Tuesday, 23 January 2018

అక్షతల ప్రాముఖ్యత

అక్షతల ప్రాముఖ్యత
https://cherukuramamohanrao.blogspot.com/2018/01/blog-post_86.html
నవగ్రహ దానాలలో ధాన్యము యొక్క పాత్ర విశిష్ట మైనది. నవగ్రహాల్లో ఒక్కోగ్రహానికి ఒక్కోధాన్యము ప్రీతికరమయుంటుంది.  సూర్యునికి గోధుమలు, చంద్రునికి బియ్యము, అంగారకునికి కందులుబుధునికి పెసలు, బృహస్పతికి  శెనగలు, శుక్రునికి అలసందలు(బబ్బర్లు), శనికి నువ్వులు. ఆవిధముగా చంద్రునికి ప్రీతికరమైనది  బియ్యము. జ్యోతిశ్శాస్త్రము ప్రకారము చంద్రుడు మనస్సుకు అధిపతి. మనిషి మనసు, బుద్ధి, గుణమువ్యసనము ఇత్యాదులన్నీ చంద్రప్రభావము వలననే జరుగుతాయంటారు పెద్దలు.  అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.
బియ్యము మనోధర్మాన్నినియంత్రిస్తాయి. శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓవిద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చు తగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్నిచూపుతాయి. మనుషుల్లో సత్వ రజస్తమో గుణములకు ఆకరము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తు కొంతబాగం ఆశీస్సులు ఇచ్చేవాళ్ల నుండి, పుచ్చుకొనే వాళ్లకు కొంత బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలోఉండే సాత్వికగుణం పిన్నలకు లభిస్తుందనేది మననమ్మకం.
వివాహశుభకార్యంలో జీలకర్ర, బెల్లంపెట్టేవేళ, మాంగళ్యధారణవేళ, వధూవరులపై అహూతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం.
వివాహశుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ, సంతానప్రాప్తిరస్తు, ఆరోగ్యమస్తు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించేది మనకు చిరపరిచితమే! ఇక దైవసన్నిధిలో సరేసరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. అక్షతలు అనే మాట నుంచి వచ్చిందే అక్షింతలు. క్షతము అంటే గాయము లేక నొప్పి  కలిగించనివి అక్షతలు (అ+క్షత). క్షతికి గురి కానివి అన్న అన్వయమును తీసుకొని ఈ అక్షింతలు కలుపునపుడు నూక లేని బియ్యము వాడుతారు. ఆ బియ్యాన్ని ముఖ్యముగా పసుపు నేతితో కలిపి అక్షతలు తయారుచేస్తారు.
కొన్నిచోట్ల పసుపు బదులు కుంకుమ కూడా వాడతాము కద్దు. పెద్దలు, విద్వాంసులు, గురువులు, పండితులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహసమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలువేసి శిరస్సునుతాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పరమార్థంఇదే! మరోసిద్ధాంతం ప్రకారంచూస్తే మనిషిదేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవైనాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమేకాదు. విద్యుత్ ప్రసారకేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడంద్వారా వాటిలోని విద్యుత్ను గ్రహించి దేహానికి ప్రసారంచేస్తుంది శిరస్సు. అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడంఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్నిఅడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుండి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంటుంది. అక్షతలు వేసేవారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వున్నా, వేయించుకొనే వారికి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపుకుంకుమలు శుభానికి సంకేతాలు కూడా.
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం. భగవద్గీతలో అన్నాద్భవన్తిభూతాని అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు. జీవులు అన్నంచేత పుడతారట.
 ఈ అన్నం ఎలా తయారవుతుందో మనం కొంచెం తరచి చూద్దాం. సూర్యరశ్మి వలన మొక్కలు ఆకులలో ఉన్న పత్రహరితము (chlorophyll) యొక్క సాయముతో కిరణ జన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా ఆ మొక్క లేక చెట్టు శక్తిని ప్రోది చేసుకుంటుంది. రాత్రి వేళల చంద్రుని కిరణాల వలన అవి వృద్ధి చెందుతాయి. సూర్య చంద్రులు లేకపోతే అవి పూర్తిగా ఎదగలేవు అన్నది సత్యము. ఆ మొక్కలలో నీటిని సరైన దారి మళ్ళించి ఆ మొక్కలు పెరగడానికి దోహద పడతాయి చంద్ర కిరణాలు. Dr. Rudolf స్టినేర్ అనే ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఈ విషయమై ఎన్నో ప్రయోగాలు చేసి కనుకొన్న వాస్తవాలు ఏమిటంటే పౌర్ణమి కి అటు ఇటు 48 గంటల వ్యవధిలో భూమిలో నీటి తేమ శాతం ఎక్కువ వుండడం వలన ఆ మొక్కల ఎదుగుదల చాలా త్వరితంగా వుంటుంది అన్నది. అందుకే శీతల దేశాలలో కూడా చెట్లు ఎన్నో రోజులు ఎండ చూడక పోయినా కేవలం చంద్ర ప్రభావం వలన అవి ఎదుగుతాయి. చంద్రమా మనసోజాత: అని వేదవాక్కు. చంద్రుడు భగవానుని మనసు నుండి పుట్టినాడు. అందుకే చంద్రుని వెన్నెల ప్రతి వారి మనసును వికారానికి గురి చేస్తుంది. సూర్యుని ఎండే చంద్రుడి ద్వారా వెన్నెలగా ప్రసరిస్తుంది. ఈ చంద్రుడు తన అమృతం ద్వారా దేవతలను, కవ్యము ద్వారా పితృదేవతలను, పంటల ద్వారా మానవులను, మంచు, వెన్నెలతో సకల వృక్షజాతిని వాటి ద్వారా పండ్లని ఇచ్చి పక్షులను పోషిస్తాడు. అందుకే చంద్రుడిని ఓషధీశుడు, ద్విజరాజు అని వ్యవహరిస్తారు. ఇది ఉపనిషద్ వాక్యము. అసలు సాంకేతికముగా లక్ష్మికి సోదరుడు చంద్రుడు. లక్ష్మి అంటే సిరి సంపద. చంద్రుడు లేనిచోట లక్ష్మి లేదు. అంటే చూడండి చంద్రునికి తద్వారా తండులము అంటే బియ్యమునకు తద్వారా అక్షతలకు ఎంత ప్రాధాన్యత వుందో!
 తిరిగీ విషయానికి వస్తే ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈఅన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు. 'తల' పైన పోయబడే, ప్రాలు అంటే  బియ్యము అని అర్థము. పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఓవధువా! నీవు నాతో ఇంటికి వచ్చిన పిదప  మన ఇంట ధాన్యం ఈవిధముగా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి మనము సుఖ సంపదలతో తులతూగవలెను అన్న భావమునకు ప్రతీకగా తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనేదానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్నివేసి, ఆమీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసిన పిదప వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు. ఈ కన్య వంశాన్నితరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేక పోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికికల్గుగాక! అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహ కర్మమొత్తం అక్షతము (నాశనములేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శదంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదించడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

1 comment:

  1. Very explicitly described article. Things beyond ones reach have been briefed by you sir. Thanks for the post.

    ReplyDelete