షడ్దర్శనములు
దర్శనము
అన్న మాటకు అర్థము ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఉదాహరణ మూలముగా విశధపరుస్తాను. మొదటి
సారిగా తిరుమల కొండకు స్వామీ దర్శనమునకు పోయినాము అనుకొందాము. ఎక్కడలేని తపన, ఆతురతతో
కొండకుపోయి కాలకృత్యములు స్నానాదికములు ముగించుకొని దర్శన శాలలలో కూర్చున్నాము.
స్వామిని చూడవలెనన్న ఉత్కంఠత పెరిగి పోతూ వుంది. మన వంతు రాగానే కదిలి కదిలి
దేవుని విగ్రహమునకు చేరువైనాము. అంతలో స్వామీ నైవేద్యమునకు సమయమైనదని విగ్రహానికి తెర
వేసినారు. ఉత్సుకత ఇంకా పెరిగిపోయినది. ఇంతలో తెర తీసినారు. వేంకటాచలపతి దర్శనము
నేత్రపర్వముగా జరిగినది. అంటే ఆత్మానుభూతియొక్క ఆవిష్కరణమే దర్శనము.
జిజ్ఞాస, తపన
ఎక్కువై ఎప్పుడు వస్తు స్వరూపమును చూడగలుగుచున్నామో అప్పుడు మనకు ఆ విగ్రహము,
మూర్తి, వస్తువు, విషయము
యొక్క దర్శనము కలిగినది అని అర్థము .
అదేవిధముగా ఋషులు అనబడు మహనీయులయిన మన వైజ్ఞానికులు patent ల
కొరకు ప్రాకులాడకుండా నిస్వార్థముగా మనకందించిన 'ప్రకృతిపురుష'
విజ్ఞానమును దర్శనములు అన్నారు. ఎవరి అనుభవములు వారివి కాబట్టి వారి
వారి అనుభవములను ఈ దర్శనముల రూపములలో తెలియజేసినారు.
ఇవి 6.
1. న్యాయ
2. వైశేషిక 3. శాంఖ్య 4. యోగ 5. పూర్వ మీమాంస 6. ఉత్తర మీమాంస.
ఇవి 6
అయినా ఇందు చర్చింపబడిన అంశములు స్థూలముగా 4 మాత్రమే.
అవి 1.
పరబ్రహ్మ గుణతత్వము 2. జీవాత్మ విశ్లేషణము 3. జగజ్జననము 4. మోక్ష సంప్రాప్తము. ఇక
ఇప్పుడు నాకు తెలిసినమేరకు ఒక్కొక్క దర్శనమును గూర్చి వివరించుతాను.
మిగతది
రేపు.......
న్యాయ దర్శనము: మనము ఏదయినా ఒక విషయమును ప్రతిపాదించితే
దాని నిరూపణకు ప్రమాణ ప్రమేయములు అవసరము. ప్రమ అంటే వాస్తవము ఋజువు అని
అర్థము. ప్రమాణము అంటే మనము ప్రతిపాదించిన
విషయ నిరూపణకు ఆధారము చూపుట. ప్రమేయము అనగా అందలి వస్తువు, అంటే ఆ అంశము లేకుండా
ప్రతిపాదన నిరూపించ వీలుకాదు. న్యాయశాస్త్రమును మనకు అందించినవాడు గౌతమమహర్షి.
ఆధునిక న్యాశాస్త్రమునకు ఇది ఆది పునాది.
మన
పూర్వుల ప్రతిభాసంపత్తి ఈ న్యాయ
నిర్ణయమునకు ఏర్పరచిన సాధన సంపత్తి అమూల్యము అసమానము మరియు అద్భుతము. ఈ అంగములు
వారి ఊహాపటిమను నిరూపిస్తాయి.
మిగిలినది రేపు......
మిగిలినది రేపు......
