Sunday, 3 February 2019

భాస్కరాచార్యుని దైవ ధ్యానము


భాస్కరాచార్యుని దైవ ధ్యానము
https://cherukuramamohanrao.blogspot.com/2019/02/blog-post.html
భారతీయ మహా గణిత శాస్త్రజ్ఞులుగా ప్రసిద్ధికెక్కిన భాస్కరులు ఇద్దరు. భాస్కరాచార్య-1,  7వ శతాబ్దమునకు చెందినవారు. భాస్కరాచార్య-2 పన్నెండవ శతాబ్దమునకు చెందిన వారు. ఈయనను గూర్చియే మనమిపుడు తెలుసుకొనబోవుచున్నాము.
భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించినాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడు. ఈయన ఖ్యాతి గాంచుటకు కారణమైన అతి ముఖ్య సంఘటన ఒకటుంది. ఈ కథనము కొంతమందికి తెలిసియుండవచ్చు. తెలియనివారికొరకై పునశ్చరణ చేయుచున్నాను.

భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. వీరు ఒక  కుండలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండ క్రింద మరొక కుండను పెట్టి  వాటిలోని నీటి చుక్కలు క్రిందయున్న ఒక చట్టి లో పడే సమయం బట్టి ముహూర్తములను, శుభాశుభములను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన ఏకైక కుమార్తె  లీలావతి పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించినాడు.  ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి  ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యము అనుకోకుండా ఆ కుండలలోని పై కుండలో జారిపడింది. ఆ ముత్యము పై కుండ చిల్లుకు అడ్డుపడుటచే  నీటిచుక్కలు పడు సమయం మారింది. దానితో ముహూర్త గణన తప్పింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరమే వైధవ్యము ప్రాప్తించినది . ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు  లీలావతిని కూడా ఆ దుఃఖము నుండి బయల్పరచుటకు లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేయుట మొదలుపెట్టినాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని నిరుపమ  ప్రఖ్యాతుడైనాడు. తన కుమార్తె 'లీలావతి పేరుతో గణిత గ్రంధమును రచించి ఆమెకు కూడా ప్రఖ్యాతిని గడింప జేసినాడు.
నేను ఇపుడు ఆమె పేరుతో వ్రాసిన లీలావతి గణితమును గూర్చియే ముచ్చటించుచున్నాను.
అసందర్భమనుకోకుంటే ఇపుడు మీకు ఒక ఆశ్చర్యకరమగు విషయమును చేబుతాను.
MATHEMATICS అన్న ఆంగ్ల పదము మనకు తెలిసినదే! కానీ అది సంస్కృత జన్యము అని తెలియక పోవచ్చు. MATHE MATI CS గా వ్రాసుకొంటే మేధ మతి క్స్. అంటే మేధోమతి+క్స్. ఆ CS చేర్చటముతో మేథిమటిక్స్ అయిపోయింది.‘మేధ’ అంటే తెలివితేటలు., మతి అంటే బుద్ధి. కాబట్టి తెలివితేటలను అభివృద్ధిచేసే శాస్త్రము కావున MATHEMATICS అయిపోయినది. త్రేతాయుగము నాటికే 1067 ను ఏమంటారు అన్నది మన వాళ్లకు తెలుసు. వాల్మీకి రామాయణములో రావణుని గూఢచారులగు శుక.సారణులు, తమ ఏలిక పనుపున పోయి  రాముని సైన్యమును గూర్చి తెలుసుకొని రావణునితో ఈ క్రింది శ్లోకముతో మొదలుపెట్టి ఇంకా మూడు శ్లోకములు చెబుతాడు. మొదటి శ్లోకము మాత్రమె మీముందు ఉంచుచున్నాను.
ఏషాం కోటి సహస్రాణి నవ పంచ చ సప్తచ l
తథా శంఖ సహస్రాణి తథా వృంద శతానిచll 6-28-4 (వాల్మీకి రామాయణం)
కోటి అనగా 107 శంఖు అనగా 1012 వృంద అనగా 1012. సముద్ర అంటే 1052 . వానర సైన్యము దానికి మించినది. పై శ్లోకము ప్రకారము, మహౌఘ అనగా1067, 1072 వున్నది. దీనిని బట్టి మనవారు గణితములో ఆకాలానికే ఎంత ప్రగతిని సాధించియుండినారో మనకు తెలుస్తుంది. మననుండి అరబ్బులు గ్రహించితే వారినుండి పాశ్చాత్యులు గ్రహించేవరకూ వారికి గణితమంటే ఏమిటో తెలియనట్లే చెప్పుకొనవచ్చును.

