నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్
భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ!
చేకొనిపొమ్ము వచ్చెదన్.
శ్రీ కృష్ణా! పురుషోత్తమా! నేను
అబద్ధామాడుటలేదు. చతురంగ బలములతో
నీవు వచ్చి, శిశుపాల జరాసంధాదులను జయించి, నా దగ్గరకు వచ్చి, రుక్మిణి
యగు నన్ను రాక్షస వివాహమున గ్రహించి చేకొనుమయ్యా, సంతోషంగా
నీతో వస్తాను.
మరొకమారు మరొక పద్యముతో........
10.1.1711 - తేదీ 30.052021
సీ. ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని;
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
10.1.1711.1.
ఆ. నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు.
ప్రాణేశ్వరా! నీ మధుర మనోఙ్ఞభాషణములు
వినలేని చెవులు అనబడు ఈ
వినికిడి సాధనముల సంపత్తి నాకెందుకు? నీవు భోగమునకు కొరగాని ఈ
మేని అందమదెందుకు? భువన మోహనా! నిన్ను చూడలేని కళ్ళకు
చూపెందుకు? ప్రియా! నీ అధరామృతమందని నాలుకకు రుచెందుకు?
కమాలాక్షా! నీగళమునలంకరించిన వనమాలికా
యొక్క వాసన చూడలేని
ముక్కు ఎందుకు? మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని
జన్మ ఎందుకు?
రుక్మిణీదేవి ఎంత జాణతనమును
ప్రదర్శించుచున్నదో చూడండి. ఎందుకు
ఎందుకు అంటూనే తనకేమి కావలెనో ఎంతో
విపులముగా, విశధముగా,
వివరముగా చెబుతూవుంది. అందుకే
ప్ర్ద్దలంటారు మాట్లాడుట ఒక కళ, అది
అందరికీ సాధ్యము కాదని.
ఈ పద్యమున పోతన పద ప్రయోగము, రచనా వైచిత్రి, రుక్మిణీదేవి మెతకదనములోని
గడుసుదనము గమనించవలసిన విషయములు.
మరొకమారు మరొక పద్యముతో............
7. 10.1.1738
మ. జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా
సందేశముం జెప్పి; నన్
నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్
గలరే; దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం
జలిఁ గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!
అయిన వారికి శ్రేయమును చేకూర్చే బ్రాహ్మణ
శ్రేష్ఠుడా!
నా సందేశమునందించి తోయజాక్షుని
తోడితెచ్చినావు. అట్లుచేసి నా
ప్రాణములు నిలబెట్టినావు. నీ దయ వలన
బ్రతికినాను. దీనికి తగిన మేలుగా
నేను వేరేమీ చేయలేను ఒక్క నమస్కారము
చేయుట తప్ప, అని అంటూ
ఆయనకు త్రికరణ శుద్ధితో నమస్కరించినది
రుక్మిణీదేవి.
ఆ వ్యక్తి ఆడ కానీ మగ కానీ, తనకు అత్యంత
అవసరమగు సహాయముచేసి రక్షించినపుడు మనఃపూర్వకముగా త్రికరణ శుద్ధితో కృతజ్ఞత ఎవరయినా
ఎట్లు చెప్పవవలెనో తెల్యజేసేది ఈ పద్యము. సగము తెలుగు సగము ఆంగ్లము కలిపి ‘చాలా
Thanks’ అనుతకాడు. కృతజ్ఞత అన్నది హృదయ కుహరము నుండి రావలసినది. గమనించితే ‘Thanks’
అనే మాట నాలుకనుండియే వస్తుంది. కృతజ్ఞత గుండెనుండి వస్తుంది. అదీ తేడా!
మరొక మారు మరొక పద్యముతో.........
8. 10.1.1744
ఉ. నమ్మితి నా మనంబున సనాతను లైన
యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ!
మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ
జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు
గదమ్మ! యీశ్వరీ!