షడ్దర్శనములు -- 3
గౌతముడు న్యాయ ప్రతిష్ఠకు నాలుగు ప్రధాన ప్రమాణములను ఏర్పాటు చేసినాడు. అవి 1. ప్రత్యక్ష 2. అనుమాన 3. ఉపమాన 4. శబ్ద . ఇక సూక్ష్మముగా ఒక్కొక్క ప్రమాణమును గూర్చి తెలుసుకొందాము.
గౌతముడు న్యాయ ప్రతిష్ఠకు నాలుగు ప్రధాన ప్రమాణములను ఏర్పాటు చేసినాడు. అవి 1. ప్రత్యక్ష 2. అనుమాన 3. ఉపమాన 4. శబ్ద . ఇక సూక్ష్మముగా ఒక్కొక్క ప్రమాణమును గూర్చి తెలుసుకొందాము.
1. ప్రత్యక్షము: (1) చక్షురాది ఇంద్రియ గోచరమగునది.
(2) స్వయంగా తెలుసుకొన్న అనుభవం. రసరూపగంధాదులను గుర్తించే
ఇంద్రియాల ద్వారానే పదార్థ జ్ఞానం
తెలుసుకొనే పద్ధతి ప్రత్యక్ష ప్రమాణం. ఇందులోనూ నాలుగు విధానాలు ఉన్నాయి,. అవి : ఘట ప్రత్యక్షం, ఘటత్వ ప్రత్యక్షం, ఘట రూప ప్రత్యక్షం, ఘటరూపత్వ ప్రత్యక్షం. ఘటాన్ని
కంటితో స్వతహాగా మొదటిసారి చూడటము, ఘట ప్రత్యక్షం. దీనినే సంయోగం అని కూడా అంటారు.
ఒకప్పుడు ఘటాన్ని చూసిన అనుభవం వల్ల ఫలానా వస్తువు ఘటమనిఅనుకోవడం ఘటత్వ
ప్రత్యక్షం. దీనిని సమవేతం అని కూడా అంటారు. శంఖానికి వలె పైభాగం సన్నగా మెడవలె
ఉంటుంది కనుక రూపము యధాతథము కాకపోయినా ఘటము యొక్క పోలికను కలిగిన పాత్రను కూజా
అనుకోవడం ఘట రూప ప్రత్యక్షం. దీనిని కూడా సంయోగం అంటారు. గతంలో ఘటరూపత్వ వివరం
తెలిసిన అనుభవం చేత తెలియడం ఘటరూపత్వ ప్రత్యక్షం. దీనిని కూడా సమవేతం అంటారు.
ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అనుసరించేవారు పరబ్రహ్మాన్ని ఒప్పుకోరు. కానీ ఇది
అసంపూర్ణమౌతుంది.
2. అనుమానము: ఒక గతానుభవమును ఆలంబనగా తీసుకొని, ప్రస్తుతములో,
ఆ గత విషయమునకు ముందుగా ఏర్పడిన స్థితి నేడు కూడా ఏర్పడుటచే,
ఇక ఇట్లు అగును అని తలపోయుట అనుమానము.ఉదాహరణమునకు క్రమ్మిన కారు
మేఘముల జూచి వర్షాగమనమును ఊహించుట.
3. ఉపమానము: పదార్థ జ్ఞాన
నిరూపణలో ఉపయోగించే పద్ధతి. ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం రెండూ ఇందులో
కలుస్తాయి. అలాగే ఉపమానం ఉపమేయం రెండూ ఇందులో ఉపయోగపడతాయి. అందువల్ల దీనిని ‘ఉభయాత్మకం’ అని కూడా అంటారు.
తెలుగు వాచకము రామాయణ గ్రంథము వున్నాయని అనుకొందాము. స్థూలముగా రెండూ పుస్తకములే!
రామాయణ గ్రంధమును, వెంటనే మస్తిష్కమునకు స్ఫురింపక పోవుటచేత, పుస్తకము అనవచ్చు, కానీ తెలుగువాచకమును గ్రంధము అనము. అంటే ఉపమానమునకు రెండు యోగ్య వస్తువులు అవసరము. అర్థములేని పోలికలతో ఉపమానమును సాధించలేము. ఈ ప్రామాణిక ఉపమానములను మూడు విధములగా విభజించుట జరిగినది.