ఇటువంటి అనేకానేక విషయములు కాకుండా నేడు స్నాతక, స్నాతకోత్తర పట్టాలు సంపాదించే వారు చదివే ఎన్నో విషయములను ఆయన తాను వ్రాసిన సిద్ధాంత శిరోమణి లో మనము చూడవచ్చును.
ఈయన సంస్కృతములో గొప్ప పండితుడు. తన ‘లీలావతి’ గణితములో పరమాత్ముని ప్రార్థన ఏవిధముగా చేస్తున్నాడు అన్నది నేను మీ ముందుంచనున్నది.
ప్రీతిం భక్తజనస్య యో జనయతే విఘ్నం వినిఘ్నన్ స్మృతఃl 
తం బృందారక బృందవందిత పదం నత్వా మతంగాననం ll
పాటీం సద్గణితస్య వచ్మి చతుర ప్రీతిప్రదాం ప్రస్ఫుటాంl
సంక్షిప్తాక్షర కొమలామల పదైః లాలిత్య లీలావతీంll
ప్రీతిం భక్తజనస్య జనయతే = భక్త జనులకు ప్రీతీ కలుగు రీతిగా అనుగ్రహించుతూ
విఘ్నం వినిఘ్నం= విఘ్నములను భంగపరచునట్టి
బృందారక బృంద వందిత పదం = శ్రేష్ఠులగు భక్త బృందముచే నమస్కరింపబడు పాదములను గల్గిన
నత్వా మతంగాననం = గజముఖుడగు విఘ్నేశ్వరునకు నమస్కరించుతూ
పాటీం సద్గణితస్య = గొప్పదగు అంకగణితమును (Arithmetic)
చతుర ప్రీతిప్రదాం ప్రస్ఫుటాం = చతురులగు పాఠకులకు ప్రీతిప్రదమగు రీతిలో ప్రస్ఫుటముగా అంటే చక్కగా అర్థమగురీతిలో   
సంక్షిప్తాక్షర కొమలామల పదైః = తక్కువ అక్షరములు కలిగి యుంటూ ఎటువంటి మాలిన్యములు లేని కోమల పదజాలముతో లలితమగు రీతిలో లీలావతీ గణితమును
వచ్మి = చెప్పబోవుచున్నాను.
ఇదే శ్లోకమునకు ఇంకొక అర్థము చెప్పుకొందాము.
వి = పక్షి (ఏకాక్షర నిఘంటువు) (జటాయువు) ఘ్న = రెక్కలు విరిచినవాడు (రావణాసురుడు)
 (శ్రీ రామునికి) ఎవరితోకూడా అంటే మతంగాననం = ఎనుగును బోలిన తలగలిగిన కుంభకర్ణుని కలిపి, రావణుని
వినిఘ్నం = చంపినట్టి రామునికి
నత్వా = ప్రణమిల్లెదను
ప్రీతిం భక్తజనస్య యో జనయతే అన్న మాటకు కూడా ఎంతో ప్రెమతో పరమభక్తుడగు విభీషణునికి రాజ్యమునిచ్చినాడు.
ఈ శ్లోకమునకు అర్థము శ్రీకృష్ణుని పరముగాకూడా తీసుకొనవచ్చును. కంసవద్కు గానూ బలరామకృష్ణులు మధుర వెళ్ళినపుడు వారిని చంపుటకు మావటివానితో కువలయాపీడనము అన్న మదగజమును కంసుడు పురమాయించుతాడు. శ్రీకృష్ణుడు అవలీలగా దానిని చంపుతాడు. బృందారక బృంద వందిత పదం అంటే బృందావనము నందలి గోపికా బృందములచే పూజింపబడిన పరమాత్మ మరియు కువలయాపీడనము అన్న మతంగము అనగా ఏనుగును నిర్జించిన శ్రీకృష్ణునికి నమస్కరించి ఈ గణితగ్రంధమును వ్రాయుచున్నాను.
 తన భక్తిని ఇన్నిరీతులుగా పరమాత్మను వివిధ రూపములలో ఒకే శ్లోకములో నుతించినాడు. ఈ క్రింది శ్లోకమును చూడండి:
అచిన్త్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనేl
సమస్త జగదాధారామూర్తయే బ్రాహ్మణే నమఃll
ఈ శ్లోకము కూడా లీలావతి గణిత గ్రంధము లోనిదే! ఇందులోకూడా ఒక విశేషమున్నది. శ్లోకము చదువుతూనే, అచిన్త్యుడు, అవ్యక్తుడు,నిర్గుణుడు, గుణాత్మకుడు, సమస్తజగములకు ఆధారభూత మూర్తి యగు పరబ్రహ్మకు నమస్కారములు అన్నది బాహిరమగు అర్థము.
ఇక ఆంతరంగికమగు అర్థమును ఒకసారి చూద్దాము.
వ్యక్త అనగా -> Numerals -> 1,2,3....
అవ్యక్త -> Alzebra -> x, y, z, ............
చింత్య -> Real Numbers -> (1)2, (-1)2, (2)2, (-2)2, (3)2, (-3)2, .............
అచింత్య -> Imaginary Numbers -> Any number accompanied by −1.
నిర్గుణ -> Point -> No specific nature.
గుణ -> Multiplication -> x and ÷
ఇన్ని గుణములు కలిగిన పరబ్రహ్మ రూపము ఈ గణితము అని తెలియజేస్తున్నాడు ఆ మహానుభావుడు. అటు సంస్కృతములోనూ ఇటు గణితములోనూ అటు కన్నబిడ్డపై అవ్యాజ మమకారములోనూ అగణిత గుణగణ ప్రతిభాభాస యుతుడు భాస్కరాచార్యుడు.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము. కాని ఈ గ్రంథంలో (న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి. కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి." అసలు ఈ మాటకు మూలము ఋగ్వేదము లోనే యున్నది.
ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.
తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళ గణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడైనారు.
వీరు మరణించిన సంవత్సరం క్రీ.శ. 1185. భారతదేశపు రెండవ (భాస్కర-1) మరియు ఐదవ (భాస్కర-2) కృత్రిమ ఉపగ్రహాలకు వీరి పేరు పెట్టినారు.
స్వస్తి.

1 comment:

  1. Good information given sir. Thanks for your article.

    ReplyDelete