Sunday, 7 January 2018

భాగవత శ్రవణము మరియు పఠనము

భాగవత శ్రవణము మరియు పఠనము

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన.
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పరతు.
భాగవతమును  గూర్చి సమగ్రముగా సంపూర్ణముగా తెలుసుకొని దానిని గూర్చి పలుకుట ఈశ్వరునకైనను, బ్రహ్మకైనను,సాధ్యము కాని విషయము. అట్టి భాగవతమును నేను కని విని ఎరిగిన మేరకు తెలిపెదను అంటున్నాడు రామపాద సేవాంకితుడు పరమ భక్తాగ్రేసర చక్రవర్తి పోతనామాత్యుడు.
అసలు ఒక మంచి విషయము చెప్పవలెనంటే ఒక మంచి శ్రోత లేక పాఠకుడు కావలెను. అప్పుడు ధన్యత ఇరువైపులా చేకూరుతుంది. అందుకే పెద్దలు భాగవత శ్రవణమును పెళ్ళితో పోల్చినారు. , అది లిఖిత పూర్వకము కావచ్చు లేక వాచక రూపము కూడా కావచ్చు, పరమాత్మ పాదాంకితుడగు వ్యక్తి యొక్క ప్రవచనమే అనుగ్రహము'. 'అనుగ్రహోహి వరః ప్రోక్తః' అన్నారు ఆర్యులు. ఈ 'అనుగ్రహము' వరుడు. మరి వధువు ఎవరు. వేరెవరో కాదు ఆలకించే వ్యక్తి యొక్క భక్తి. ఆ వ్యక్తి ఎంత భగవద్విధేయుడై వుంటేనో అతనిలో అటలమగు, అచంచలమగు భక్తి బహిర్గతమౌతుంది. ఆ 'భక్తి ' ఈ పెళ్ళిలో వధువు. మరి ఈ వధూవరులు భార్యాభార్తలయితే వారి సంతానమెట్లుంటుంది అంటే, కుమారుడు 'జ్ఞాన ప్రబోధుడు' అగుతాడట. మరి ఒకే సంతానమా అంటే ఒక కుమార్తె కూడా కలుగుతుందట. ఆమెయే 'శ్రద్ధ'. మరి అటువంటి సంతానము గల సంసార,మునకు ఏమి కొదవ ఉండగలదు. వీరిరువురు ఒకేచోట వుంటే వారు చేసే కార్యము ఉత్సవమే! అసలు ఉత్సవము అంటే ఏమిటో తెలుసుకొందాము. ఉత్ అన్న ధాతువుకు ఉత్కృష్టము అని అర్థము. సవము అంటే యజ్ఞము అని అర్థము. అంటే ఈ భాగవత ప్రవచనమే ఒక అత్యుత్కృష్ఠమగు యజ్ఞము. భాగవతము రెండు పర్యాయములు వినవలెనట. మొదటి సారి భక్తి కలుగుటకు రెండవసారి భక్తితో కూడి వినుటకు. అప్పుడే అది ముక్తి మార్గము పై నీకున్న శక్తి , ఆసక్తిని కలిగిన వ్యక్తిగా గుర్తించుతుంది.
అసలు భాగవతము వింటే కలిగేదేమిటి? ఒరిగేదేమిటి? దానికి జవాబు 'భాగవతము' అన్న పేరే చెబుతుంది. 'భకారము' భక్తిని, గ కారము జ్ఞానమును, వకారము వైరాగ్యమును, త కారము తత్వమును, మాకారము మోక్షమును మనకు అందించుచున్నవి. అంటే ఒక్క భాగవతము చదివినా, వినినా జీవాత్మను పరమాత్మలో ఐక్యము చేసుకొనవచ్చును. కానీ దీనికి కావలసినది సత్వ సిద్ధి, తత్వసిద్ధి. ఆ నిశ్చల తత్వము అన్నది మనకు ఏర్పడితే జీవన్ముక్తి దానంతట అదే లభించుతుంది. అందుకే గుర్వష్టకములో జగద్గురువు శంకరులవారు ఈ విధంగా చెబుతారు.
శరీరం సురూపం తథా వా కలత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! 