1. గుణోపమము,
2. కర్మోపమము, 3. ప్రయోజనోపమము.
4. శబ్దప్రమాణము: అంటే వేదములలో చెప్పబడిన ప్రమాణము. ఈ నాలుగు మాత్రమే తార్కికులు అంగీకరించు
ప్రమాణములు. అర్తాపత్తి, అనుపలబ్ధి, సంభవము,ఐతిహ్యము అన్న వి కూడా ప్రమాణములుగా
చెబుతారు గానీ తార్కికులు అంగీకరించరు.
గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.
ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంతావయవ
తర్క నిర్ణయ వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల జాతి నిగ్రహ స్థానానాం
తత్వజ్ఞానాన్నిఃశ్రేయ సాధిగమః న్యాయ
దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం)
ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి : ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం,
అవయవం, తర్కం, నిర్ణయం,
వాదం, జల్పం, వితండం,
హేత్వాభాసం, ఛలం, జాతి
మరియు నిగ్రహ స్థానం. ఈ ప్రమాణములు జ్ఞాన సాధనములు. విసహాయ విస్తారణ అధికమైతే పాఠకుని
అవగాహనకు ఆటంకమేర్పడు నాన్న ఆలోచనచే ఈ విషయమును ఇచ్చట నిలుపుచున్నాను.
వైశేషిక దర్శనము: సృష్టికర్త అంటూ
ఎవరూ లేరని, సృష్టి సమస్తము అణువుల కలయికవల్ల జన్మించిందని వైశేషికం
ప్రతిపాదిస్తుంది. దీని కర్త కణాద మహర్షి. ఈ దర్శనము ఈశ్వరుడిని అంగీకరించకపోయినా వేద
ప్రమాణ్యాన్ని, ఆత్మను, పునర్జన్మను,
కర్మ సిద్ధాంతాన్ని, మోక్ష సిద్ధిని అంగీకరిస్తుంది.
కణాద దర్శనంలో పది అధ్యాయాలున్నాయి. ప్రతీ అధ్యాయంలో రెండేసి ఆహ్నికాలు, మొత్తం 370 సూత్రాలు ఉన్నాయి.
వైశేషిక
దర్శనముయొక్క ఆధారంగానే "అణువైశేషిక
సిద్ధాంతము"ను కణాదుడు ప్రతిపాదించినాడు.
కణాదుడు తన
"అణువైశేషిక సిద్ధాంతం" లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించినాడు.
1. అయస్కాంతం సూదులను ఆకర్షించడం
2. మొక్కలలో జల ప్రసరణ
3. జడ పదార్థం అయిన అయస్కాంతం సూక్ష్మ శక్తుల్ని ప్రసారం
చెయ్యడానికి అధారం కావడం.
4. అన్ని రకాల వేడిమికీ సూర్యగోళంలో ఉండే అగ్ని మాత్రమే కారణం.
5. అణువు పరిమాణానికి కూడా ఈ సూర్యగోళము యొక్క వేడిమే కారణం. 6. భూమి అణువుల్లో ఉండే ఆకర్షించే గుణమే భూమి చూపించే
గురుత్వాకర్షణ శక్తికి కారణం. 7. వస్తువుల చలన
స్వభావనికి మూలకారణము "శక్తివ్యయము" లేదా "పునఃచలన ప్రసారము" 8. అణు విఘటన/అణు విచ్ఛేదన జరిగితే విశ్వ ప్రళయము. 9. కాంతి కిరణములు, ఉష్ణ కిరణాలు
అతి సూక్ష్మ కణాలుగా ప్రసారం చెందడం వల్ల ఆ కిరణాలు అన్ని వైపులకూ అత్యంత వేగంతో
దూసుకు పోగలుగుతాయి. 10. దేశ కాలాల సాపేక్షత విశ్వం - ఆరు
స్థితులు
కణాదుడు సిద్ధాంతం
ప్రకారం విశ్వం మొత్తం ఆరు స్థితులలో ఏర్పడి యుంది. అవి 1. ద్రవ్య పదార్థం 2. గుణస్వభావం
లేదా గుణధర్మం 3. కర్మ 4. సామాన్య ధర్మం 5. విశేషధర్మం 6. సమ్యవపదార్థాలు. ఈ సమ్యవ పదార్థాలను తిరిగి 9 సహజ లక్షణాలుగా విభజించినాడు.
