Wednesday, 17 January 2018

భ్రమ - చాందోగ్యోపనిషత్తు

భ్రమ – చందోగ్యోపనిషత్తు
  
వాచారంభణమ్ వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యంచాందోగ్యోపనిషత్తు 6.1.4
పై వాక్యాన్ని చేతనయినంతవరకు విశ్లేషించే ప్రయత్నము చేస్తాను.
మనమెన్నో మట్టి తో తయారుచేసే పాత్రలను చూస్తాము. ఒక దానిని కుండ అంటాము. ఒక దానిని మూకుడు అంటాము. ఒక దానిని కడవ అంటాము. ఈ విధముగా మట్టితో తయారయ్యే వస్తువులకు ఎన్నో పేర్లు.  కానీ ఈ వస్తువులకు మూలము మాత్రము మట్టే కదా! మరి ఫలానా వస్తువును  చూడగానే దానిని కుండ అని అంటున్నాము. కడవ అనటము లేదు. ఆ స్పృహ మనకు ఏవిధముగా కలుగుతూ వుంది. ఏ విధముగానంటే  ఒక వస్తువును చూసిన వెంటనే కంటి నుండి ఒక కిరణము బయటికి ప్రసరించితే ఒకటి లోనికి ప్రసరించుతుంది. ఈ రెంటి సంయోగమే  మట్టి కుండగా మారింది. ఈ సంయోగమే లేకుంటే మన బుద్ధి ఆ వస్తువును కుండ అని గుర్తించలేదు.
ఒక వ్యక్తిని చూడగానే మానవుడు అని అతడిని తాకిన కిరణము బుద్ధికి ఆదేశమిస్తూవుంది. బుద్ధిని తాకిన కిరణం అతడు ఎవరు, ఏమి పేరు, ఏవూరు, వృత్తి ఏమిటి మొదలగు విషయముల నన్నింటినీ తెలియజేస్తుంది.
కాబట్టి నిజమైన సాధన ఏంటంటే ఏది కనబడుతోందో దాని సత్యాన్ని అంటే  మూలమును గ్రహించగలగడం. నిజానికి అక్కడ కుండలేదు పగిలితే అది మట్టే! మరియొక ఉదాహరణ చూద్దాము.
ఒక వ్యక్తి తన వరిమడిని ఎంతో శ్రమ తీసుకొని సాగు చేసి వరి ధాన్యమును పండించుతున్నాడు. మరి ఆ ధాన్యములో చేరింది ఆ మడిలోని మట్టి యొక్క సారమే కదా! అసలు ధాన్యపు గింజలుగా రూపు దిద్దుకొన్నది ఆ మడి లోని మట్టే కదా! ఆతని 
తల్లి తనను గర్భములో మోసే సమయములో తిన్నది కూడా ఆధాన్యమే అంటే అదే మట్టే!
కాబట్టి నీవూ మట్టే! అందుకే గౌడపాదాచార్యులవారు దృశ్యద్వాద్ అసత్యం – చూస్తున్నావు కాబట్టే అసత్యం అని మాండూక్యకారికలో నిర్దారించుతారు. కావున మనకు అర్థమయినది ఏమిటంటే కనిపించేది వాస్తవము కాదు. నిజానికి వాస్తవము అదృశ్యముగా దానిలో దాగివుంది. దానిని ఒడిశి పట్టుకొంటే మనకు సత్యము బోధపడుతుంది.కుండ ఏవిధముగా మట్టి అని తెలుసుకొన్నామో, ధాన్యము ఏవిధముగా మట్టి అని తెలుసుకొన్నామో, అదే విధముగా మన శరీరము కూడా మట్టి అని తెలుసుకొన్నాము. కావున ఈ శరీరము నేను అనుకొనుటకు వీలు లేదు. మనము తిన్నది సక్రమముగా మెదడుకు చేరుచున్నంతవరకే బుద్ధి ప్రచోదితమౌతుంది. క్రమము తప్పితే బుద్ధి చైతన్యమును కోలుపోతుంది. మరి నేను అనిపించుకొనేందుకు ఇక మిగిలింది ఆత్మ. కట్టే కదిలే వరకే అది అంటిపెట్టుకొని వుంటుంది. కట్టె కాలుటకు సిద్ధమయితే ఆత్మ పరమాత్మను చేరుతుంది ప్రతిబింబము బింబమును చేరినట్లు.

అంటే కనబడే సమిష్టిలోనేదిదేదో వ్యష్టిలో ప్రత్యేకంగా చేరింది. దీన్నే సృష్టి అంటారు!
ఇక్కడ పరమాత్మ సమిష్టి. ఆత్మ వ్యష్టి. ఆత్మ దేహిలో చేరితే సృష్టి.
ఇలా దీర్ఘంగా ఆలోచిస్తూ ధ్యానమార్గంలో తదేకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు చివరకు శుద్ధ చైతన్యస్వరూపము స్ఫురణ వస్తుంది. ఉన్నది చైతన్యమే! నేను బ్రతికి ఉన్నానుగాబట్టే చైతన్యం అనే విజ్ఞానం వస్తుంది. దీన్నే విపులంగా గౌడపాదాచార్యులవారు ప్రతిపాదించినారు.
ఇంకా చెప్పాలంటే ఈ సత్యాన్నే Scientists క్వాంటమ్ ఫిజిక్స్ లో ష్రోడింగర్స్ క్యాట్ ఎక్పరిమెంటు అని అన్నారు. ఒక వస్తువులో చైతన్యము వున్నదా లేదా అంటే వుంది, లేదు
అన్న రెండు సమాధానాలూ వస్తాయి. సైన్సువారు దేన్నైతే మాయపిల్లి అన్నారో అదే సత్యాన్ని మనఋషులు ఏనాడో మాయా ప్రతిపాదనగా చెబుతూ అఘటిత ఘటనా పటీయసీ ఏది లేదో అది ఉన్నట్లుగా భ్రమింపజేసేది మాయ అన్నారు. మనకు కనిపించేదంతా మాయ! ఈ జగత్తులో ఉన్నది ఒక్కటే శుద్ధ చైతన్యం సరిగా ఆలోచిస్తే మట్టిగూడాలేదు! మీకూ నాకూ వ్యత్యాసమే లేదు.. అంతా ఒక్కటే ఏకం సత్ విప్రాః బహుధా వదంతి.
ఉదాహరణకు ఒక వ్యక్తిలో ప్రేమలో పడతాము. అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోతాడు. కుండ బద్దలైపోతుంది. శరీరం అగ్నికి ఆహుతైపోతుంది.  కానీ మనసులోపలి పొరల్లో ఎక్కడో దాక్కుని ఉన్న ఆ వ్యక్తియొక్క కిరణాలు అద్దంలాగా ప్రతిబింబించబడతాయి. ఒకప్పుడులేకుండా మధ్యలో పుట్టి తిరిగి లేకుండా పోయిన ఏదో ఒక కాంతికిరణం మనసులోపలిపొరల్లో మాయగా కప్పి ప్రేమగా మారి పిచ్చితనంగా ఏడిపిస్తుంది.
అందుకే వాచారంభణం వికారో నామధేయాని మృత్తికేవ సత్యం.

No comments:

Post a Comment