Sunday, 7 January 2018

సంక్రాంతి పర్వము

సంక్రాంతి పర్వము
https://cherukuramamohanrao.blogspot.com/2018/01/blog-post_7.html
తీర్చివేసి భయము భ్రాంతి
రైతు కళ్ళలోన కాంతి 
సగటుమనిషిలోన శాంతి
తెచ్చునదే సంక్రాంతి 
మకర సంక్రమణము ఆసన్నమైనది. పల్లెల్లో, ఒక మోస్తరు పెద్ద ఊర్లలో కూడా మారోజుల్లో ఎంతో వేడుకతో జరిపే వారు. వీధులు పూర్తిగా ఆవు పేడతో అలుకబడినాయా అన్నట్లు ఉండేవి. పిండి అంటే ముగ్గులు బియ్యపుపిండితో వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారుచేసి అందులో గుమ్మడి పూవులు కానీ బంతిపూవులు కానీ కుచ్చేవారు. నేడు పల్లెలలో అదే విధముగా జరుగుతూ వుందో లేదు తెలియదు. పట్నవాసులు  తమతమ వీధివారలతో కలిసి ముగ్గులు గొబ్బిళ్ళు పెట్టె వేడుక సామూహికంగా చేస్తే మన సంస్కృతిని పునః ప్రతిష్ఠ చేసినవారవుతారని నా ఆశ. అందుకే సంక్రాంతి ఎందుకు చేయవలెను అన్న విషయముపై కాక నలుగురు సంఘటితమయ్యే విషయమును గూర్చి తెలుపుచున్నాను.
ముగ్గులు రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో ఆవు పేడతో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం.  చుక్కలు నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరిగే వంకర గీతలు ఖగోళ చలనములకు  సంకేతం.  ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (Static Force),చుక్కలు గతిశక్తి (Dynamic Force)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర  ప్రతీకలని తత్త్వవేత్తలు అంటారు. ఇంకొక విషయమేమిటంటే ముగ్గు పరమాణు నిర్మాణమునకు  ప్రతీక. పరాత్పరుడు "అణోరనీయాన్ - మహతో మహీయాన్" . ఆయన అణువునకు లోన అణువుగా ఉంటాడు. బయట అంతట వ్యాపించి బయటి వాటి కంటే గొప్ప వాడై ఉంటాడు. కావున ఈ ముగ్గులు పరమాత్మ తత్వమునకు ప్రతీక. జీవ కారుణ్య చిత్తముతో పరిశీలించిన పిపీలికాది  (చీమలవంటి) ప్రాణులకు 
ఆహారమును సమకూర్చినవారమవుతాము. విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, ముగ్గులు వేయటం కద్దు. ఇదే విధముగా రాశులకు, నవగ్రహాలుకూ సంకేతాలుగా వేస్తారు. ఉత్తరాయణ సూర్యగమన సంకేతముగా రథము ముగ్గును
వేస్తారు. రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్యస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు అని గోపి+ఇళ్ళు గొబ్బిళ్ళని చెబుతూవుంటారు. సంధి ఈ విధముగా ఉండవచ్చునని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు చెప్పియుండినారు. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తారు. గుమ్మడి సూర్యుని ప్రతీకగా దానము ఇస్తారు. సూర్యుని తోలికిరణములకు ప్రతీకగా గుమ్మడి పూవులను గొబ్బెమ్మలకు అలంకరించుతారు.
పొంగలి 
కొత్త బియ్యము కొత్త బెల్లము తో ఆరుబయట పొయ్యిలో పొంగు వచ్చేవరకు ఉడికించి ఆ పొంగు కొంత జారి పొయ్యిలో పడేసమయమున ప్రకృతికి నైవేద్యము చేయుచున్నట్లు భావించి పొంగులో పొంగులు అని అరచేవారు పూర్వము. మన పల్లెలలో ఇంకా జరుపుచున్నారేమో నాకుతెలియాడు గానీ తమిళనాడులో, మద్రాసు వంటి పట్టణములలో కూడా నేటికీ ఈ సాంప్రదాయమును పాటించుతారు. 
ఇంత సంస్కతిని కల్గిన ఈ పండగను పట్టణములలో కూడా అన్యోన్యతతో కూడి ఆనందముగా జరుపుతాము.

స్వస్తి. 

2 comments:

  1. Highly informative sir. We are only fit for eating Pongal but at the back of the track such an informative reasons published by you is totally applaudable. Thanks for the post.

    ReplyDelete
  2. సంక్రాంతి సంబరాలు పల్లెలో,పట్టణాల్లో జరిగే తీరుని మన హైందవ సంస్కృతి,భక్తి సంప్రదాయాలతో యెలా అనుసంధానమైనదో చాలా వివరంగా వ్యాఖ్యానించారు.వివిధ రకాల ముగ్గులకూ, గొబ్బెమ్మలు అందలి,గీతాలు,చుక్కలు, చిత్రములు చిత్రణకు, వాటికి కృష్ణ భక్తి,పురాణములకు గల సంబంధము,పరమాన్నము,పొంగలి తయారీలిని పరమార్ధములను చాలా గొప్పగా వివరించారు..
    హైందవ సంప్రదాయాలపై మీ అవగాహన అమోఘమైనది.మీకు అనేక అభినందనలండీ రామ మోహన రావు గారూ.

    ReplyDelete