1. భూమి 2. జలం 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశం 6. కాలం 7. అంతరిక్షం 8. మనస్సు 9. ఆత్మ.
ప్రపంచ భౌతిక శాస్త్ర
దృక్పథాన్ని సమూలంగా మార్చి వేయ గలిగిన ప్రభావవంతమైన అణు సిద్ధాంతాన్ని క్రీస్తు
శతాబ్దాలకు పూర్వమే ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిన కణాదుని సిద్ధాంతము ప్రకారము మనస్సు, ఆత్మ రెండూ ద్రవ్యాలే. జీవిత చరమాంకము వరకూ భౌతిక అణు పదార్థాల శైలీ విన్యాసాల మీద అనేక పరిశోధనలు
చేసిన కణాదుడు సకల ప్రపంచమునకు అరాధ్యుడు.
వైషేశికమున ప్రశస్త పాదుని యోగాదానమును గూర్చి కూడా
తెలుసుకోనవలసి యున్నది. ప్రశస్త పాదుడు పదార్ధముల తత్వజ్ఞానమే
మోక్షకారణమని వచించెను. ‘తచ్చ ఈశ్వరనోదనాభి
వ్యక్తాత్ ధర్మామేవ '-
అత్మజ్ఞానమ ఈశ్వరప్రేరిత ధర్మమునుండి జనించునది అని చెప్పినారు.
ఇక్కడ ధర్మ శబ్దమునకు నిష్కామ కర్మ అని నిర్వచింపవచ్చును. మహేశ్వరునికి సంహారేచ్చ
జన్మించినపుడు పరమాణు పుంజ సంఘాతమున (Big bang/Collision) ) జనించిన
శరీరేంద్రియాదుల క్రమముగా విశ్లిష్టమై (dis-joined, disunited), వినిష్టమై (destroy) పోవును. అప్పుడు చతుర్విధ
పరమాణువులు (atoms) మాత్రమే మిగిలియుండును. అవి
‘ఏతే
భూతభౌతికాః పదార్థాః పార్థివాది చతుర్విధ ఖర -
స్నేహో - ష్ణే - రణ స్వభావ - పరమాణు సంఘాత రూపా ఏవ - న చ కార్యం నామ స్వావయవపుంజా
దతిరిక్తం భవతి - అవయవ సంస్థానభేదా త్తద్గతసంఖ్యాభేదా చ్చ కార్య భేదసిద్ధిః -
స్వావయవభూత తన్తుపుంజవ్యతిరేకేణ పటోనామ నాస్తి - ఏవం తత్తద్వస్త్వవయవభూత
పరమాణునమదాయ ఏవ భూత భౌతిక లక్షణం బాహ్యం’ అని చెప్పబడినవి.
విశ్లేషణ దిగువన చూడగలము.
ప్రళయానంతరము
జీవుని భోగాదృష్టముల పూరణకై మహేశ్వరునకు మరల సృష్టినొనర్ప ఇచ్చకలుగును. అప్పుడు
మొట్టమొదట వాయుపరమాణువున అదృష్ట వశత: స్పందనము కలుగును. అప్పుడు వాయు పరమాణువుల
సంయోగమువలన వాయువు ఉత్పన్నమై ఆకాశమున ప్రహహించుచుండును. ఇట్లే తైజస (radioisotopes), జలీయ
(water), పార్ధివ పరమాణువుల నుండి స్థూల భూతములు (Planets)
జనించును. తరువాత మహేశ్వరుని సంకల్పవశమున బ్రహ్మాండము (Universe)
సృష్టియగును. బ్రహ్మకూడా ఉధవించి మిగిలనవి సృష్టించును.