అందమైన శరీరము, రూపవంతురాలగు భార్య, ఎంతో చిత్రమైన గొప్పదైన కీర్తి, మేరు సమానమైన ధనము ఉన్నా, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము? ఇక్కడ మనకు గురువు భాగవతమే, అసలు హరేరంఘ్రి పద్మే అనే పాఠాంతరము కూడా వున్నది. శ్రీ కృష్ణపరమాత్ముడు ఎట్లయినా జగద్గురువే ! అందుకే వ్యాసులవారు పద్మ పురాణములో శ్రీ కృష్ణులవారిని గూర్చి ఈ విధముగా చెబుతారు.
సచ్చితానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే
తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ నమోనమః
ఇక్కడ పురాణము అన్న మాటకు అర్థము ఒకసారి చెప్పుకొందాము. పురా అంటే ప్రాచీన అణ అంటే తెలుపుట, చెప్పుట అన్న అర్థముతో పురాణము సృష్ట్యాది జరిగిన చరిత్రగా భావించ వచ్చు. ఆధ్యాత్మికముగా ఈ మాటకు ఇంకొక అద్భుతమయిన అర్థమును అన్వయించుకొనవచ్చును.
పురా అంటే మనసులు అణ అంటే జీవింపజేసేది. పురాణి అన్తఃకరణాని ఆణయతేతి  జీవయతేతి పురాణం కావున మనసులు జీవించుట అంటే మనసులకు ఒక నిలకడ ఏర్పడుట. అప్పుదేకదా అవి జీవింప గలుగుతాయి. ఈ నిలకడే నిశ్చలత. ఈ నిశ్చలతే జీవన్ముక్తికి సోపానము. ఆ నిశ్చలతను ప్రసాదించేదే భాగవతము.
ఈ భాగవతకల్పవృక్షమునకు కృష్ణ మూలము శుకాలాపాభిరామమ్ము కలిగియుండుటచే భాగవతము జగద్దితమైనది. ఇక్కడ కృష్ణుడు మూలము అన్నది ప్రసిద్ధార్థమయితే కృష్ణద్వైపాయనుడు మూలము, అంటే మరి వ్రాసింది ఆయనే కదా!, అన్నది అంతర్లీనమగు అర్థము. ఇప్పుడు విశ్వ శ్రేయస్సుకై భాగవత ప్రాచుర్యమును నేల నాలుగు చేరగులకూ వ్యాపింపజేసిన ఆ మహనీయులను గూర్చి రెండు మాటలు చెప్పుకొందాము.
శుక మహర్షి తల్లి గర్భములో 12 సంవత్సరములు వుండినాడట. తల్లి పేరు వీతాదేవి అని పెద్దలచే విన్నట్లు జ్ఞాపకము. శుకబ్రహ్మను గూర్చి పద్మ పురాణము, స్కాందపురాణము ఆదిగాగల పురాణములలో వింటాము. నవమాసములు దాటిన పిమ్మట వ్యాసులవారు కుమారుని బయటికి రమ్మంటే నేను రాను అన్నాడట శుకమహర్షి. నింపాదిగా గర్భస్థ శిశువుకే వేదాది విద్యలు బోధించ సాగినాడు వేదవ్యాసుడు. గర్భములోనే శుకునికి 12 సంవత్సరములు గడచిపొయినాయి. అప్పుడయినా వస్తాడనే ఆశతో కుమారుని బయటికి రమ్మని పిలచినాడట తండ్రి. కుమారుడు నేను బయటికి వస్తే నన్ను మాయ ఆవరించుతుంది రాను అన్నాడట పుత్రుడు. వ్యాసులవారు ఎంతో బ్రతిమాలితే శ్రీ కృష్ణుడు నాకు ఆశ్వాసనమునిస్తే వస్తానన్నాడట. వ్యాసులవారు కృష్ణ పరమాత్మను పిలుచుకవచ్చి అదేవిధముగా చెప్పించినాడు. తల్లి గర్భము నుండి బయటికి  వచ్చిన శుకుడు 16 సంవత్సరముల బాలకునిగా ద్యోతకమౌతూ వున్నాడు. తల్లిదండ్రులకు శ్రీ కృష్ణునికి నమస్కరించి అడవులకు బయలుదేరినాడు. ఆయన వెంట 4 వేదములను విభజించి, అనేకానేక పురాణములను వ్రాసి, (అందులో ముఖ్యమయినవి 18) 555 బ్రహ్మసూత్రములను వ్రాసి జయమను పేర మహాభారత ఇతిహాసమును వ్రాసి, ఇంకా ఎన్నెన్నో శాస్త్రములు వ్రాసి వైరాగ్య సంపన్నుడయిన వ్యాస మహర్షి పుత్రుని చూచినవెంటనే వ్యామోహ చిత్తుడై  "పుత్రా" అని పిలచినాడట. ఆత్మారాముడయిన శుకుడు భవబంధ గ్రధితుడు కాదు. ఆత్మా ఆరాముడు అంటే ఆత్మ యందే రమించేవాడు అంటే బ్రహ్మజ్ఞాని అని ఒక అర్థమైతే ఇంకొక అర్థములో ఆత్మయందే ఆరామము అంటే విశ్రమించేవాడు అంటే తత్వగ్రాహి. వేరొక అర్థములో   ఆత్మాహి రాధికా ప్రోక్తా అంటే రాధా దేవికి ఆత్మ అన్న పేరున్నది కావున ఆమె ఆత్మలో రమించేవాడట.
