Tuesday, 13 March 2018

జీవిత పరమార్ధము

జీవిత పరమార్థము
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post.html
జీవిత పరమార్థమును గూర్చి తెల్పే శ్లోక రత్నములను, కొన్ని మా అమ్మమ్మ గారి వల్లను మిగతా అన్నీ మా పిన్నమ్మ( నాభార్యకు మేనమామ భార్య శ్రీమతి రాజ్యలక్షుమ్మ) గారి ద్వారానూ తెలుసుకొన్నవి తెలియజేసుకొంటున్నాను. వారు దంపతులు ఇరువురూ మద్రాసులో తెలుగుపండితులుగా పనిచేసి విశ్రాంతి పొందినవారు. నేడు భువిపై ముగ్గురూ లేకపోయినా ఈ రచన వారి పేరున సమర్పించుకొంటున్నాను.
జీవిత పరమార్ధము
మన జనని సంస్కృతము. ఆ తల్లి ఆయువు ఎంతకాలము అన్నది మన ఎరుకకు అందనిది. అసలు ఈ భూమిపై మానవ జన్మకు వేదిక భారతదేశమను పేరుతో వెలసిన ఈ పుణ్యభూమి. అప్పటినుండి సంస్కారము అన్నది అటు భాషలోనూ ఇటు జనజీవనములోనూ చోటుచేసుకొని తనను తానూ విస్తృతపరచుకొంటూ వస్తూనే వుంది. అందువల్లనే మన పూర్వులు అసమాన ప్రతిభావంతులైనారు. వారు అనేకానేక శాస్త్రములందు ప్రవీణులగుటయేగాక, మనకొరకు ధార్మిక జీవనమునకు వలయు సద్బోధ అనేకములగు నీతుల మూలముగా అలతి పదములతో సంస్కృతమున మనకు అందించినారు. నా శక్తిమేరకు నేను ఆ సంస్కృత సాహిత్య సముద్రమునుండి ఒక అనర్ఘ రత్నమును వెలికి తీసి మీముందుంచుతున్నాను.  
బంధవిముక్తుడయి  ఏకాకిగా ఏకాగ్రతతో తపమాచరించు ఒక తాపసి ఒకనాడు ఏమరిపాటున తన ఆశ్రమవాసియగు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి మోక్షానికి వెళ్లవలసిన వాడు, ఋణగ్రస్తుడై ఉండిపోవటంతో అతనికే పుత్రునిగా జన్మిస్తాడు.
ఒకానొక సందర్భములో ఆ బాలుని జాతకమును చూసిన వ్యక్తి ఆతని తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుండి మీరు ఎచిన్న వస్తును ఉదారముగా పొందినా అతను మీకు దక్కడు అని చెబుతాడు. నాటినుండీ ఆతని మాతాపితరులు  జాగ్రత్తగా ఆతనినుండి ఏమీ ఆశించకుండా పెంచుతారు. ఆ బాలుడు మాత్రము గతస్మృతి కలిగినవాడై వారి ఋణం తీర్చే ప్రయత్నము చేస్తూనే ఉంటాడు.
బాలుడు యువకుడైన పిదప నాతనిని తండ్రి రాజుగారి కొలువునకు తీసుకుపోయి ఉద్యోగమును తన పుత్రునికొరకు అర్థించుతాడు. రాజు ఆతనికి రాత్రి వేళల  గస్తీ తిరిగే ఉద్యోగమునిస్తాడు. ప్రతి ఝామునకు ఒకసారి ఆ యువకుడు పురజనుల కొరకు పరహితార్థమతుడై జాగ్రత్త సుమా అంటూ జీవితమునకు అత్యంత ముఖ్యమయిన జ్ఞాన బోధ చేస్తూవస్తాడు.
రాచకార్యాలలో మునిగితేలే రాజునకు రాత్రి సమయములందు నిదుర పట్టక ఈ క్రొత్త గస్తీ ఉద్యోగి చెప్పే నీతి వాక్యములను ఆలకించుతాడు. ఇతడు సామాన్యుడు కాడన్న విషయమును  గుర్తించి,  స్వయముగా అతని  ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్ని హితోక్తులను విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ చెబుతూ, పళ్లెములో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందించి నమస్కరిస్తాడు. దానిని అందుకొన్న ఆయువకుడు అసంకల్పితముగానే తన తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహమున  నియమము మరచినది ఆ ధనమును అందుకొంటుంది. వెంటనే అతడు తనువును త్యజించి ముక్తి పొందుతాడు. అంతులేని ఖేదమునకు గురియైన ఆ దంపతులకు రాజు వారి కుమారుని గొప్పదనమును గూర్చి చెబుతూ ఆయన ఏ మహాయోగియో అయివుంటాడని తెలియబరచి ఆయన చెప్పిన నీతి వాక్యములను వారికి ప్రబోధించుతాడు.
కథకు అంతరాయము కలిగించకూడదని ముందు కథజెప్పి తదుపరి ఆ శ్లోకములను భావార్థసహితముగా అందించుచున్నాను.