సాంఖ్యదర్శనము: ఇది కపిల
మహర్షిచే ప్రవర్తింపజేయబడింది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ
దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అన్న
మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన
బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధించడం జరుగుతుంది.
ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో
ఒకటిగా విలీనం చేయబంచడండిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన
"సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంథం.
సాంఖ్యవాదం ప్రకారం
జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును
ప్రత్యక్ష
ప్రమాణములు : మనకు
ఇంద్రియాల ద్వారా తెలిసేది. (ఉదా:స్వయంగా చూసింది, విన్నది,
స్పృశించింది. వీటిలో మళ్ళీ విభాగాలున్నాయి.
నిర్వికల్ప ప్రమాణాలు: ఇంద్రియాల ద్వారా గ్రహించింది, కాని అర్ధము
కానిది. (ఉదా: ఒక పసిపిల్లవాడు ఒక ఎగిరే
విమానమును చూస్తాడు కాని వాడికి దాన్ని
గురించి ఏమీ తెలియకపోవచ్చును. అది ఒక ఖేచరమా లేక యంత్ర సాధనమా అన్న
విచక్షణ
లేకపోవచ్చును.)
సవికల్ప ప్రమాణములు: ఇంద్రియాల ద్వారా
గ్రహించడమే కాక అర్ధం
చేసుకొన్నది. ఆ విషయానికి, మరో
విషయానికి ఉన్న భేదం తెలుసుకున్నది. ఇది సరై జ్ఞానానికి ఆధారం. అంటే ఇక్కడ ఆ
బాలుడు అది పక్షి కాదు. మానవ నిర్మిత నిర్జీవ యంత్రము,
కానీ దీనికి కూడా ఎగురగల సామర్థ్యము
వుంటుంది అని అవగాహన
చేసుకోగలుగుతాడు.
అనుమాన ప్రమాణాలు: ఇట్లు కావచ్చు లేక అట్లు కావచ్చును అని
ఊహించేది. ప్రత్యక్ష ప్రమాణాల
వల్ల గ్రహించిన విషయాన్ని
ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం.
(ఉదా: పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం)
శబ్ద ప్రమాణం: ఇతరులు చెప్పగా విన్న విషయాలు.
|
"పురుషుడు",
"ప్రకృతి" అనునవి రెండు విభిన్నమైన అంశాలు అన్నది
సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో
ఏదో ఒకదానికి
చెందుతాయి.
పురుషుడు:
అంతటా
వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార
ఆత్మ తత్వం. అంతటా ఉంది.
ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో
చెప్పజాలనిది.
(వేదాంతమున "బ్రహ్మము" కూడా ఈ విధముగనే వర్ణించబడినది.)
పురుషునకు
ఏవిధమైన
మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ
సృజింపడు.
·
ప్రకృతి:
సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉంది.
ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి
సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ
యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు
పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన,
"సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ
బంధం నుండి విముక్తి లభిస్తుంది.
·
ఈశ్వరుడు
కపిలముని
ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు.
కారణం :
ఈశ్వరుని ఉనికిని ఋజువు
చేయడం సాధ్యం కాదు అని అంటాడు గనుక, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణము అని చెప్పడం
అసంబద్ధమని
అంటాడు. తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగ
సిద్ధాంతములలో
"ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టటం జరిగింది. సాంఖ్యవాదం
ప్రకారం సృష్టికి పురుషుడు, ప్రకృతి - రెండూ కారణములే.పురుషుడు
"ఆత్మ"కు,
చైతన్యమునకు మూలము.ప్రకృతి "పదార్ధము"నకు,
పరిణామమునకు
మూలములు.