రాధ ఆత్మలో శ్రీకృష్ణుడు ఒకడూ, శుకరూపమున నుండ పుత్రసమముగా పెంచిన శుకుడు కలకాలమూ నిలిచి యుంటారట. అసలు చిలుక రూపములోనున్న శుకునికి కృష్ణ మంత్రమునుపదేశించినది రాధయట. ఈ కథ ఉత్తర భారతమున అమిత ప్రచారములోనున్నది. అటువంటి శుకునకు ఆ పిలుపు ఏవిధమయిన ప్రభావమునూ చూపలేక పోయింది. అడవిలో దట్టమయిన చెట్లకు ఒకవైపు శుకుడు మరొకవైపు వ్యాసుడు నిలిచి వున్నారు. వ్యాసుని పుత్రా అన్న పదేపదే పిలుపునకు ఆ చెట్ల చేత శుకుడు జవాబును ఇప్పించుతూవున్నాడా అన్నట్లుందట. వ్యాసులవారి అనుభూతి, అనుభవమునకు మేము ఏ విత్తనమునుండి భూమిపయికి వచ్చినామో దానిని తండ్రీ అనుట లేదు, మా వల్ల కలిగిన మొక్కను పుత్రా పుత్రీ అని పిలుచుట లేదు. స్థావరములగు మాకే ఇంత వైరాగ్యముంటే మరి నీ కథ ఏమి అని అడిగినట్లు వుండినదట. ఇదంతా బ్రహ్మస్వరూపుడగు శుకుని చేయిదమని సూతమహాముని తన గురువు గరిమనుగూర్చి ఘనముగా తెలియజేసినాడు.
అట్టి శుకబ్రహ్మ పరీక్షిత్తునకు భాగవత కథ ప్రారంభించి చెబితే దానిని సూతులవారు నైమిశారణ్యములో శౌనకాది మునులకు తెలుపుటతో లోకవ్యాప్తమయినది. శ్రోత ముందు నేను నాది అన్న అహంకారమును వీడి నిర్మల నిష్కల్మష హృదయులై ఆశీనుడు కాగలిగితే కథకుడు సాత్వికుడై, భగవత్ప్రేరితుడై, స్థిరచిత్తుడై వుండినపుడు కథామృతమును గ్రోలుటకు తగిన రంగము సిద్ధమవుతుందట. దానికితోడు చెట్ల నీడ, స్వచ్చ వాయువు, స్వేచ్ఛా వాయువు కూడా, తోడ్పాటు అయినందువల్ల అచటి వాతావరణము అత్యంత రామణీయకమై, ఆహ్లాద జనకమై శోభిల్లుతుందట. శుకుని మహనీయత తెలుసుకున్నాము. సూతుని మహిత, ప్రాధాన్యత తెలుసుకొందాము.
