ఎన్నో సినిమాలలో ఎన్నెన్నో సభలలో ఎన్నెన్నెన్నో సందర్భాలలో బ్రాహ్మణులను ఏదో ఒక
కారణంగా నిందించడము మననము రోజూ చూస్తూ ఉండేదే. వారిపై విసిరినన్ని అసభ్య
అసహ్య అశ్లీలకరమైన విసుర్లు వేరేవ్వరిమీదా విసిరి ఉండరేమో. ఎక్కడికీ
భరించలేకపోతే తప్ప వారివైపునుండి ఎటువంటి వ్యతిరిక్తత బయట పడదు. ఇది వారి
పూర్వీకులు చేసిన నియమ నిష్ఠాగరిష్ఠత యొక్క ప్రతిఫలము. అంటే బ్రాహ్మణులకు
జన్మతః వచ్చే 'సత్వ గుణ సపన్నత.' జగద్గురు శంకరాచార్య, చాణక్య, ఆర్యభట,
వరాహమిహిర, భాస్కర, నిన్నమొన్నటి శ్రీనివాస రామానుజన్, విశ్వేశ్వరయ్య, ఈ
విధముగా చెప్పుకొంటూ పోతే ఆ పట్టిక చేంతాడంత. వీరిలో స్వార్థము,
ఆశాపాశములను చూడగలమా! వారేరోజూ తమకొరకై తమ విజ్ఞానమును
వాడుకోలేదు. లోక క్షేమమే వారి ధ్యేయము.
మనము దైవ స్వరూపులుగా భావించే రామ, కృష్ణ, ఈశ్వర ఇంద్రాది దేవతలు ఎవరూ
బ్రాహ్మణులూ కారు. విశ్వామిత్రుడు, జనకుడు, మతంగుడు,శబరి,
చండాలుడైన ధర్మ వ్యాధుడు ఈ విధంగా ఎందరో క్షత్రియులు శూద్రులు సత్వగుణ
సంపన్నులై బ్రహ్మత్వమును సాధించి బ్రాహ్మణులైనవారు ఉన్నారు. ఈ కలియుగములో
కూడా చెంచు జాతికి చెందిన భక్త కన్నప్ప, పంచముడగు భక్త నందనుడు,కుమ్మరియగు
భక్త కుంభారుడు, పంచముడగు
తిరుమళిశై యాళ్వార్
శూద్రుడగు తిరుమంగై ఆళ్వార్ (చోళరాజు వద్ద సేనాధిపతిగా ఉండినాడు) మొదలైన
వారంతా పుట్టుకతో బ్రాహ్మణులు కాదు. కానీ అందరూ దైవ సాయుజ్యమును పొందిన
వారే! అంతెందుకు కుమ్మరి మొల్ల అవివాహితగా తన జీవితాని మల్లికార్జున
సాన్నిధ్యములో గడిపింది. సత్వగుణ సంపన్నతే సద్బ్రాహ్మణ తత్వము. ఈ విధమైన
సత్వసాధకులను, సత్య శోధకులను ఎందరినో మనము చరిత్ర పుటలలో గాంచవచ్చును.
పుట్టుకతో బ్రాహ్మణుడైనవాడు, దేవాలయములలోని వీరి విగ్రహములకు
నమస్కరించకుండా వున్నారా! ప్రవచనకారులగు బ్రాహ్మణులు తమ ఉపన్యాసములలో
వీరి గొప్పను చెప్పకుండా ఉన్నారా! తిన్నడు అనగా భక్త కన్నప్ప యొక్క అచంచల మూఢ
భక్తిని గూర్చి కాళహస్తి మహాత్మ్యము వ్రాసిన ధూర్జటి బ్రాహ్మణుడు. ఆయన తన
‘కాళహస్తీశ్వర శతకమున కూడా ఈశ్వరుని సంబోధించుతూ
ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర
మూహించె ,
బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ
కాళహస్తీశ్వరా !
ఓ శ్రీకాళహస్తీశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ
పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ
వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ
శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది .
బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ ! అని తన ఆత్మను నివేదించుకొన్నాడు.
ఒక నిజమైన బ్రాహ్మణుడు అనుదినము తన సంధ్యావందన దేవతార్చనలు
ముగించునపుడు 'సర్వెజనాః సుఖినోభవంతు' సర్వం సమస్త సన్మంగళాని సంతు' అని
చెప్పుట తన విధి బాధ్యత కర్తవ్యము. అంటే బ్రాహ్మలు ఈ దైవకార్యాలు ఎంతగా చేస్తే ఈ
లోకము అంత
సుఖమయమై ఉంటుంది. ఇక్కడ మరోకమాట చెబుతాను.