సృష్టి సిద్ధాంతం
సాంఖ్యం
"సత్కార్యవాదము"ను సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణము, ఫలితము కలిసి ఉంటాయి. ఉన్నదేదీ నశించదు. లేనిదేదీ
ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే.
అందుకు కారణంలో ఫలితం అంతర్లీనంగా ఉంటుంది. వీరి
"ప్రకృతి పరిణామ వాదం" ప్రకారం మూల ప్రకృతి అన్నిటికీ కారణం.
అదే
క్రమంగా విభజితమై వివిధ పదార్ధాలుగా పరిణామం చెందుతుంది.
చివరికి అన్నీ మళ్ళీ
అవిభాజిత మూల ప్రకృతిలో లీనమౌతాయి. ఈ విధముగా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తాయి.
వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు.
వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు గుణములు
(తత్వములు)
గా విభజితమౌతుంది.ఆ గుణాలమధ్య ఉన్న మధనక్రియ పరిణామానికి మూలకారణం.ఇందుకు
మూడు ముఖ్యమైన తత్వాలు .
·
సత్వము - సమతుల్యతను పెంపొందించే గుణము.
·
రజస్సు - వృద్ధిని, ప్రయత్నాన్ని పెంపొందిస్తుంది.
·
తమస్సు - అలసత్వాన్ని పెంచుతుంది. ప్రయత్నాన్ని
నిరోధిస్తుంది.
సృష్టిలో అన్ని
జీవులలో ఈ గుణాల వలన ఉత్పన్నమయ్యే లక్షణాలు:
· ప్రకృతి, మహత్, అహంకారము, మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు,
పంచ కర్మేంద్రియములు,
పంచ తన్మాత్రలు పంచ మహాభూతములు.
ఈ గుణాల చేత
ఏర్పడు అనుపాత నిష్పత్తుల బట్టి జీవుల, పదార్ధముల
లక్షణాలు మారుతాయి.పరిణామం
జరుగుతుంది.సాంఖ్య సిద్ధాంతములు
పతంజలి యోగసూత్రములలోను, మహాభారతములోను,
యోగవాసిష్టము
లోను విస్తృతంగా ప్రస్తావించబడినాయి. అన్ని జీవులలోను
ఆత్మ
పురుషునియొక్క స్వరూపము. మనసు,
బుద్ధి, అహంకారములనునవి
ప్రకృతి లక్షణములు.
మోక్షము
అజ్ఞానమే
బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన
చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పురుషుడు" (అనగా
జీవాత్మ) శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల
కలిగే సత్వరజస్తమోగుణములు, మనసు, అహంకారము,
మహాత్లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ
బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.
ఇక్కడ
సాంఖ్యానికి, వేదాంతానికి
మధ్య విభేదాలను గమనించవలసి ఉంది. అద్వైత వేదాంతం ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్థం లేదు. కాని
సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు
అనేవి రెండూ అనాదిగా
వేరువేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది
జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.
|
పాశ్చాత్య
తత్వాలలో సాంఖ్యం
పాశ్చాత్య
తత్వశాస్త్రంలో "కార్టీజియన్ సిద్ధాంతం" ప్రకారం శరీరం, మనసు అనేవి వేరు వేరు పదార్ధాలు. ఇది సాంఖ్యానికి
కాస్త దగ్గరగా అనిపించినా కొన్ని ముఖ్యమైన భేదాలను గమనించాలి. పాశ్చాత్య తత్వ
శాస్త్రంలో
"శరీరము"
అనేది భౌతిక పదార్థం. "మనసు" కనిపించని చైతన్యం. కాని సాంఖ్యంలో
శరీరము, మనసు, అహంకారమూ
కూడా ప్రకృతి లక్షణాలే. "జీవుడు" లేదా "ఆత్మ" అనేది మరింత
అంతర్గతంగా ఉండేది
అనవచ్చును.