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః |
  అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృతా||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిథ్యయే. ఈ వాస్తవమును గ్రహించి సావధాన చిత్తుడవై ఉండుము.
2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృతా ||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, సంసారము అన్నియును దుఃఖ హేతువులే! కావున సావధాన చిత్తుడవై ఉండుము.
3. శ్లో|| కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారేణ తస్మాత్ జాగృత జాగృతా II
 :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు అన్నవి మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున సావధాన చిత్తుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృతా II
తా:-జీవజంతు సముదాయమున ఒకరమైన మనము  ఎల్లప్పుడూ మంచి చెడ్డ అన్న తారతమ్యమును అనుసరించక కర్మాసక్తులమై జీవిన్చుచున్నాము. తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తించుటలేనేలేదు. కావున సావధాన చిత్తుడవై ఉండుము.
5. శ్లో|| సంపదః స్వప్నసంకాశాః యౌవనం కుసుమోపమమ్|
      విద్యుత్ చంచలమాయుష్యం తస్మాత్ జాగృత జాగృతా ||
తా:- మన సంపదలన్నియు ఒక కలలవంటివి అంటే అన్నీ తాత్కాలికములే!, యౌవనము ఒక పూవు వలె స్వల్ప కాలము మాత్రమే వికసితమై ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున సావధాన చిత్తుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృతా II

తా:- విత్తము, చిత్తము, జీవితము అన్నియు క్షణభంగురములు. మన పాశములను గమనింపక పాశవికముగా మన ప్రాణములను తన పాశముతో హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రమూ దయ జూపడు. కావున సావధాన చిత్తుడవై ఉండుము.
7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవఃI
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్రః కా పరివేదనII
తా:- మనుషులకు వారివారి  కర్మానుసారము జీవితకాలము ఉంటుంది. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? కర్మలు మూడు విధములు. 1. ప్రారబ్ధము 2. సంచితము 3. ఆగామి . అత్యంత క్లుప్తముగా చెప్పవలసివస్తే పోయిన జన్మలో మిగిలిన కర్మ ఏదయితే ఈ జన్మకు చేరవేయబడినదో (Carry Over) అది ప్రారబ్ధము. ఏదయితే ఈజన్మకీజన్మలోనే అనుభవించుతున్నామో అది సంచితము. ఏ కర్మ ఫలితమును అనుభవించుట కొరకు వేరొక జన్మనెత్తి దానిని అనుభవించుటకు ఈ కర్మల నాచారించుచున్నామో అది ఆగామి కర్మ. ఎంతటి గొప్ప విశ్లేషణయో చూడండి. శ్లోకము అల్పము అర్థమనల్పము.
8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయాఃI
      ఋణక్షయే క్షయం యాంతి తత్రః కా పరివేదనII
తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర మరియు నివాస లాభములు గల్గును. ఆ ఋణము తీరగనే అవియన్నియును సమసిపోవును. దానికై దుఃఖించుట ఎందులకు?
9. శ్లో|| పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||
తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన తరువాత జీవులు  మరణించుట సహజము. దానికై దుఃఖించుట ఎందులకు?
10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||
తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటొక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||
తా – ప్రవహించుచున్న నదిలో మొద్దులు తేలుచూ, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు? ఇదే మాటను వాల్మీకి మహర్షి రామాయణములో ఈ విధముగా చెబుతాడు. నేనెందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆదికవి ఆదికావ్యములోనే ఎంత అనుభవ పూర్వకమైన సంస్కారవంతమయిన వాగ్ధాటిని కనబరచినాడో గమనించమని తెల్పుటకు.
యథా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవేI
సమేత్యపి వ్యపేయేతాం కాలమాసాధ్య కంచనII
మహా సముద్రములో రెండు దుంగలు ఒకదానితో ఒకటి జతకూడి కొట్టుకొని పోవుచూ విడిపోవుచున్నవి. కాలమునకు అసాధ్యమయినది ఏదీలేదు.
ఇటువంటి అద్వితీయ వాజ్ఞ్మయము కల్గిన మన సంస్కృతమును ఎంత త్రుణీకరించినామో  ఎంత నిరాదరించుచున్నామో ఒకసారి సింహావలోకనము చేసుకొంటే తిరిగీ ఆ భాషను పునరుద్ధరించి మనము ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారము కాగలము.
స్వస్తి.

9 comments:

  1. చాలా బాగా చెప్పారు రామమోహనరావు గారు... ఈ కథను శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వశిష్ఠ గీత ప్రవచనంలో విన్నాను... ఇప్పుడు చదివాను... చాలా బాగుందండి... మీకు ఇదే నా హృదయపూర్వక ధన్యవాదాలు...

    ReplyDelete
  2. చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదములు.

    ReplyDelete
  3. మనః పరివర్తన కలిగించే ఇలాంటి విలువైన భావాలను మరిన్నిటిని అందరికీ పంచుతూ వుంటారని ఆకాంక్ష.

    ReplyDelete