అమ్మా ఈశ్వరీ! ఆదిదంపతులగు
ఉమామహేశ్వరులగు మిమ్ము మనస్ఫూర్తిగా
నమ్మి భక్తిగా పూజించుచున్నాను. నీవు
ఎంతో దయామయివి. నిన్ను
నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు. నాకు
ఈ హరిని భర్తగా చేయి మాతా!”
అంటు గౌరీపూజ పూర్తి చేసుకొన్న
రుక్మిణీదేవి పరమేశ్వరిని ప్రార్తించుతూవుంది.
మనము ఇక్కడ తెలుసుకొనవలసిన విషయము
ఏమిటంటే
రుక్మిణికి కృష్ణు ని రాక తెలుసును కాని
ఇంకా ఆయన వైరి యూధమ్ము సొచ్చి,
తనవద్దకు వచ్చి, తనను మెచ్చి, తీసుకొని పోవలెను కదా!
కామితము సపూర్ణముగా సఫలమగువరకూ మానవునికి
అనుమానమే కదా!
ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టమును సునిశితముగా
పరిశీలించితే పోతన తననే
రుక్మిణిగా ఊహించి
వ్రాసినట్లనిపిస్తుంది.
ఇక్కడ ఒక విషయమును చెప్పదలచుకొన్నాను.
రుక్మిణీ దేవి సాక్షాత్తు లక్ష్మీ దేవి అవతారము. అయినా కూడా ఆమె మానవుల వివాహ సాంప్రదాయము
చేత ఆకర్షింపబడినది. బహుశ తనకు ఇష్టమన్నదే లేకుండా ఎంతో బలవంతముచే సీతావతారములో
రావణుడు తనను ఎత్తుకు పోయినది ఆ తల్లికి గుర్తున్నదో ఏమో, అదేపనిని తన ప్రాణ
నాథుడు చేసి తనను పెళ్ళియాడితే తాను ఆనందించవలెనన్న ఊహ జనించియుండవచ్చును. బహుశ ఈ
తతంగమంతా అందుకేనేమో!
అది అట్లుంచితే తానూ మహా లక్ష్మి యొక్క ప్రతిమూర్తి
యని తెలిసీ గౌరీపూజకు గడంగినది. అంటే నేటి రాజకీయ పరిభాషలో చెప్పవలసి వస్తే, ఎవరి
Portfoliyo వారిది. ఇక్కడ చిన్న పెద్ద అన్నది లేదు. వివాహ బంధము గట్టిగా ఉండజూచు
బాధ్యత గౌరీదేవిది. కావున లక్ష్మీదేవియైనా దానిని పాటించవలసినదే! భాగవతము విష్ణు
పారమ్యతను గూర్చి తెలుపునది అయినా అంతర్లీనముగా అది శివ కేశవాభేధమగు అద్వైతమునే
చాటుచున్నది. దానిని అర్థము చేసుకోలేరు కొందరు గుడ్డివారు. వారి వనరులు
పరిమితమయినపుడు వాస్తవమరయజాలరు కదా!
మరొకమారు మరొక పద్యముతో.........
9. 10.1.1766
సీ. మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ?
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి? ;
వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు;
మాయఁ గైకొని కాని మలయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు;
వసుధీశుఁడవు గావు వావి లేదు;
10.1.1766.1
ఆ. కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు.
నువ్వు మాతో సమానుడవా? (భగవంతుడు కదా మాకన్న అధికుడవు అన్నది
అంతరార్థము.). నీవు ఏపాటి వాడవు మాకు? (నీవు మా మేరకు అందని
వాడవు). వంశ మేదైనా ఉందా? (స్వయంభువుడవు). ఎక్కడ పుట్టినావు?
(పుట్టు కన్నదే లేని
వానివి). ఎక్కడ పెరిగినావు? (నీవు వృద్ధిక్షయములు
లేనివాడవు). నీ ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి
తెలుసు? (అంతుబట్టని నడవడిక
కలవాడవు). అభిమానము ఉన్నదా నీకు? (స్వపర తారతమ్యము,
మానాభిమానములు లేని వాడవు). హద్దు పద్దు
నీకు ఉన్నదా? (కొలతలకు
అందని హద్దులు కలిగిన వాడవు). మాయ
చేయకుండ మెలగ గలవా?