(వివరణ:
పాశ్చాత్య తత్వం ప్రకారం కన్నులు శరీరంలో భాగం. చూసేది మనసు. సాంఖ్యం ప్రకారం
కన్నులు,
చూసేది కూడా
శరీరమే. అలా చూసేదానికి "సాక్షి" మాత్రమే ఆత్మ)
|
యోగము: అంటే కలయిక అన్న అర్థాన్ని చెప్పుకొంటాము.జీవాత్మ
పరమాత్మను కలియుట యోగము అంటారు. ఈ విషయమై ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాముఉదాహరణకు ఒక ఖాళీ
సీసా ఉన్నది. దానిలోని ఖాళీ స్థలము ఆకాశమే! సీసా బయట ఎటూ ఆకాశము ఉందనే వున్నది. అంటే తన లోపల, బయట ఉన్నఆకాశమును సీసా వేరు పరుస్తూ వున్నదన్నమాట. సీసా పగిలితే లోపల, బయట ఉన్న ఆకాశము కలిసిపోయినట్లు మనము గుర్తిస్తాము. నిజమునకు ఆకాశము
ఎప్పుడు విడగొట్టబడలేదు. తాత్కాలికముగా సీసా వలన వేరుచేయబడినట్లు గోచరించిన ఆకాశము ఒక్కటే అని
గుర్తించుటయే సాక్షాత్కార జ్ఞానము లేక యోగము.
నిజమునకు ఉన్నది బ్రహ్మము ఒక్కటే. అదే అనేక నామరూపములతో గోచరిస్తున్నది. ఉపాధులలో
ఉన్న చైతన్యము, ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము వేరు, వేరుగా మనము భావిస్తూ ఉంటాము. చైతన్యము సర్వవ్యాపకము. మనలో ఉన్న చైతన్యమును నేను గా భావించి, నేను బ్రహ్మముయందు ఐక్యము చెందవలెను ,అందుకు సాధన చేయువలెను అని భావిస్తాము. నిజమునకు ఉన్నది
బ్రహ్మము ఒక్కటే, నేను అనునది లేనే లేదు. ఉపాధి వలన తాత్కాలికముగా
వేరు పరచబడినట్లు గోచరించినను, ఉన్నది ఒక్కటియే అని భిన్నత్వములో ఏకత్వమును
గుర్తించుటయే సాక్షాత్కార జ్ఞానము లేక యోగము.
దీనినిబట్టి మనము గ్రహించ వలసినది ఏమిటంటే నిజమునకు
యోగములో జరుగునది రెండు వేరువేరు వస్తువులు లేక పదార్దముల కలయిక కాదు, కలిసే
ఆరెండూ ఒక్కటే!.
పూర్వ మీమాంసా దర్శనం: మీమాంస రెండు విధాలగా విభజింపబడింది. అవి పూర్వ
మీమాంస, ఉత్తర మీమాంస. కర్మకాండకు సంబంధించిన పూర్వ భాగాన్ని పూర్వమీమాంస అని పిలువటం
జరిగింది. జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తర భాగాన్ని అంటే బ్రహ్మసూత్ర దర్శనాన్ని ఉత్తరమీమాంస అని అనటం జరిగింది. వివేచనా
వితర్క, విచికిత్సల సంయోగమే మీమాంస.
పూర్వమీమాంస కర్త జైమిని . జైమిని సూత్రాలు కర్మకాండను,
యజ్ఞ యాగాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ముఖ్యోద్ధేశ్యంగా
రచించబడ్డాయని ఒక అభిప్రాయం. మీమాంసా దర్శనములో 2500 సూత్రాలున్నాయి.
ఇవి 12 అధ్యాయాలుగా, 60 పాదాలుగా
ఉన్నాయి.