మనము నివసించే ఈ భూమియే కాక సమస్త లోకములు సుఖముగా ఉండవలెనని ఆ
పరమాత్ముని ప్రార్థించే ‘స్వస్తి వాచన’ మంత్రములలో ‘గో బ్రాహ్మణేభ్యః శ్హుభామస్తూ
నిత్యం, లోకాస్సమస్తాః సుఖినోభంతు’ అన్నమాట వస్తుంది. దీనికి కొందరు బ్రాహ్మణులు
మాత్రమే, సకల శుభములతో కూడిన సుఖమయజీవనము గడుపవలెనని దేవుని
కోరుచున్నారని వక్రభాష్యము చెబుతారు. దాని పాఠము ఈ దిగువన సవిస్తారముగా
ఉంచుచున్నాను.
స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!
విశ్వ శ్రేయస్సును కాంక్షించే శాంతి మంత్రమిది. ‘స్వస్తిః’ అంటే క్షేమం, శుభం. మనిషి
జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే.. క్షేమం (భౌతిక జీవితం), శుభం (ఆధ్యాత్మిక
జీవితం) రెండు పట్టాలు. రెంటి మధ్య సమదూరంతో పాటుగా సమన్వయం సాధిస్తేనే
రైలు గమ్యాన్ని చేరుతుంది. అలా రెంటినీ సమన్వయం చేసుకుంటూ గమ్యం చేరడమే
జీవిత పరమార్థం. ఈ రెంటిలో దేన్ని విస్మరించినా ప్రయాణం అర్ధాంతరంగా
ముగుస్తుంది. కాబట్టి ఈ రెండూ (క్షేమం, శుభం).. ‘ప్రజాభ్యః’ అంటే ప్రజలకు లభించును
గాక. ‘పరిపాలయంతాం’.. అంటే విశ్వ విశ్వాంతరాల్లో ఉన్న జీవులందరికీ క్షేమాన్ని,
శుభాన్ని అందించి భగవంతుడు పరిపాలించుగాక అని అర్థం.
‘న్యాయేన’ అనగా స్వధర్మమును తప్పకుండా ఉండడం న్యాయం. ఏ విధమైన బయటి
ప్రలోభాలకూ, భయాలకూ లోనుగాకుండా అంతరంగ ప్రబోధాన్ని అనుసరించి
నడుచుకోవడం స్వధర్మం అవుతుంది. దాన్ని అనుసరించడం న్యాయం. ‘మార్గం’ అంటే
త్రోవ, అన్వేషణ. మన జీవితానికి ఏది భద్రతనిస్తుందో దాన్ని నిరంతరం అన్వేషించడం
మార్గం. ‘భద్రత’ అనేది.. ఆరోగ్యం, సంపద, గౌరవం ఈ మూడింటి సమష్టి తత్త్వం.
ఇతరుల సర్వాంగీన వికాసంలో మన ఆనందాన్ని, వికాసాన్ని చూపేదే భద్రత. ఇది
ఇతరుల అస్తిత్వాన్ని, వారి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తుంది.
ఇప్పుడు ‘గోబ్రాహ్మణేభ్యః’ అన్న
విషయమునకు వివరణ ఇస్తాను.
మనకు గోవు తల్లితో సమానమన్నది వేదవాక్యము. అట్టి గోవులు శుభమునుగల్గి
సుఖముగా వుంటే యజ్ఞ యాగాది క్రతువులు నిరాఘాటముగా జరుగుతాయి.
పంచగవ్యము లేకుండా క్రతువులు జరుగవు కదా! శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత 3వ
అధ్యాయములో ఈవిధముగా చెబుతాడు.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ
ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 3 -10 ।।
సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి
ఇలా చెప్పినాడు, "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త
కోరికలను తీరుస్తాయి." ఈ యజ్ఞములు చేయించుటకు బ్రాహ్మణులు కూడా అవసరమే
కదా! వారు సమకట్టి యజ్ఞ యాగాదుల చేయించితే హవిస్సులు అగ్నిద్వారా దేవతలకు
అందుతాయి. ఆ హవిస్సులే దేవతలకు ఆహారము. వారు తృప్తి చెందితే
పంచభూతములు సహకరించి ఈ భూమిని సుభిక్షముగా ఉంచుతాయి. అందుచే వేదమున ఆమాట చెప్పబడినది. ఈధర్మము అన్నిలోకాలు సుఖముగా ఉండవలెనని కోరుకొంటుంది. నిన్న మొన్న పుట్టిన మతములవలె సంకుచితత్వము కలిగినది కాదు.
మారుతున్న కాలములో బ్రాహ్మణుల ప్రవర్తన బాగా పరివర్తన చెందినది,చెందుతూ
ఉన్నది, పూర్తిగా చెందిపోతుందేమో. ఏది ఏమైనా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకచోట
ఈలోకము సుఖముగా వుండాలని కోరేవారు తప్పకవుంటారు వారి ప్రార్థనల ప్రభావము
ఈ జగతి పై తప్పక వుంటుంది. కాలానుగుణమైన మార్పు ఈ బ్రాహ్మణులలో ఎంత
వచ్చింది అన్నదే ఈ నాడు-నేడు లో నేను తెలియబరచదలచుకొన్నది. బ్రాహ్మణులలో
కలిగిన మార్పును గూర్చి తప్పించితే ఎవరినీ కించపరచుట నా ఉద్దేశ్యము కాదు. ఈ
మార్పులను నాదు-నేడుగా విభజించి పద్యరూపములో
ఉంచినాను.