(మాయ ను సృష్టించేదే
నీవు). స్వస్వరూపాన్ని పగవారికి ఎన్నాడయినా
చూపినావా? (నిర్గుణ నిరాకారుడవు). క్షత్రియుడవు కావు
(అన్నిటికీ
అతీతుడయినా వానికి వర్ణ
ధర్మములుండవుగదా!) నీకు వావివరసలేవీ?
(అద్వితీయుడవు. ఉండేదే
ఒకడైతే వావీవరుసలేక్కడినుండి వస్తాయి.). అసలు
నీకు గుణాలేవీ? (త్రిగుణాతీతుడవు). అటువంటి నీకు అమ్మాయి
కావాలా? మా
పిల్లను మాకు ఇచ్చివెయ్యి. విడువకపోతే
యుద్దంలో ప్రళయకాల అగ్ని కీలల
వంటి వాడి బాణాలతో నీ అహంకారమును
అణచివేస్తాను.
ఇక్కడ అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే ఆ
నిరంజన నిరాకారుని
హృదయసీమలోనే వుంది శ్రీమహాలక్ష్మి. ఇపుడు
జరిపించేది అంతా మాయయే
అని తెలిసిరాలేదు బీరాలు పలుకుచున్న
రుక్మిణికి అన్నయగు రుక్మికి.
తరువాతి పద్యము రుక్మిణిని
శ్రీకృష్ణుడు వివాహమాడుట. అంతటితో నాకు నచ్చిన కొన్ని పద్యములు నాకు తోచిన వాని
భావార్థములు మీ ముందుంచ, మీ దృష్టిని ఆకర్షింపజేసినందుకు ఆ శ్రీకృష్ణపరమాత్మునికి
సాష్టాంగ నమస్కారములు, శ్రద్ధతో చదివినందుకు మీకు ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను.
10. 10-1-1784
మ. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ
చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల
సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య
సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్
రుక్మిణిన్.
శత్రువుల గర్వమదచిన యదుకుల భూషణుడు తన
మనస్సును హరించిన
రుక్మిణీ దేవిని వివాహము చేసుకొన్నాడు.
ఏవిధముగా చేసుకొన్నాడు అంటే
చిత్తౌన్నత్యము, మహావైభవము, ఎంతో నిబ్బరము కలిగి మెలగేదేవియు, సకల
సంపదలు కలిగించు కలుముల రాణియు,. సాధు బంధుజన సత్కారములను
చక్కగ చేయునదియు, పుణ్యకార్యాసక్తీ అపరిమితముగా కలిగినదియు, దారిద్ర్య
ధ్వంసినియు,వస్త్ర భూషణాలంకృతయు నగు సకల
సద్గుణసంపన్నయగు నారీ
శిరోమణి మరియు తన మనోహారిణి యగు
రుక్మణిని ఆ శుభ సమయంలో
శ్రీకృష్ణుడు వివాహమాడి శాశ్వత యశస్సును
పొందినాడు.
స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం న్యాయేన మార్గేన
మహీం,మహీశాం
l
గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్తా
సుఖినోభవంతు ll
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు నిరామయాః
సర్వే భద్నాని పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ
భాగ్భవేత్
స్వస్తి.
Thoroughly enjoyed reading this. Many thanks Shri Ramamohanrao garu. 🙏🙏🙏
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteనా మనఃపూర్వక ధన్యవాదములను స్వీకరించగలరు.
Deleteచాలా చక్కగా ఉదాహరణ తో, వివరణల తో, అంతరార్థం తెలియజేస్తూ వ్రాసారు. చాలా బాగుందండీ..
ReplyDeleteచాలా చక్కగా ఉదాహరణ తో, వివరణల తో, అంతరార్థం తెలియజేస్తూ వ్రాసారు. చాలా బాగుందండీ..
ReplyDelete