సూతుడు అంటే బ్రాహ్మణ వర్ణమునకు చెందిన పురుషునికీ క్షత్రియ వర్ణమునకు సంబంధించిన స్త్రీకి కలిగిన సంతానము సూతులు అనబడుతారు. ఒక పురాణ కథనము ప్రకారము ఈయన ఇంద్ర హవిస్సు, బృహస్పతి హవిస్సుల కలయికచే జన్మించినాడు అని చెబుతారు. అందువల్ల ఆయనకు యజ్ఞ సంభవుడు అన్న పేరు కూడా వుంది. బృహస్పతి బ్రాహ్మణుడు, ఇంద్రుడు అన్నది పదవి. దానికి 1౦౦ యజ్ఞములు చేసి యోగ్యత సంపాదించుతారు భోమన్దలముఇను ఏలిన రాజులు.  పైఉగా ఇంద్రుడు దేవతల రాజు అగుటచే వారి సంతానముగా ఆయన సూతుడైనాడని తెలియవస్తూవుంది. ఆయన లౌకికముగానే మనము సూతుడని అనుకొన్నా అయన ఆత్మజ్ఞాని. ఆయన అన్నివిధములా బ్రాహ్మణుడు కాకపోయినా పూజనీయుడు. అందుకే శౌనకుడు సూతునికన్నా పెద్దవాడు, ఋగ్వేద ప్రవాచకుడు, ధర్మసారమునెరిగినవాడు, అయినా కూడా సూతుని వద్ద ఎంతయో విధేయతను చూపి భాగవత కథా సారామృతము కోరుతాడు. అది కర్ణరసాయనము కావలెనంటాడు. కర్ణ రసాస్వాద కుశలః అన్న మాట వినిపిస్తుంది కావ్యములో! ఇక్కడ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పుకొనవలసి వస్తుంది. అసలు సూతముని శౌనకాది మహర్షులు చేసే యజ్ఞమునకు పిలువనిదే ఎట్లు వచ్చినాడు. సత్కార్యమునకు సత్పురుషులు పోవుట భగవత్ప్రేరితము. దానికి పిలుపుండదు.  మరి శౌనకుడు సూతుని గౌరవించెనే అంటే ఆయన భక్తి జ్ఞాన వైరాగ్య సారమును ఆకళింపుచేసుకొని ఆత్మానందమున ఓలలాడు వాడు. అది తెలిసినవాడు కావున శౌనకుడు ఆయనకు అంత మర్యాద సలిపినాడు. ఇక కర్ణ రసాయనము అని ఎందుకు వాడబడిందంటే
ఈ లోకములో జరిగే అనేక అన్యాయ అత్యాచార, అశ్లీల వార్తా శ్రవణముచే చెవుల వినికిడి నీరసించి పోయింది. మరి రసాయనము అంటే మందుకదా! Ear Drops. పడితే చెవులు మళ్ళీ మొదటికొస్తాయి.
అందుకని అటువంటి కథ కావలెనన్నారు. చూచినారా! కావ్ఈ యములో ఒక్క వ్యర్థమగు మాట కూడా దొరలదు. పైగా కాయ రసము కావలెనట. అంతా వింటే ఎంత జ్ఞాపకముతుందో అన్న సందేహము. రసమయితే ఎంతో ఆనందము ఆహ్లాదము మరియు సులభముగా ఆరిపోతుంది. ఆ కథలు కూడా భక్తిజ్ఞాన వైరాగ్య భరితములై వుండవలేనట. ఇన్ని కోరికలకూ సరిపోయేది భాగవతమేనని ఒక్క తృటిలో సూతులవారు శెలవిచ్చినారు. శౌనకులవారు ఇంకొక మాట కూడా అంటారు. ఇహ ఘోరే కలౌ అన్నారు కావున అది కూడా లేకుండా చేయవలెనని ప్రతిపాదించుతారు. కలి పాపభూయిష్టమని అనుకొంటాము కానీ అందు ఒక సౌలభ్యము వుంది. అసలు కలి అన్న మాటకు వ్యుత్పత్తి ఈ విధముగా కూడా తీసుకొనవచ్చును.కం సుఖం లాతి అనుఘృణ్ణాతి దదాతీతి కలిః అంటే సుఖము అంటే తెచ్చేది. కలౌ నామ సంకీర్తనం అని అన్నారుకదా! మరి ఇంతకన్నా సులువౌ మార్గము ఉండదు కదా! ఈ విషయములు పెద్దలద్వారా తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను.
సూతులవారు వెంటనే సర్వ భవరోగ సంజీవిని భాగవతము అని తెలియజేస్తాడు. దీనిని తాను తన గురువయిన శుకయోగీంద్రులవారి ద్వారా విన్నానని చెబుతూ ఇది సప్తాహము అంటే 7 దినములలో ముగించవలసిన కథ అంటాడు.