నాడు:
స్త్నానము సంధ్యయున్ మరియు శాస్త్ర పురాణ సముచ్చయంబులున్
మానక శిష్యకోటికిని మానసమొప్పగ విద్య
నేర్పుచున్
దానము ధర్మమున్ గలిగి తత్పరతన్
పరమాత్ము నెంచుచున్
పూనికతోడ లోకహిత పూర్ణుడు గాంచగ నాడు బ్రాహ్మడున్
నమకమ్మున్ చమకమ్ముతోడుత మహన్యాసంబుతో
ధ్యాసతోన్
విమలంబైన స్వరంబుతో నమితమౌ
విస్వాసమున్ భక్తితోన్
అమలానంద మనంబుతో నభిరతిన్ ఆజన్మమున్
గొల్చుచున్
భ్రమ పాపాంకిత పంకముల్ గడుపగా
ప్రార్థింత్రు సద్వైదికుల్
నేడు:
'ఆరు' కక్ష్యను దాటి ఆపైకి చేరంగ
సంధ్య వార్చుట మాను చతురుడయ్యె
ఎనిమిదోతరగతి ఏకంగ దాటేసి
సినిమా షికార్లలో సేద తీరె
పదినుండి పండ్రెండు పడికట్ల నడుమన
మీసాలు వేసాలు మితిని మీరె
గ్రాడ్యుయేషనులోన కాలెట్టినంతనే
అంగనా సంగతి నాత్మ బూనె
తల్లిదండ్రుల ధర్మ తత్పరతలెల్ల
చూచి యవహేళనము సేయు చూపు ముదిరె
బ్రాంది బీరుల బార్ల బార్ల నిలిచి
తీర్థ సేవనమందితా తీరె సేద
తెల్లవారినతోడ తేనీరు సేవించి
జాగింగు చేసేసి జంట తోడ
బ్రష్షింగు బేతింగు బహుశీఘ్రముగ చేసి
కనగ నూడిల్సుతో కడుపు నింపి
కం కమ్ము కమ్మంచు కన్నబిడ్డలనంత
స్కూలుకు కారులో చొరగజేసి
అమ్మగారొకచోట అయ్యగారొకచోట
కార్యాలయంముల గడిపి గడిపి
పగటి యాకలి కేంటీను పాలు జేసి
రాత్రి కన్నమ్ము స్టవ్ లోనె రగుల
బెట్టి
వీధి వంటలకొట్టుకు విధిగ బోయి
కూరలను తెచ్చి కడుపున కూరుతారు
పిల్లల ప్రేమబోయె కన పెద్దలు చేరిరి
వృద్ధ వాటికల్
ఇల్లను పేరు నిల్చెనది ఇమ్ముకు మారుగ
నిచ్చి బాధలన్
ఉల్లము చిల్లులయ్యె గన ఊహలు మొత్తము
జారిపోవగన్
చెల్లని కాసుగా మిగిలె జీవిత యంత్రము
త్రుప్పు పట్టగన్
ధనము వెనువెంట పరుగెత్తి దాసులగుచు
బరగ ధర్మమ్ము మనమెడ బాసినాము
వెనుకకొసారి చూసిన వివరములను
బడయ గలమయ్య ఈనాటి బ్రాహ్మణులము
ధనము వెనువెంట పరుగెత్తి దాసులగుచు
బరగ ధర్మమ్ము మనమెడ బాసినాము
వెనుకకొసారి చూసిన వివరములను
బడయ గలమయ్య మన తెల్గు బ్రాహ్మణులము
కళ్యాణమునకన్న కల్గియుండొకరేటు
విధిగ శ్రాద్ధానికి వేరు రేటు
బారసాలకు గల్గు భారమౌనొక రేటు
అక్షరాభ్యాసాని కమిత రేటు
సత్యనాథ వ్రతము తలపగ నొక రేటు
ఉపనైన విధికి వేరొక్కరేటు
కొత్త ఇంటిని జేర కొత్తదౌ నొక రేటు
శాంతి హోమాలకు చాల రేటు
అంత, పెట్రోలుకివ్వాలి పెచ్చురేటు
రేటు నొప్పిననే అయ్య గేటు దాటు
మార్చె బాపడు కాంక్షతో మంచి రూటు
మారదలచుట నిజముగా మంచి థాటు
ధర్మ ఏవ హతోహంతి ధర్మోరక్షతి రక్షితః l
తస్మాధ్ధర్మోనహంతవ్యో మానో ధర్మో హతో
వధిత్ ll
స్వస్తిః ప్రజాభ్యాం పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం l
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినోభవంతుll
స్వస్తి.
ఈ తరం పిల్లలు మన సంస్కృతిని పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో మరల పునర్వైభవం వస్తుందని ఆశిద్దాం.
ReplyDeleteధన్యవాదాలు గురువుగారు
ReplyDelete