"అథాతో ధర్మజిజ్ఞాసా" అని జైమిని పూర్వమీమాంసా సూత్రాలు
ప్రారంభమవుతాయి. అంటే "ఇప్పుడు ధర్మాన్ని గురించి వివేచన చేద్దాము" అని
అర్థం. పూర్వమీమాంస ధర్మోద్ధరణకు ఉద్ధేశించిన దర్శనం. ధర్మం అంటే వేదధర్మం. అంటే
యజ్ఞయాగాది కర్మకాండ. అందుచేత దీనికి కర్మ మీమాంస, ధర్మ
మీమాంస అనే పేర్లు కూడా ఉన్నాయి.
యజ్ఞ కర్మకాండకు ఆధారం బ్రాహ్మణాలు . ఏ యజ్ఞాలను ఏ విధంగా చేయాలి, ఏ కర్మలను ఏ క్రమంలో
చేయాలి మొదలైన అనేక విషయాలపై సందేహాలు బయలుదేరినప్పుడు వాటిపై వివిధ సందర్భాలలో
చర్చలు జరిగేవి. ఆ చర్చలపై ఆధారపడి వాటి సారాంశాన్ని సూత్రాల రూపంలో మీమాంస
దర్శనంగా జైమిని క్రోడీకరించినాడు.
ఉత్తర మీమాంస:
వ్యాస
విరచితమైన బ్రహ్మ సూత్రములే షడ్దర్శనాలలో ఆఖరిదైన
ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము.
బాదరాయణునిచే
సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ,
వేదాంతాన్ని
వివరిస్తాయి కనుక వేదాంత
సూత్రాలనీ, బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక
బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మ సూత్రాలని పేరు వచ్చింది.
శరీరి (శరీర
పరివృతుడైన జీవాత్మ) గురించి మీమాంసించడం వలన శారీరక మీమాంస అని కూడా అంటారు.
అందుకే బ్రహ్మసూత్రాలకు శంకరుడు వ్రాసిన
భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ సూత్రములను
వ్రాసినది
బాదరయణుడు అని ఆదిశంకరుడు స్పస్టముగ
వ్రాసినా
బాదరయణుడు మరియు వ్యాసుడు ఒకరే అను విషయములో కచ్చితమైన
ఆధారములు లేవు.
ఇందులో జైన, బౌద్ధ మతములను
పరామర్సించుట
చేత, ఆ మతములు మన
దేశములో ప్రచారమైన తర్వాత ఈ గ్రంథము రచించి యుండవచ్చునని తెలియవచ్చుచున్నది. బ్రహ్మసూత్ర
గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ప్రతీ
అధ్యాయంలో నాలుగు పాదాలు, ప్రతి పాదంలో కొన్ని అధికరణాల
చొప్పున మొత్తం 192 అధికరణాలు, ప్రతి
అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు
ఉన్నాయి. శంకరునితోపాటు రామానుజుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు మొదలైనవారు
కూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలను
రచించడం జరిగింది.
ఇందలి ప్రథమమున
గల నాలుగు సూత్రములు మాత్రము బహు మిక్కిలిగా గురువులు తమ శిష్యులకు
బోధింతురు.వీటిని "చతుస్సూత్రి"
అని అంటారు.
దీనితో పాటు
శంకరులవారి అధ్యాస భాష్యము చాల
ముఖ్యమైనది.
అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో
అవగతము
చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును
గ్రహించుట బహు
సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల
మాటలు, సారమైన
విషయము, వివిధములైన
అర్ధములు దానియందుండ వలయును.
అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు.
సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున
దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.
నేను
వేదాంత పండితుడను గాను. ఆ మాటకు వస్తే పండితుడను కూడా
కాను. నేను నికరముగా
అర్థము చేసుకొన్న దానిలో నాకు తోచిన
ముఖ్యాంశములను మీ ముందుంచే ఉత్సాహమే నన్ను ఈ
పనికి
పురికొల్పినది. దాసరి తప్పులు దండముతోసరి.
స్వస్తి.
|
No comments:
Post a Comment