మనమంతా అసురులము. అసు అంటే ప్రాణములు అంటే రతి ఆసక్తి ఇష్టము. కావున మనము అసురులమే కదా! శారీరిక సుఖములకొరకే కదా మన తాపత్రయమంతా! చిట్టా శుద్ధితో విన్నవానికి సంసార భయనాశనం- భక్త్యోగ వర్ధనం- సావధానతయం  ఈ మూడు గుణములు మనకు అబ్బితే ఇక మన నడవడికలోగానీ భక్తి తత్పరతలోకానీ సహనశీలతోగానీ కొదువ ఏముంటుంది. భగవంతునికి చేరువగుటకు ఇంతకన్నా కావలిసింది ఏముంటుంది. అందుకే భాగవతమును గూర్చి ఈ మాట చెబుతారు కాళవ్యాళ ముఖాగ్రాసత్రాస నిరాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం అని. కాలమనే వ్యాళము అంటే భయంకర సర్పము కబలిప వచ్చినచో దానికి నిరాశను కలిగించేదే భాగవతము అని. పైగా అది భక్తి శాస్త్రము. ఇది ఇంతే అని శాసిస్తుంది. కావున అనుసరించుట తప్ప అడ్డ ప్రశ్నలు వేసే అవకాశము లేదు. సూతుడు శౌనకుని ప్రశ్నకు సమాధానముగా తొల్లి బ్రహ్మజ్ఞాన సంపన్నులు, బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినవారు, అదే బ్రహ్మ యొక్క తోడనుండి పుట్టిన వాడు నారదుడు. ఈయనది భక్తి మార్గము. లోకములో ఈయన కలహా భోజనుడను అపప్రథ వుంది.  ఒక్క మాటలో చెప్పవలెనంటే న+అరం+ద అంటే క్లేశము కలుగని జ్ఞాన బోధ చేసేవాడు అని అర్థము. అంతటి భక్తి తత్పరుడు బ్రహ్మజ్ఞాన తత్పరులగు సన చతుష్టయము నుండి భాగవతమును విన్నాడు.  సన అంటేనే వేదము వేదము అంటేనే జ్ఞానము. మహనీయుల నామములు ఎంత అర్తవంతమైనవో గమనించండి. అట్టి భాగవతమును స్వయముగా, తండ్రికే చెట్ల ద్వారా జ్ఞానముపదేశించి తండ్రితో గూడక కాననలకేగిన శుకుడు 7 దినములు ఎక్కడికీ కదలకుండా పరీక్షిత్తుకు ఈ భాగవత కథ తెలియజేసినాడు. ఇక్కడ ఇంకొక మర్మము వుంది. ఇటు శుకుడు అటు పరీక్షిత్తు ఇరువురూ భూమిపైకి శ్రీకృష్ణునిచే కొనిరాబడినవారే! శుకులవారిది చిలుక రూపము. మనము అడిగినది పలుకుతుంది. అందుకు అక్షరము ఎక్కువ ఉండదు అక్షరము తక్కువ ఉండదు. మరి చిలుక అంతే కదా! పైగా భాగవతము
అట్టి భాగవతము వినుటకు శ్రోతలుగా కానీ, పాఠకులుగా కానీ కావలసినది తదేక ధ్యాస ధ్యానములు. ఒక తృష్ణ తపన ఇవి కలిగియుంటేనే భాగవతము వినుటకు చదువుటకు అర్హులు. అదేవిధముగా చెప్పువారు కూడా నిష్ఫలాపేక్షతో ఏకాగ్రతతో చెప్పవలెను. కృష్ణావతారము చాలించిన పిదప దేవగణము శ్రీకృష్ణుని స్వస్తానమునకు రమ్మంటే భక్తి అమృత సాగరము అది భాగవతములో మ్వుంది నేను అక్ల్కడనే వుంటానన్నాడట. అందువల్ల భగవంతుని ముందు కూర్చొని నిష్కల్మష హృదయుడై ప్రవచనకారుడు చెప్ప వలసి వుంటుంది. నాకు తెలిసినదానిలో జ్ఞాపకము ఉన్నంత మీ ముందుంచినాను. అందువల్ల మీరు భాగవతము వినదలచినా, చదువదలచినా ఎదో ప్రోద్దుబోని నవలల కథ విన్నట్లు, చదివినట్లు వెళ్ళకండి.
హా కృష్ణాచ్యుత! హా కృపాజలనిధే! హా పాండవానాం సఖే!
క్వాసిక్వాసి సుయోధనాదపహృతాం హా రక్ష మామాతురాం
ఇత్యుక్తోక్షయ వస్త్ర రక్షిత తనుః యో పాలయత్ ద్రౌపదీం
ఆర్తత్రాణ పరాయనాస్సా భగవాన్ నారాయనోమే గతిః

స్వస్తి.

2 comments: